ETV Bharat / state

అనుమతి ఒకచోట.. తవ్వేది మరోచోట.. హైకోర్టు ఉత్తర్వులను లెక్కచేయని ఇసుక మాఫియా

author img

By

Published : Dec 22, 2022, 12:22 PM IST

Sand Mafia: ఇసుక తవ్వకాల కోసం ప్రభుత్వం అనుమతిచ్చింది ఓ చోట. కానీ వారు తవ్వేది మరో చోట. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం వారు లెక్కచేయకుండా యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. నదిలో భారీ యంత్రాలు ఏర్పాటు చేసి వందలాది టిప్పర్లతో పొరుగు జిల్లాలకు పెద్దఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. అనంతపురం జిల్లాలో పెన్నా నదిలో పామిడి వద్ద ఇసుక మాఫియా అరాచకాలకు అడ్డులేకుండాపోతోంది.

sand mafia
ఇసుక మాఫియా

Sand Mafia: అనంతపురం జిల్లాలో పెన్నానది పొడవునా ఇసుక మాఫియా పేట్రేగి పోతోందనే విమర్శలున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో నదిని పంచుకొని వీరు యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. పామిడి మండలం తంబాలపల్లి వద్ద ఇసుక తవ్వకాలకు జైప్రకాశ్ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అక్కడ ఇసుక నాణ్యతగా లేకపోవటంతో వంకరాజుకాలువ వద్ద పెన్నానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. నదిలో భారీ యంత్రాలు ఏర్పాటు చేసి వందలాది టిప్పర్లతో పెద్దఎత్తున పొరుగు జిల్లాలకు తరలిస్తున్నారు. దీనిపై అక్కడి గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో తాగునీటి పథకాలకు ప్రమాదం పొంచిఉందంటున్న రైతులు.. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు.

తమకు అండగా నిలవాలని తెదేపా నేత జీవానందరెడ్డిని గ్రామస్తులు కోరటంతో.. ఆయన పీజేఆర్ ట్రస్టు తరపున హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. నీటి వనరులున్న వంకరాజుకాలువ వద్ద ఎట్టి పరిస్థితుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతించవద్దని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని జీవానందరెడ్డి పామిడి మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్, పామిడి సీఐలతో పాటు మైనింగ్ అధికారులు, తహసీల్దార్‌కు పిర్యాదు చేశారు. సరైన స్పందన లేనందున కోర్టు ధిక్కరణ నేరం కింద జిల్లా కలెక్టర్‌పై ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే.. మాఫియాతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారని జీవానందరెడ్డి ఆరోపిస్తున్నారు.

పామిడి మండలంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని.. ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటి ఆ సమస్య మరింత తీవ్రమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఇష్టారీతిన ఇసుక తరలించుకుపోవడం వలన భూగర్భ జలాలు అడుగుంటుతున్నాయి. భారీ లారీలతో ఇసుకను తీసుకునిపోతున్నారు.ఎమ్మెల్యే ఒత్తిడిలు వలనే ఇలా చేస్తున్నారు ఏమో". - మారుతి శివప్రసాదరెడ్డి, రైతు

"చాలా సంవత్సరాల తరువాత..ఇప్పడిప్పుడే నీళ్లు పారుతున్నాయి. ఇసుక తరలిపోవడం వలన వ్యవసాయానికి, తాగడానికి కష్టమయ్యే పరిస్థితి ఉంది". - ఓబులపతి, రైతు

"హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. మైనింగు అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ నాయకులకు అధికారులు అమ్ముడుపోయారా.. పెద్ద పెద్ద టిప్పర్లతో తరలించుకు పోతున్నారు". - పెరుమాళ్ల జీవానందరెడ్డి, తెదేపా నేత

అనంతపురంలో ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.