ETV Bharat / state

ముంచిన వర్షాలు.. కనికరించని కంది!

author img

By

Published : Dec 23, 2020, 1:44 PM IST

ఖరీఫ్​లో పంటల్లో చివరి ఆశగా మిగిలిన కంది కూడా చేతికి రాకుండా అనంతపురం జిల్లా రైతుకు అప్పులే మిగిల్చింది. సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాలతో కంది పంటకు మేలు జరుగుతుందని రైతులు ఆనంద పడ్డారు. మొగ్గ దశలో కురిసిన కుండపోత వర్షం కారణంగా చీడ, పీడలు సోకాయి. వాటి నివారణకు రైతులు వేలకు వేలు ఖర్చు చేశారు. ఇంతలో.. నవంబర్ తొలి వారంలో కురిసిన వర్షాలకు కంది పిందెలు, పూత పూర్తిగా రాలిపోయాయి. కోలుకోలేనంతగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

rains effect on red gram crop at ananthapur
rains effect on red gram crop at ananthapur

కందిపంట నష్టం

ఏటా కరవుతో పంట నష్టపోయే అనంత రైతులకు.. ఈసారి భారీ వర్షాలు శోకాన్ని మిగిల్చాయి. చినుకు కోసం తపించే అనంతపురం జిల్లా రైతుల పంటలను భారీ వర్షాలు తుడిచిపెట్టాయి. ఖరీఫ్ పంటలన్నీ నష్టాలను మిగిల్చగా.. చివరగా చేతికొచ్చే కందిపై అశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పెట్టబడులు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది కంది పంట విస్తీర్ణం తక్కువగా ఉన్న కారణంగా... మంచి ధర పలుకుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా పంటపై చీడ, పీడలు దాడి చేశాయి. మందులు పిచికారీ చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఉన్న కొంత పిందెలు, పూత నవంబర్​ తొలి వారంలో కురిసిన వర్షాలకు రాలిపోయాయి. పంట నూర్పిడి చేయిస్తే కోత ఖర్చులు రావని అలాగే వదిలేసినట్లు రైతులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల రైతులు వచ్చినవరకైనా నూర్పిడి చేసుకోవాలని, కుటుంబ సభ్యులే పంటను కోసి, పూర్వపు పద్థతిలో ఖర్చు లేకుండా కందులు రాల్చుకుంటున్నారు.

పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. శాస్త్రీయంగా నిర్థరణ అయితేనే బీమా సంస్థ నుంచి పరిహారం అందే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

అనపర్తి, బిక్కవోలులో తీవ్ర ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.