ETV Bharat / state

Spandana: 'స్పందించని' అధికారులు.. ఏళ్లు గడుస్తున్నా తీరని సమస్యలు

author img

By

Published : Apr 18, 2023, 1:59 PM IST

Updated : Apr 18, 2023, 3:34 PM IST

Etv Bharat
Etv Bharat

Spandana Program : అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరి అవకాశమని భావించి స్పందన కార్యక్రమానికి వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతోంది. న్యాయం జరుగుతుందని ఆశతో వచ్చే వారికి.. సేవా భావం బాధ్యతలు మరిచిన అధికారుల వల్ల తిప్పలు తప్పటం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సమస్యలు పరిష్కారం కానప్పుడు నిర్వహించటం ఎందుకంటూ సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

No Response in Spandana Program : భూ సమస్య, ఇంటి తగాదా, దారి సమస్య, భూ సర్వేలో ఇబ్బందులు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో స్పందన మెట్లు ఎక్కుతున్నారు. తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతున్నా.. అడిగి అడిగి గొంతులారిపోతున్నా వారి సమస్య మాత్రం తీరడం లేదు. పదుల సార్లు దరఖాస్తులతో ఫైళ్లు నిండిపోయేలా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్పందనలో సమస్యలు తీరక.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాధితులకు నిరాశే మిగులుతోంది. ప్రభుత్వం గొప్పగా చెప్తున్న సమస్యలు మారటం తీరటం లేదని భాదితులు వాపోతున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో కలెక్టర్లు నిర్వహిస్తున్న స్పందనకు.. దిగువ స్థాయి అధికారుల నుంచి స్పందన కరవైంది. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు చెబితే సమస్య పరిష్కారం అవుతుందని గంపెడాశతో వస్తున్న బాధితులకు నిరాశే మిగులుతోంది. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత శాఖాధికారులకు, మండల స్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నారు. అయితే ఆదేశాలు అమలు చేస్తున్నారా లేదా ‌అని పరిశీలించే వ్యవస్థ లేకపోవడంతో.. బాధితులు పలుమార్లు స్పందన చుట్టూ తిరగక తప్పడం లేదు. ఒకే సమస్యపై ఏళ్ల తరబడి స్పందనలో పదుల సార్లు ఫిర్యాదులు చేస్తున్నవారు కొందరైతే, ఏడాదిన్నర నుంచి తిరుగుతున్న బాధితులు చాలా మంది ఉన్నారు. స్పందనకు వస్తున్న బాధితులను ఎవరిని కదిలించినా.. అధికారులపై గుర్రుమంటున్నారు. జగనన్న భూహక్కు, భూసర్వేతో.. యజమానుల మధ్య గొడవలు తలెత్తినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా స్పందన కార్యక్రమంలో స్పందించని అధికారులు

"సంవత్సరం నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న.. నాకు భూ సమస్య ఉంది. నా సమస్య ఎవరూ పట్టించుకోవటం లేదు. ప్రతిదినం రావటం పోవటం... గట్టిగా అడిగితే తహసీల్దార్​ నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు."-బాధితుడు

అర్డీవో ఆదేశాలను పట్టించుకోని తహసీల్దార్​ : కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులు జారీచేసే ఆదేశాలు.. క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. రాప్తాడు మండలం బొమ్మేపర్తిలో ఓ రైతు భూమిని సర్వేచేసి న్యాయం చేయాలని ఆర్డీవో ఇచ్చిన ఆదేశాలు అక్కడి తహసీల్దార్ పట్టించుకోలేదని.. ఫలితంగా కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు.

స్పందనలో సమస్యలు తీరడం లేదని.. అలాంటప్పుడు ఎందుకు వీటిని నిర్వహించడమని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు తిరిగినా.. ఉపయోగం లేకుండా పోతోందని మండిపడుతున్నారు. స్పందనకు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారానికి కిందిస్థాయి అధికారులకు కలెక్టర్లు ఆదేశాలిస్తున్నారే తప్ప.. వాటిని పట్టించుకోవడం లేదని గట్టిగా విమర్శలు వినిపిస్తున్నాయి.

"ప్రతి సోమవారం జరుగుతున్న స్పందనలో బాధితులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. సమస్యలు తీరటం లేదు. అంతేకాకుండా ఒకే సమస్యపై పదే పదే వినతులు ఇవ్వాల్సినా దుస్థితి. నేను ఇప్పటి వరకు దాదాపు 330 సమస్యలపై స్పందనలో ఫిర్యాదు చేశాను." -అనిల్​ కుమార్​, సామాజిక కార్యకర్త

ఇవీ చదవండి :

Last Updated :Apr 18, 2023, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.