61 మండలాల్లో ఎంపీపీల ఎన్నిక.. తలుపులలో వివాదం

author img

By

Published : Sep 25, 2021, 9:21 AM IST

mpp elections in anantapuram district

అనంతపురం జిల్లాలో 61 మండలాల్లో ఎంపీపీ ఎన్నిక జరిగింది. అమరాపురం, ఆగళిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. తలుపుల మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక వివాదంగా మారింది. ఎన్నిక నిర్వహించకుండానే.. ఎంపీపీని ఏకగ్రీవం చేశారని ఆరోపిస్తూ 8 మంది ఎంపీటీసీ సభ్యులు నిరసనకు దిగారు.

అనంతపురం జిల్లాలోని మండలాలకు కొత్త సారథులు వచ్చేశారు.. మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షులు కొలువుదీరారు. ఈ పదవులకు శుక్రవారం జరిగిన ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వచ్చే ఐదేళ్లకోసం ఆయా మండలాల ఎంపీపీలను ఎన్నుకున్నారు. అన్నింటా వైకాపాకు చెందిన అభ్యర్థులే ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. జిల్లాలో మొత్తం 63 మండల పరిషత్తులకు ఎన్నికలు జరగగా.. అన్నింటిలో మెజార్టీ స్థానాలను వైకాపా సొంతం చేసుకుంది. పలు కారణాలతో అగళి, అమరాపురం మండలాల్లో ఎన్నిక వాయిదా పడగా.. మిగిలిన 61 స్థానాల్లో ప్రక్రియ పూర్తి చేశారు. ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉదయం 10 గంటలకే కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికను ప్రకటించారు. ఇవి కూడా ఏకగ్రీవమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలలోపు పరిషత్తు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. తలుపుల మండలం ఎంపీపీ ఎన్నికలో హైడ్రామా నెలకొంది. అధికార పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులు రెండు వర్గాలుగా విడిపోవడంతో వివాదం చెలరేగింది. ఓ వర్గం నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికను ముగించినట్లు విమర్శలు వచ్చాయి. పలుచోట్ల అసమ్మతులను స్థానిక ఎమ్మెల్యేలు బుజ్జగించారు. కొన్నిచోట్ల చెరి రెండున్నరేళ్ల ప్రతిపాదనతో ఎన్నిక పూర్తిచేశారు.

అగళిలో హైడ్రామా

మండలానికి చెందిన క్షేత్ర సహాయకుడు నాసిర్‌ ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఈయన కో-ఆప్షన్‌ సభ్యుడి స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించడంతో ఎన్నిక ప్రక్రియ మొత్తం వాయిదా పడింది. నిబంధనల ప్రకారం 20 రోజుల ముందే రాజీనామా ఇవ్వాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఇవ్వడంతో సమస్య ఎదురైంది. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదించిన వ్యక్తిని కాదని వేరే వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకోవాలని మెజార్టీ ఎంపీటీసీలు మొగ్గుచూపినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎన్నిక వాయిదా వేయించాలనే ఉద్దేశంతోనే ఈ తంతు సాగినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎంపీటీసీ సభ్యురాలి రాజీనామా!

ఆత్మకూరు-1 ఎంపీటీసీ స్థానం నుంచి వైకాపా తరపున గెలిచిన లీలావతి రాజీనామా చేస్తూ ఎన్నికల అధికారికి లేఖను అందజేశారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎంపీపీ పదవి కావాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరగా హామీ ఇచ్చారని, ఇప్పుడు మాట తప్పారని ఆమె ఆరోపించారు. ఆత్మకూరు-2 నుంచి గెలుపొందిన హేమలతకు ఎంపీపీ, పి.యాలేరు ఎంపీటీసీ నీలిమకు వైస్‌ ఎంపీపీ పదవులు ఇచ్చారు. పార్టీ నిర్ణయంతో లీలావతి అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్నికల అధికారికి లేఖ అందజేశారు.

కోరం లేకపోవడంతో..

ఎంపీడీఓ కార్యాలయంలో సభ్యులు హాజరు కాకపోవడంతో ఖాళీగా కుర్చీలు

అమరాపురం, అగళి మండలాల్లో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. అమరాపురంలో ఎమ్మెల్యే తిప్పేస్వామి మద్దతుదారు హేమావతి-3 ఎంపీటీసీ స్థానం నుంచి గెలుపొందిన ఈరన్నకు పార్టీ బీఫారమ్‌ ఇచ్చారు. అయితే స్థానిక నాయకులు ఎమ్మెల్యే మద్దతుదారుకు వ్యతిరేకంగా అమరాపురం-1 శాంతమణిని ఎంపీపీగా నియమించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు తమ్మడేపల్లి-2 నుంచి గెలుపొందిన లలితమ్మను కూడా ఎంపీపీగా చేయాలని మరో వర్గం ప్రయత్నాలు చేసింది. దీంతో ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిన ఎంపీటీసీ సభ్యులు సాయంత్రం వరకు రాలేదు. దీంతో ఎన్నికల అధికారి అమర్‌ కోరం లేనికారణంగా ఎన్నికను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైకాపా నాయకులు సభ్యులందరినీ మడకశిరకు తరలించి ఎంపీపీ పదవిని చెరిసగం విభజించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

తలుపులు మూసేసి..

.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనూ పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్రహ్మసముద్రం మండలంలో పిల్లలపల్లి ఎంపీటీసీగా గెలుపొందిన చంద్రశేఖర్‌రెడ్డికి ఎంపీపీ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే నిర్ణయించారు. అయితే సింగిల్‌విండో అధ్యక్షుడు రామాంజనేయులు భార్య రేణుక బైరవసముద్రం నుంచి ఎంపీటీసీగా విజయం సాధించారు. తన భార్యను ఎంపీపీ చేయాలన్న ఉద్దేశంతో సింగిల్‌విండో అధ్యక్షుడు ప్రయత్నాలు చేశారు. ఓటింగ్‌ జరిగితే సభ్యులు రేణుకకు మద్దతిస్తారనే అనుమానంతో ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని దాదాపు మూడు గంటల పాటు తలుపులు మూసేసి చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చేశారు.

చెరి రెండున్నరేళ్లు

అమడగూరు మండల అధ్యక్ష పదవిని ఇద్దరికి పంచినట్లు తెలిసింది. కొట్టువారిపల్లి ఎంపీటీసీ ప్రసాద్‌రెడ్డి, జౌకలకొత్తపల్లి ఎంపీటీసీ జయమ్మ ఎంపీపీ కోసం పట్టుపట్టారు. దీంతో చెరి రెండున్నరేళ్లు పదవి చేపట్టేలా నాయకులు ఒప్పందం చేసినట్లు సమాచారం. ఉపాధ్యక్ష పదవికి కూడా చినగానిపల్లి ఎంపీటీసీ గంగులమ్మ, అమడగూరు ఎంపీటీసీ వెంకటరమణ పోటీ పడడంతో వీరికి రెండున్నరేళ్ల ప్రకారం ఒప్పందం జరిగిందని వైకాపా శ్రేణులు తెలిపాయి.

తలుపులలో వివాదం

రిటర్నింగ్‌ అధికారి మురళీని ప్రశ్నిస్తున్న ఎంపీటీసీ సభ్యులు, వైకాపా సీఈసీ సభ్యుడు పూలశ్రీనివాస్‌రెడ్డి

తలుపుల మండల పరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక వివాదంగా మారింది. ఎన్నిక నిర్వహించకుండానే.. ఎంపీపీని ఏకగ్రీవం చేశారని ఆరోపిస్తూ 8 మంది ఎంపీటీసీ సభ్యులు నిరసనకు దిగారు. మండలంలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 10 వైకాపా, 2 తెదేపా కైవసం చేసుకున్నాయి. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో కోఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక కోసం రిటర్నింగ్‌ అధికారి మురళీ నామినేషన్లు స్వీకరించారు. ముగ్గురు సభ్యులు నామినేషన్‌ వేయగా.. ఇద్దరి నామపత్రాలను తిరస్కరించి, కోఆప్షన్‌ సభ్యుడిగా మహమ్మద్‌ పీరా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎలాంటి కారణం చెప్పకుండా తమ నామపత్రాలు ఎలా తిరస్కరిస్తారని ఇద్దరు సభ్యులు అధికారులను నిలదీశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం తలుపులు, కిటికీలు మూసివేసి ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. తలుపుల-2 ఎంపీటీసీ సభ్యుడు రఫీ నాయక్‌ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమ అభిప్రాయం తీసుకోకుండా.. ఓటింగ్‌ నిర్వహించకుండా ఎంపీపీని ఎలా ఎన్నుకుంటారని ఆరుగురు వైకాపా, ఇద్దరు తెదేపా ఎంపీటీసీ సభ్యులు ఆర్వో ఎదుట నిరసనకు దిగారు. వారికి మద్దతుగా వైకాపా సీఈసీ సభ్యుడు పూల శ్రీనివాస్‌రెడ్డి నిలిచారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపీపీ ఎన్నిక జరగలేదని ఆరోపించారు. తలుపుల-3 ఎంపీటీసీ హైదర్‌బీని ఎంపీపీగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఎంపీడీవో కార్యాలయంలోనే ఉంటామని ధర్నాకు దిగారు. ఆర్వో చేసిన తప్పిదంపై కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేస్తామని అసమ్మతి ఎంపీటీసీ సభ్యులు తెలిపారు.

.

ఇదీ చదవండి: అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.