ETV Bharat / state

భారీ వర్షాలు: కోతకు గురైన రోడ్డు.. యార్డుల్లో తడిసిన ధాన్యం

author img

By

Published : May 22, 2021, 4:33 PM IST

భారీ వర్షం : కోతకు గురైన రోడ్డు.. ఐదు గ్రామాల రాకపోకలు బంద్
భారీ వర్షం : కోతకు గురైన రోడ్డు.. ఐదు గ్రామాల రాకపోకలు బంద్

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టించగా.. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాలతో అన్నదాతల్లో సంతోషం వెల్లివిరిసింది. భారీగా కురిసిన వానకు పలుచోట్ల రోడ్లు కోతకు గురవ్వగా, మరికొన్ని ప్రదేశాల్లో యార్డుల్లో ఉన్న ధాన్యం కోతకు గురైంది.

అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతంల్లో శుక్రవారం వర్షం బీభత్సం సృష్టించింది. రొద్దం పరిధిలోని బూచర్ల గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కోతకు గురైంది. అధికారిక లెక్కల ప్రకారం రొద్దం మండల వ్యాప్తంగా శుక్రవారం 57 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కోతకు గురైన రోడ్డులో ప్రయాణం సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

త్వరితగతిన వంతెన కావాలి..

గొల్లపల్లి జలాశయం నుంచి పేరూరు డ్యామ్​కు కృష్ణా జలాలను తరలించే క్రమంలో మార్గంమధ్యలో ఏర్పాటు చేసిన కల్వర్టును తొలగించారు. ఈ మేరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ మార్గంలో ప్రయాణించే బూచర్ల నాగిరెడ్డి పల్లి, కనుమర, కుర్లపల్లి, నారా నాగేపల్లి గ్రామాల ప్రజలు ఉదయాన్నే రొద్దంలోని వార సంతకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కోతకు గురైన రోడ్డులో అడ్డంగా పారుతున్న వర్షపు నీటిలో దిగి ఇబ్బందికరంగా ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వంతెన నిర్మాణం త్వరగా చేయాలని కోరుతున్నారు.

కృష్ణా జిల్లాలో..

కృష్ణా జిల్లా మైలవరంలోని మార్కెట్ యార్డులో రాత్రి వర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులో వసతుల లేమి, టార్ఫాలిన్ కవర్లు సైతం లేకపోవడంతో ధాన్యానికి భద్రత కరువైంది. రైతులు నిస్సహాయ స్థితిలో చేసేది లేక తడిచిన ధాన్యాన్ని యార్డులోనే వదిలేసి బాధతో వెళ్లారు.

కడప జిల్లాలో..

కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలంగా తొలకరి వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిలో 42.7 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. ఫలితంగా మాండవ్య నదిలో వర్షపు నీరు పారింది. మెట్ట భూముల్లో వేరుసెనగ సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. లోతుగా దుక్కులు దున్నడం వల్ల పంటను ఆశించే క్రిమి కీటకాలు నశిస్తాయని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం జిల్లాలోని పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పోలాకి మండలాల్లో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోత నేపథ్యంలో వానలు పడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.

ఇవీ చూడండి : 'ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైనా దాడులకు దిగుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.