ETV Bharat / state

భారీ వర్షాలకు పంటలన్నీ నీటిపాలు.. నిరాశలో అనంత రైతులు

author img

By

Published : Sep 26, 2020, 7:16 PM IST

ఆ జిల్లాలో కరవు ఎప్పుడు తిష్టవేసుకుంటుంది. ఏటా కరవు సంభవిస్తూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వర్షాభావ పరిస్థితులకు నిలయంగా అనంతపురం జిల్లా. అలాంటి రైతులకు ఈసారి భారీ వర్షాలు ఇచ్చిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఎడతెరిపి లేని వానలకు పంటలన్నీ నిండా మునిగాయి. అనంత రైతులు ఏ పంట సాగు చేసినా ప్రకృతి సహకరించడం లేదు. అయితే అనావృష్టి లేకపోతే అతివృష్టి. ఈ విపరీత వాతావరణ పరిస్థితులు రైతులను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. భయంకరమైన కరవు బారిన పడిన జిల్లా వాసులు గత రెండు దశాబ్దాల్లో పంటలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని జిల్లా అన్నదాతలు కోరుతున్నారు.

Breaking News

అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా వేరుసెనగ పంట సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకుండాపోయింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేరుసెనగ కుళ్లిపోయి కనీసం పశు గ్రాసానికి కూడా పనికి రాకుండా పోయింది. గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు జిల్లాలోని పంటలకు అపార నష్టం తెచ్చి పెట్టాయి. కొన్ని చోట్ల కాయ రంగు మారడంతో వచ్చిన అరకొర పంట కూడా నోటికందకుండా పోయింది. అన్నదాతలకు భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లి అల్లాడుతున్నా.. అధికారులెవరూ పొలాల వైపు తిరిగి చూడట్లేదని రైతులు వాపోతున్నారు.

అవే తమ కొంప ముంచుతాయిని..

ఈసారి మాత్రం ప్రకృతి నమ్మించి మోసం చేసింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు సమృద్ధిగానే కురిశాయి. ప్రకృతి బాగా సహకరిస్తోందన్న ఆశతో రైతు రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారు. అవే వర్షాలు తమ కొంప ముంచుతాయని ఊహించలేకపోయారు. ప్రధానంగా వేరుసెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేరుసెనగ సాగు ప్రారంభం నుంచే అధిక వర్షాలు కురిశాయి. ఫలితంగా పంట తెగుళ్ల బారిన పడింది. ఆ తరువాత కోత దశకు చేరుకుంది.

మరింత నష్టం..

ఈ నేపథ్యంలో గత రాత్రి సహా కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు మరింత నష్టం చేకూర్చాయి. జిల్లాలోని మొత్తం 63 మండలాల్లో వర్షం కురవగా.. అందులో 30 మండలాల్లో అధిక వర్షం నమోదైంది.

ఈసారి వేరుశనగ..

ఈ ఖరీఫ్ సీజన్​లో మొత్తం 6 లక్షల 41 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వేరుసెనగ 5 లక్షల హెక్టార్లలో సాగైంది.

భారీ వర్షాలు: పంటలన్నీ వరుణుడి పాలు.. నిరాశలో అనంత రైతులు
భారీ వర్షాలు: పంటలన్నీ వరుణుడి పాలు.. నిరాశలో అనంత రైతులు

పత్తి పంట..

పత్తి 44 వేల 300 హెక్టార్లు, కంది 50 వేల హెక్టార్లు, మొక్కజొన్న 14 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఈ పంటల సాగు సమయంలో వాతావరణం బాగా అనుకూలించింది. కానీ ఎడతెరపి లేని వర్షాలతో వేరుసెనగ, పత్తి పంటలు దాదాపుగా దెబ్బతిన్నాయి. అలాగే మొక్కజొన్న పంటకూ అక్కడక్కడ నష్టం వాటిల్లింది.

నల్లరేగడి భూముల్లో..

ప్రత్యేకించి జిల్లాలోని నల్లరేగడి భూముల్లో సాగు చేసిన పంటలు పూర్తిగా తుడిచి పెట్టుకపోయాయని చెప్పాలి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

భారీ వర్షాలు: పంటలన్నీ వరుణుడి పాలు.. నిరాశలో అనంత రైతులు
భారీ వర్షాలు: పంటలన్నీ వరుణుడి పాలు.. నిరాశలో అనంత రైతులు

ప్రభుత్వమే దిక్కు ఇక..

ప్రస్తుతం జిల్లాలో వేరుసెనగ తొలగించిన చోట ఏమాత్రం పంట దక్కే అవకాశం కనిపించట్లేదు. కాయ దిగుబడి తగ్గినా.. పశుగ్రాసానికైనా కట్టె పనికొస్తుందనుకున్నా రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ప్రస్తుతం ప్రభుత్వం పంట నష్టం అంచనాలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్షకులంతా ప్రభుత్వం అందించే సాయంపైనే ఆశలు పెట్టుకున్నారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు: ఐఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.