ETV Bharat / state

Heavy rain: జలదిగ్బంధంలో అనంతపురం.. మూడడుగుల మేర వరద

author img

By

Published : Oct 12, 2022, 12:45 PM IST

Updated : Oct 12, 2022, 5:30 PM IST

Heavy rain
అనంతపురంలో భారీ వర్షం

Heavy rain: రెండు రోజులుగా కురుస్తున్న భారీగా వర్షాలు... తెగిపోయిన వాగులు.. మునిగిపోయిన కాజ్‌వేలు.. వెరసి తెల్లారేసరికి నగరం మొత్తం వరద నీరు.. ఇదేదో ముంపు ప్రాంతంలో జరిగిన ప్రకృతి విపత్తు కాదు.. కరవు కోరల్లో అల్లాడే అనంతపురంలో కనిపిస్తున్న దృశ్యాలు. ఎటుచూసినా వర్షపు నీటితో సర్వం కోల్పోయి.. తినడానికి తిండి దొరకక.. వండటానికి సరుకులు లేక.. బిక్కుబిక్కుమంటూ నగరవాసులు గడుపుతున్నారు.

జలదిగ్బంధంలో అనంతపురం

Heavy rain: కరవుకు చిరునామాగా చెప్పుకునే అనంతపురం జలమయమైంది. అనేక కాలనీల్లోకి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవేశించటంతో జనావాసాలన్నీ జలదిగ్భంధమయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి.. ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తింది. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వరద అనంతపురం నగరాన్ని ముంచెత్తింది. ఆలమూరు చెరువు నుంచి నడిమివంకకు ఎన్నడూ లేనంతగా భారీ ప్రవాహం వచ్చింది. దాంతోపాటు నడిమివంక ఆక్రమణలకు గురికావటంతో ప్రవాహం వెళ్లడానికి దారిలేక కాలనీలను చుట్టుముట్టింది. నగరంలోని సోమనాథనగర్, రంగస్వామినగర్‌లతోపాటు.. అనంతపురం గ్రామీణ మండలంలోని గౌరవ గార్డెన్స్, రుద్రంపేట పంచాయతీ, యువజన కాలనీ పూర్తిస్థాయిలో జలదిగ్భంధంలో ఉన్నాయి. ఇళ్లలోకి వరద ప్రవేశించటంతో.. అర్ధరాత్రి నుంచి ప్రజలు మిద్దెలపైకి వెళ్లి భయంగా గడిపారు. అనేక కాలనీల్లో మూడు అడుగుల మేర వరద ప్రవహిస్తూనే ఉంది.

అనంతపురం గ్రామీణ మండలంలోని మరువవంక పొడవునా.. కాలనీలను వరదనీరు ముంచెత్తింది. లోతట్టులోని ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించటంతో.. నిత్యావసర వస్తువులతో పాటు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ పనికిరాకుండా పోయాయి. మధ్యాహ్నం వరకు అధికారులు ఎక్కడా ఉపశమన చర్యలు చేపట్టలేకపోయారు. ముంపు ప్రాంత ప్రజలు ఆహారం, తాగునీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కర్నూలు, శింగనమల నుంచి బోట్లు తెప్పించి, వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ కొంతమేర భోజనం ప్యాకెట్లు, నీరు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో రాత్రంతా చీకట్లోనే గడిపామని బాధితులు వాపోతున్నారు.

చంద్రబాబు నగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. కక్కలపల్లి కాలనీలోని ఆదర్శనగర్‌లోనూ అదే పరిస్థితి. అనేక ముంపు కాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇళ్లను వరద ముంచెత్తడంతో స్థానికులు... అర్ధరాత్రి మిద్దెలపైకి వెళ్లారు. కంటి మీద కునుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు ఇంట్లో పొయ్యి వెలిగించలేని పరిస్థితుల్లో... ముంపు బాధితులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. బాధితులను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరానికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉదయాన్నే తన కార్యకర్తలతో కలిసి వరద ముంపు కాలనీల్లో పర్యటిస్తూ భోజనం, తాగునీటి ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు.

కంబదూరు మండల పరిధిలోని రాళ్ల అనంతపురం సమీపంలో నీటి ప్రవాహ ఉద్ధృతికి కాజ్‌వే కొట్టుకుపోయింది. కందుకూరు చెరువు మెరవపారి నీటి ప్రవాహం అధికమైంది. వరద ఉద్ధృతి పెరగటంతో తెల్లవారే సరికి కాజ్‌వే పూర్తిగా ధ్వంసమైంది. అధిక శాతం కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

ఇవీ చదవండి:

Last Updated :Oct 12, 2022, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.