ETV Bharat / state

ఆనంద్ స్వామి.. ఓ దొంగ బాబా

author img

By

Published : Feb 15, 2020, 3:07 PM IST

fake-swamiji-fraud-in-anathapuram
fake-swamiji-fraud-in-anathapuram

ఓం.. బీం.. అంటే భయపడని వారుండరు. ఆ భయాన్నే డబ్బుగా మార్చుకుంటున్నారు దొంగస్వాములు. మీ ఇంట్లో నిధులున్నాయ్.. ఒక్కపూజతో కోట్లకు పడగలెత్తుతావంటే ఆశపడని వ్యక్తులు అరుదు. ఈ అత్యాశనే ఆసరా చేసుకున్నాడో దొంగస్వామి.

బెంగళూరుకు చెందిన ఆనంద్​స్వామి మంత్ర తంత్రాల స్వామిజీగా అవతారమెత్తాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామ సమీపంలోని శివాలయంలో పూజలు నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన పాండుతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయమే.. పాండు కొంపముంచేలా చేసింది. పాండు అన్నయ్య కూడా డబ్బులు వదిలించుకోవాల్సి వచ్చింది.

మీ ఇంట్లో గుప్తనిదులున్నాయ్​

పాండుతో పరిచయం పెంచుకున్న ఆనంద్​స్వామి.. మాయమటలు చెప్పేవాడు. ఓ రోజు మీ ఇంట్లో గుప్త నిధులున్నాయంటూ నమ్మబలికాడు. బయటకు తీయకపోతే.. మీ పని అంతే అంటూ భయపెట్టాడు. నమ్మిన పాండు పూజలు చేయించాడు. ఇనుప పెట్టెలో బొగ్గులు, మట్టివేసి పూజ చేసిన తర్వాత ఇంట్లో పాతిపెట్టాడు. పెట్టెను తీసేందుకు అఘోరాలను పిలుచుకుని వస్తానని.. అప్పటివరకు బయటకు తీస్తే.. ప్రాణం పోతుందని బెదిరించాడు. పూజలు చేసినందుకు పాండు దగ్గర రూ.43 లక్షల నగదు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పాండు అన్న తిమ్మప్పనూ.. ఆనంద్ స్వామి నమ్మించాడు. మీ ఇంట్లో నిధి ఉందని, నీ కుమార్తె ఆరోగ్యం కుదుట పడాలంటే నిధిని బయటకు తీయాలని చెప్పాడు. పూజల తతంగం కోసం తిమ్మప్ప నుంచి ఆనంద్‌స్వామి రూ.36.50 లక్షల నగదు తీసుకున్నాడు.

బృందంగా ఏర్పడి.. ప్రజలను మోసగిస్తూ..

ఆనంద్‌ స్వామి ఎంతకాలానికీ రాకపోవడంతో మోసపోయామని తెలుసుకుని అతడి చుట్టూ తిరిగే వ్యక్తులను పాండు, తిమ్మప్పలు సంప్రదించారు. 2019 ఆగస్టు 11న ఆనంద్‌స్వామి పట్టణానికి వచ్చాడు. మధ్యవర్తులు ఏటూరి మహేష్‌, పత్రాల మారుతి, ఏటూరి రాజు, నబీల సాయంతో దొంగస్వామి దగ్గర ప్రామిసరీ నోట్లు, బాండ్‌ పేపర్లపై సంతకాలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఆనంద్‌స్వామి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాండ్ పేపర్ల ద్వారా తనకు ఇబ్బందులొస్తాయని గ్రహించిన ఆనంద్ స్వామి.. మధ్యవర్తులకు రూ.14 లక్షలు ఇచ్చి.. ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు వెనక్కు తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో సహాయపడినందుకు పట్టణానికి చెందిన కురబ సిద్ధప్ప, శ్రీనివాసులు గారి వెంకటేష్‌, రాజశేఖర్‌లకు వాటా ఇచ్చాడు. అప్పటినుంచి ఆనంద్‌స్వామి, సిద్ధప్ప, వెంకటేష్‌, రాజశేఖర్‌లు బృందంగా ఏర్పడి ప్రజలను మోసం చేస్తున్నారు.

బెదిరించిన కానిస్టేబుల్

ఆనంద్‌స్వామి మోసగించాడని తిమ్మప్ప ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈక్రమంలో కానిస్టేబుల్‌ సురేంద్ర క్షుద్రపూజలు చేస్తున్నారంటూ.. బాధితులతోపాటు.. ఆనంద్​స్వామిని బెదిరించి 6 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని తిమ్మప్ప ఫిర్యాదు చేయడంతో..రాయదుర్గం అర్బన్​ సీఐ తులసీరామ్‌ నేతృత్వంలో పోలీసులు లోతుగా విచారణ చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టి.వీరాపురంలో దొరికిపోయారు

నిందితుల కోసం గాలిస్తున్న తరుణంలో శుక్రవారం మధ్యాహ్నం ఆనంద్‌స్వామి తన ముఠా సభ్యులతో టి.వీరాపురానికి వచ్చినట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్‌స్వామి, సిద్ధప్ప, వెంకటేష్‌, రాజశేఖర్‌, అశోక్‌తో పాటు కానిస్టేబుల్‌ సురేంద్రలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ చెప్పారు. వీరినుంచి ఒక బొలెరో, సఫారీ వాహనం, రూ.14 లక్షల 34 వేల 500ల నగదు, బంగారు గొలుసుతోపాటు రాగి బిందె, మట్టి కుండలు, నకిలీ నగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ నేతృత్వంలోని బృందాన్ని అభినందించారు.

ఇదీ చదవండి: ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు..మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.