ETV Bharat / state

కార్యాలయాల చుట్టూ చీనీ రైతుల ప్రదక్షిణ

author img

By

Published : Jul 4, 2020, 12:06 PM IST

లాక్​డౌన్ కారణంగా రైతులు అవస్థలు పడ్డారు. పండించిన పంట కొనేవారు లేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పంటను కొనుగోలు చేశారు. కానీ డబ్బులు ఇవ్వలేదు. తమకు డబ్బులు ఇవ్వాలని చీనీ రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

cheeni farmers
cheeni farmers

ఓవైపు కరోనా, మరోవైపు లాక్‌డౌన్‌తో చీనీ రైతులు కుదేలయ్యారు. రవాణా వ్యవస్థ స్తంభించింది. ధరలు పూర్తిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. అనంతపురం జిల్లా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఉద్యానశాఖ సహకారంతో ఆయా మార్కెట్‌ యార్డుల పరిధిలోని యార్డు కార్యదర్శులు మే ప్రారంభంలో చీనీకాయల కొనుగోలు ప్రారంభించారు. ఉద్యానశాఖ చీనీ రైతులను గుర్తించి సాగు ధ్రువీకరణపత్రం జారీ చేయడంతో పాటు రవాణా వాహనాలకు అనుమతి పత్రాలు మంజూరు చేశారు.

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడతామని జిల్లా అధికారులు ఎంత మొత్తుకున్నా రాష్ట్ర ప్రభుత్వం వినలేదు. తీవ్ర ఒత్తిడి చేసింది. టన్ను ధర రూ.10 వేలు నిర్ణయించి పంటను కొనుగోలు చేయించారు. మొత్తం 163 మంది రైతులతో రూ.1.52 కోట్ల విలువైన 1,513 టన్నుల చీనీకాయలను కొనుగోలు చేశారు. లారీలు, ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని మార్కెట్‌యార్డులకు రవాణా చేసి అమ్మించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఖాతాలకు సొమ్ము జమ చేసినట్లు సమాచారం. వాహనాలకు అద్దెలు చెల్లించిన ఉన్నతాధికారులు, తమకు మాత్రం సొమ్ము చెల్లించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను కొన్నారు.. అమ్ముకున్నారు.. వచ్చిన సొమ్ము చెల్లించకుండా ఎందుకు సాకులు చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు. రైతులతో మాట పడాల్సి వస్తోందని ఉద్యాన, మార్కెటింగ్‌శాఖ అధికారులు వాపోతున్నారు.

40 రోజులు గడిచిపోయింది

నాలుగు ఎకరాల్లో చీనీ పంట సాగు చేశా. 21 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ.10 వేల ప్రకారం తోటలోనే ఉద్యాన, మార్కెటింగ్‌శాఖ అధికారులు కొనుగోలు చేశారు. మే 21న చీనీకాయలు కొన్నారు. రూ.2.10 లక్షలు సొమ్ము చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే 40 రోజులు గడిచిపోయింది. అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు. ఖరీఫ్‌లో సొమ్ము కోసం ఎదురుచూస్తున్నాం. - దాసరి విఠోబా, పెనకచెర్ల (గార్లదిన్నె)

ఉన్నతాధికారులకు నివేదించాం

జిల్లాలో చీనీ రైతులకు రూ.1.52 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాం. రైతులు సొమ్ము కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వారం, పది రోజుల్లో రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తామని కూడా అధికారులు చెప్పారు. త్వరలో సొమ్ము చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. - నారాయణమూర్తి, సహాయ సంచాలకులు (మార్కెటింగ్‌శాఖ)

ఇదీ చదవండి: కొత్తరకం కరోనాతో మరింత కంగారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.