ETV Bharat / jagte-raho

కన్నపిల్లలతో కలిసి భర్తను హత్య చేసిన భార్య...

author img

By

Published : Sep 21, 2020, 11:55 PM IST

కట్టుకున్న భర్తను కన్నపిల్లలతో కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో చోటు చేసుకుంది. కుమారునికి కారుణ్య ఉద్యోగం, కుమార్తె ప్రేమ వివాహమే.. ఆ సింగరేణి కార్మికుని ప్రాణాలు బలితీసుకున్నాయని పోలీసుల విచారణలో వెల్లడయింది.

కన్నపిల్లలతో కలిసి భర్తను హత్య చేసిన భార్య...
కన్నపిల్లలతో కలిసి భర్తను హత్య చేసిన భార్య...

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు ముత్తె శంకర్ చిన్నకుమార్తె స్వాతి, శ్రీరాంపూర్​కు చెందిన మండ శివసాయి అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం స్వాతి తన తండ్రికి పలుమార్లు తెలపగా శంకర్ తిరస్కరించారు. శంకర్​ని అడ్డుతొలగిస్తే కుమార్తె స్వాతి వివాహంతో పాటు.. కుమారునికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం వస్తుందని భావించిన శంకర్ భార్య విజయ ఓ పథకం వేసింది.

స్వాతికి కరోనా వచ్చిందని, కుమారుడు శ్రావణ్​కు కూడా లక్షణాలున్నాయని ఫోన్​ ద్వారా సమాచారం ఇవ్వగా.. కుటుంబ కలహాల వల్ల మూణ్నెళ్లుగా మంచిర్యాలలో ఉంటున్న శంకర్ పాతబెల్లంపల్లికి చేరుకున్నాడు. సెప్టెంబర్ 4న గ్రామానికి వచ్చిన శంకర్​.. రాత్రి నిద్రిస్తుండగా.. భార్య విజయ, కుమారుడు శ్రావణ్, కుమార్తె స్వాతి, ఆమె ప్రియుడు శివసాయి.. శంకర్ మెడకు బెల్టు బిగించి హత్య చేశారు.

అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మెడకు చీరను చుట్టారు. మృతుడి సోదరి రుక్మిణి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా.. హత్య అని తేలింది. శంకర్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నామని, శివసాయి పరారీలో ఉన్నట్లు సీఐ జగదీశ్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.