ETV Bharat / jagte-raho

కోడి కూర వండలేదని.. భార్యను హతమార్చిన భర్త!

author img

By

Published : Oct 27, 2020, 10:45 PM IST

పండుగ పూట కోడి కూర వండలేదనే కోపంతో ఓ భర్త తన భార్యను కర్రతో మోది హతమార్చాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లో దాచి ఉంచాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి ఇంట్లో చూడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలో నాగర్​కర్నూలు జిల్లాలో జరిగింది.

nagar-kurnool-district telanagana
nagar-kurnool-district telanagana

తెలంగాణలోని నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరంలో దారుణం చోటుచేసుకుంది. కోడి కూర వండలేదనే కోపంతో సీతమ్మ అనే మహిళను భర్త సన్నయ్య కర్రతో కొట్టి హతమార్చాడు. సీతమ్మ, సన్నయ్య దంపతులు వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. సన్నయ్యకు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం పొలం పనులకు వెళ్లిన భర్త సన్నయ్యకు సీతమ్మ మధ్యాహ్నం వేళ భోజనం తీసుకెళ్లింది. అప్పటికే మత్తులో ఉన్న సన్నయ్య.. పండుగ పూట కోడి కూర ఎందుకు వండలేదని సీతమ్మతో గొడవకు దిగాడు. కోపంలో పెద్ద కర్రతో భార్యపై దాడి చేయగా.. సీతమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా సీతమ్మను ఇంట్లోకి తీసుకొచ్చి రాత్రివేళ దాచి ఉంచాడు. మంగళవారం ఉదయం ఇరుగు పొరుగు వారు అనుమానం వచ్చి ఇంట్లో చూడగా.. సీతమ్మ మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సన్నయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:

పేకాట శిబిరంపై పోలీసుల దాడి... భవనం పైనుంచి దూకి ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.