ETV Bharat / crime

Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరి కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం

author img

By

Published : Dec 4, 2021, 11:51 AM IST

అధిక వడ్డీ పేరుతో పలువురిని మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన శిల్పా చౌదరి పోలీసుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. రెండు రోజుల కస్టడీలో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి ఆమెను కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు.. మొదటి రోజు ఆమె ఆర్ధిక లావాదేవీలపై సుదీర్ఘంగా విచారించారు. పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను ఆమె ముందు ఉంచి విచారణ జరిపారు. ఇప్పటి వరకూ ఎంత మంది నుంచి డబ్బు తీసుకున్నారు. ఆ డబ్బును ఏం చేశారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరో వైపు ఆమె భర్తకు మొదటి కేసులో మాత్రమే బెయిల్ రాగా.. నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.

Shilpa Chowdary Cheating Case
Shilpa Chowdary Cheating Case

తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక వడ్డీలు ఇస్తామని నమ్మబలికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డ శిల్పా చౌదరి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కస్టడీలో భాగంగా శుక్రవారం మొదటిరోజు నార్సింగిలోని ఎస్వోటీ కార్యాలయంలో మహిళా పోలీసు అధికారి సమక్షంలో శిల్పా చౌదరిని విచారించారు. గండిపేటలోని సిగ్నేచర్ విల్లాల్లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు.. కిట్టిపార్టీలతో ప్రముఖ కుటుంబాలకు చెందిన మహిళలతో స్నేహం చేశారు. భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్, సినీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలిస్తానంటూ బురిడీ కొట్టించారు. కోట్లాది రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు మూడు కేసులు నమోదు చేసి దంపతులను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి తీసుకున్నారు.

పక్కా ఆధారాలతో విచారించిన పోలీసులు

చంచల్​గూడ జైలు నుంచి శిల్పాచౌదరిని నార్సింగి ఎస్వోటీ కార్యాలయానికి తీసుకు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మహిళా పోలీసు అధికారులు ప్రశ్నించారు. పోలీసులు పక్కా ఆధారాలను నిందితురాలి ఎదుట ఉంచి విచారించారు. అయితే విచారణలో శిల్పాచౌదరి తనకేం తెలియదంటూ చెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు డబ్బు ఇచ్చినట్లుగా ఉన్న కాగితాలను ఎదురుగా ఉండటంతో లాభాలు వస్తాయనే ఉద్దేశంతో వారే డబ్బును పెట్టుబడిగా పెట్టారని బుకాయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వారి వద్ద నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేశానంటూ వివరించారు. వారి వద్ద నుంచి డబ్బు తీసుకున్నట్టు.. మళ్లీ ఇచ్చినట్లుగా ఎటువంటి ఆధారాల్లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఆమె చెప్పిన వివరాలను నార్సింగి పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. భూ లావాదేవీలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ నుంచి తీసుకోనున్నారు. శనివారం రెండో రోజు కస్టడీ విచాణలో భాగంగా మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. పోలీసులు భావించినట్టుగా తొలిరోజు ఆమె నుంచి కీలకమైన వివరాలు బయటకు రాలేదని తెలుస్తోంది.

డబ్బంతా ఎక్కడ పెట్టారో?

శిల్పాచౌదరి దంపతుల మోసం కేసులో తీసుకున్న డబ్బు అంతా ఎక్కడ పెట్టుబడి పెట్టారు అనేది తెలియాల్సి ఉంది. విచారణలో ఆమె నుంచి ఆశించిన సమాచారం రాకపోవటంతో పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందిన మహిళల నుంచి రూ .200 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. పోలీసులకు మాత్రం ముగ్గురు మాత్రమే ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయల నగదును నిందితులు ఎక్కడ పెట్టుబడి పెట్టారు, బ్యాంకు ద్వారా లావాదేవీలు నిర్వహించకుండా జాగ్రత్త పడటానికి కారణాలు, లెక్కల్లో చూపని నల్లడబ్బును మార్చేందుకు శిల్పాచౌదరి ద్వారా వ్యాపారం నిర్వహించాలని భావించారా ? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. శిల్పాచౌదరి దంపతుల బ్యాంకు ఖాతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఏడాది కాలంలో జరిపిన ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.

అది అవాస్తవం: హీరో హర్ష

మరో వైపు శిల్పాచౌదరి నిర్మాతగా టాలీవుడ్​లో సెహరి సినిమా నిర్మాణం చేపట్టారు. ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న హర్షి కనుమిల్లి నుంచి కూడా రూ.3 కోట్లు తీసుకుందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పుకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే శిల్పాచౌదరి సెహరి సినిమాకు సహనిర్మాతగా 12 శాతం వాటాదారుగా ఉన్నట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. సినిమా ప్రారంభమయ్యాక మనస్పర్థలు తలెత్తటంతో ఆమె తప్పుకున్నట్టు సమాచారం. తన వద్ద నుంచి శిల్పాచౌదరి రూ .3 కోట్లు తీసుకున్నట్టుగా తాను ఫిర్యాదు చేశాననేది అవాస్తవమని హర్ష తెలిపారు. సినిమా షూటింగ్​లో తాను బిజీగా ఉన్నానని, తనపై వస్తున్న ప్రచారానికి రెండు మూడ్రోజుల్లో సమాధానం చెబుతానన్నారు.

ఇదీ చదవండి:

Shilpa Chowdary custody: విచారణలో విలపించిన శిల్ప చౌదరి.. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.