ETV Bharat / crime

Movie Style Theft: 'స్పెషల్ చబ్బీస్' సినిమా స్ఫూర్తితో దోపిడీ... కట్ చేస్తే!

author img

By

Published : Dec 17, 2021, 8:20 AM IST

Theft
Theft

Movie Style Theft: పనిచేస్తున్న యజమాని ఇంటికే కన్నం వేయాలనుకున్నాడు. ఇందుకు మరికొంత మందితో జతకలిసి.. ముఠాగా ఏర్పడ్డారు. ఎలాగైనా దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎలా దోపిడీ చేయాలా అని ఆలోచిస్తూ... పార్టీ చేసుకున్నారు. అంతలోనే హిందీ సినిమా స్పెషల్ చబ్బీస్ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా చూసి ముఠా సభ్యులు స్ఫూర్తి పొందారు. అందులో హీరో తన బృందంతో కలిసి ఐటీ అధికారులుగా నటించి దోపిడీ చేస్తారు. అదే తరహాలో వ్యాపారి ఇంట్లో ముఠా సభ్యులు దోపిడీ చేశారు. ఐటీ అధికారులుగా నమ్మించి అందినకాడికి దోచుకున్నారు. చివరికి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని జయభేరీ ఆరెంజ్ కౌంటీలో చోటు చేసుకుంది.

స్పెషల్ చబ్బీస్ సినిమా స్ఫూర్తితో దోపిడీ... కట్ చేస్తే!

Movie Style Theft: స్పెషల్ చబ్బీస్ (26).. 2013 ఫిబ్రవరి 8న విడుదలైంది ఈ హిందీ చిత్రం. ఈ సినిమాలో హీరో అక్షయ్ కుమార్. ఓ ధనవంతుడి ఇంట్లో దోపిడీ చేయడానికి పక్కా ప్రణాళిక రచిస్తాడు. తన బృందంతో కలిసి ఐటీ అధికారులుగా నటిస్తారు. ధనవంతుడి ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు దోచుకుంటారు. ఇదే సినిమాను స్ఫూర్తిగా తీసుకొని దోపిడీకి పాల్పడింది ఓ ముఠా. ఈ నెల 13న తెలంగాణలోని సైబరాబాద్ కమిషనరేట్ గచ్చిబౌలి పీఎస్​ పరిధిలోని జయభేరీ ఆరెంజ్ కౌంటీలో దోపిడీ జరిగింది.

ఐటీ అధికారులమంటూ...

స్థిరాస్తి వ్యాపారి వెంకట సుబ్రమణ్యం ఇంట్లో 1.27 కిలోల బంగారం, నగదు నిందితులు ఎత్తుకెళ్లారు. కారులో వచ్చిన నిందితులు ఇంట్లోకి వెళ్లి ఐటీ అధికారులమంటూ నకిలీ కార్డులు చూపించారు. ఆ సమయంలో వెంకట సుబ్రమణ్యం ఇంట్లో లేరు. వెంటనే ఇంట్లో ఉన్న అందరి సెల్​ఫోన్లు లాక్కున్నారు. సుబ్రమణ్యం భార్య జయలక్ష్మి వద్ద లాకర్ తాళంచెవి తీసుకున్న నిందితులు అందులో ఉన్న బంగారు ఆభరణాలు, వజ్రాలు ఎత్తుకెళ్లారు. విషయాన్ని జయలక్ష్మి తన భర్త సుబ్రమణ్యానికి తెలిపింది.

పోలీసులకు ఫిర్యాదు...

ఇంటికి వచ్చిన ఆయన ఐటీ దాడులపై అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు దోపిడీగా తేల్చారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు ఉపయోగించిన కారును గుర్తించారు. కారు బాహ్యవలయ రహదారి మీదుగా ఆర్సీపురం వైపు వెళ్లినట్లు గుర్తించారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా... ఆర్సీపురం రైల్వే స్టేషన్ సమీపంలో నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దోపిడీ చేసిన మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అలా మొదలైంది...

స్థిరాస్తి వ్యాపారి వెంకట సుబ్రమణ్యం... బంజారాహిల్స్ రోడ్డు నంబర్​ 3లో కొన్నేళ్లుగా భువనతేజ్ రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రా పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నారు. కార్యాలయం పక్కనే వైజాగ్​కు చెందిన మోహన్.. బకెట్ సలాడ్స్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్​కు మోహన్ స్నేహితులు సందీప్, అరవింద్ వచ్చి వెళ్తుండేవారు. వెంకట సుబ్రమణ్యం కార్యాలయంలో పనిచేసే జశ్వంత్​కు మోహన్​తో పరిచయం ఏర్పడింది. జశ్వంత్ తన యజమాని వెంకట సుబ్రమణ్యానికి... సందీప్, మోహన్​లను కూడా పరిచయం చేశాడు.

స్పెషల్ చబ్బీస్​ స్ఫూర్తితో...

మోహన్ రెస్టారెంట్ బకెట్ సలాడ్స్​కు వెంకట సుబ్రమణ్యం తరచూ వచ్చి వెళ్తుండేవారు. నెల క్రితం మాదాపూర్​లో సందీప్ రూమ్​లో వీరు పార్టీ చేసుకున్నారు. మోహన్, అరవింద్​తో పాటు జశ్వంత్ కూడా ఈ పార్టీలో పాల్గొని మద్యం సేవించారు. ఈ క్రమంలో జశ్వంత్ తన యజమాని వెంకట సుబ్రమణ్యం ఆస్తుల గురించి ప్రస్తావించాడు. కొన్నేళ్లుగా స్థిరాస్తి వ్యాపారంలో ఎంతో డబ్బు సంపాదిస్తున్నాడని... ఆదాయపు పన్ను మాత్రం చెల్లించడంలేదని జశ్వంత్ చెప్పాడు. ఆయన ఇంట్లో ఎలాగైనా దోపిడీ చేయాలని కుట్ర పన్నారు.

ప్లాన్ ప్రకారం దోపిడీ...

జశ్వంత్​తో కలిసి రెండు మూడుసార్లు వెంకట సుబ్రమణ్యం ఇంటి చుట్టూ రెక్కీ కూడా నిర్వహించారు. అరవింద్ ఏపీ తూర్పుగోదావరిలోని తన స్నేహితులకు దోపిడీ గురించి వివరించారు. భీమవరంలో ఓ కారును అద్దెకు తీసుకొని నలుగురు స్నేహితులతో కలిసి మాదాపూర్​లోని గదికి ఈనెల 13న చేరుకున్నారు. అప్పటికే ఐటీ అధికారుల పేరుతో నకిలీ ఐడీ కార్డులు, దుస్తులు సిద్ధం చేసుకున్నారు. వెంకట సుబ్రమణ్యం బంజారాహిల్స్​లోని కార్యాలయానికి చేరుకున్న వెంటనే ఆ విషయాన్ని జశ్వంత్... అరవింద్​కు చెప్పాడు. అరవింద్ తన స్నేహితులతో కలిసి జయభేరీ ఆరెంజ్ కౌంటీలోని వెంకట సుబ్రమణ్యం ఇంటికి చేరుకున్నాడు. అనుకున్న ప్రకారం దోపిడీ చేసి పరారయ్యారు. కారుకు నకిలీ నంబర్​ ప్లేట్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులు అరెస్ట్...

ఈ ముఠా నిందితులను ఏపీలోని రాజమహేంద్రవరంలో... సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1.2 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు నిందితులను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా ముందు ప్రవేశపెట్టారు.

జశ్వంత్, అర్వింద్ ఇద్దరు వెంకట సుబ్రమణ్యం ఇల్లు రెక్కీ నిర్వహించారు. తర్వాత ముఠా సభ్యులంతా మాస్కులు, గ్లౌవ్స్ వేసుకుని ఇన్​కమ్ ట్యాక్స్ అధికారులమంటూ ఐడీలు కార్డులు తయారుచేసుకుని ఈనెల 13న సుబ్రమణ్యం ఇంటికి వెళ్లారు. ఇంట్లో వాళ్లని కూర్చొబెట్టి... సుబ్రమణ్యం భార్య పర్సులోని తాళంచెవి తీసుకుని లాకర్​లో ఉన్న బంగారం, నగదును తస్కరించారు. దీని విలువ రూ.1.2 కోట్లు ఉంటుంది.

-- స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సీపీ

పోలీసుల దృష్టికి తీసుకురండి...

ఐటీ, సీబీఐ, పోలీసుల పేరిట ఎవరు సోదాలు నిర్వహించినా... నగదు, బంగారు వెంట తీసుకెళ్తున్నా... సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. నిజమైన అధికారులేనా కాదా అనే విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత తనిఖీలకు సహకరించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి: Wedding Twist: పెళ్లికి సరిగ్గా గంట ముందు.. వరుడు ఏం చేశాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.