kidnapping drama was played to escape from the case: విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ ఎర్రమట్టి దిబ్బలలో ఈ నెల 14న జరిగిన కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కొమ్మాది ప్రాంతానికి చెందిన వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తి భీమిలి బీచ్ ఎర్రమట్టి దిబ్బలను చూసేందుకు కుటుంబంతో కలిసి వచ్చాడు.. ఆ ప్రాంతంలో జీడి మామిడి తోటలకు వాచ్మెన్గా పనిచేస్తున్న కొల్లి సురేంద్ర, అతని మేనమామ అప్పలస్వామి ఉన్నారు. వెంకటేష్ కుటుంబం ఆ జీడిమామిడి తోటలో వంటలు చేసుకొని.. మధ్యాహ్నం భోజనం అనంతరం వంటసామాన్లు అక్కడే ఉంచి ఎర్రమటి దెబ్బలు చూసేందుకు వెళ్లారు.
వంట సామాన్లు కనిపించకపోవడంతో గొడవ: అనంతరం వచ్చి చూసే సరికి వంట సామాన్లు కనిపించలేదు. దీంతో వెంకటేష్.. సురేంద్ర, అప్పలస్వామిని అడిగాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వెంకటేష్ కుటుంబ సభ్యులు.. సురేంద్ర సెల్ఫోన్ తీసుకుని అతనిపై భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు గొడవతో భయపడిన సురేంద్ర.. అప్పలస్వామి ఇంటికి వెళ్లారు. భర్త ఇంటికి రాకపోవడంతో సురేంద్ర భార్య ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్: 16వ తేదీన భీమిలి జోన్ పరిధి నాలుగో వార్డు జె.వి అగ్రహారంలో సురేంద్ర రెండు చేతులు, కాళ్లు బైండింగ్ వైర్తో కట్టేసి.. ముఖానికి గుడ్డలతో చుట్టి ముఖానికి, కాళ్లకు సంచులతో కట్టి పడినట్లు.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కిడ్నాప్నకు గురయ్యాడన్న సురేంద్రపై పలు అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు చేశారు. దర్యాప్తులో సురేంద్ర.. తన మేనమామ అప్పలస్వామితో కాళ్లు, చేతులకు బైండింగ్ వైర్.. ముఖానికి గుడ్డలు కట్టించుకున్నాడని పోలీసులు తెలిపారు.
భయంతో కిడ్నాప్ డ్రామా: వెంకటేష్ రెడ్డి పోలీస్ కేసు పెట్టడంతోనే కేసును పక్కదోవ పట్టించేందుకు భయంతో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు సురేంద్ర ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల నగరంలో సాయి ప్రియ కేసులో ఎలాగైతే పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేయించేలా పక్కదోవ పట్టించారని పోలీసులు తెలిపారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఆకతాయి చర్యలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ సుమిత్ గార్డ్ (లా అండ్ ఆర్డర్), ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.
ఇవీ చదవండి: