ETV Bharat / crime

Cyber Crime: మూత్రపిండాలు దానం చేయండి.. కోటీశ్వరులవ్వండంటూ సైబర్ నేరగాళ్ల వల

author img

By

Published : Jul 27, 2021, 12:45 PM IST

cyber-criminals
కోటీశ్వరులవ్వండంటూ సైబర్ నేరగాళ్ల వల..

మూత్రపిండాలు (Kidney Scam) దానం చేయండి... కోటీశ్వరులవ్వండి. కిడ్నీలు చెడిపోయిన వారికి నూతన జీవితాన్నిచ్చి.... మీరూ ఉన్నతమైన జీవితాన్ని గడపండి. ఇలా... ఆర్థిక అవసరాల్లో ఉన్న వారికి వల విసిరి.... సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. వెబ్ సైట్లలో ప్రచారం చేస్తూ.. కుచ్చుటోపీ పెడుతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న హైదరాబాద్‌కు చెందిన దంపతులు వీరి మాయలో పడి.. కిడ్నీ అమ్మేందుకు వెళ్లి.. రూ. 40లక్షలు పోగొట్టుకున్నారు.

మూత్రపిండాలు దానం చేయండి.... కోటీశ్వరులవ్వండంటూ సైబర్ నేరగాళ్ల వల..

ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటూ.. కొత్త రకం మోసాలతో సైబర్‌ నేరగాళ్లు అమాయకులకు వలవేస్తున్నారు. కరోనా వేళ అప్పుల పాలైన వారిని లక్ష్యంగా చేసుకుంటూ.. అందినకాడికి దోచేస్తున్నారు. 'కిడ్నీ డొనేషన్ ఇండియా ', 'సేల్ ఆఫ్ కిడ్నీ ఫర్ మనీ' పేర్లతో వెబ్ సైట్లు.. ఫేస్‌బుక్, వాట్సాప్‌కు సందేశాలు పంపుతున్నారు. ఈ తరహాలోనే పలుచోట్ల జరిగిన మోసాల (Kidney Scam)తో.. పోలీసులు అప్రమత్తమయ్యారు.

పరువు పోతుందని..

తెలంగాణ - హైదరాబాద్​లోని ఖైరతాబాద్​కు చెందిన దంపతులు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టారు. ఇంతలోనే కరోనా రావడం వల్ల తీవ్రంగా నష్టపోయారు. అప్పుల వాళ్లు డబ్బు అడుగుతుండటంతో నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే కిడ్నీ (Kidney Scam) అమ్మితే.. పెద్ద మొత్తంలో నగదు ఇస్తామనే ప్రకటన చూశారు. దంపతులిద్దరూ తమ కిడ్నీలు అమ్మడానికి సిద్ధమయ్యారు. హోప్ కిడ్నీ సెంటర్ (hope kidney center) దిల్లీ వెబ్‌సైట్​ను సంప్రదించగా.. ఒక్కో కిడ్నీకి రూ.5 కోట్లు ఇస్తామని.. ఇందుకోసం ముందుగానే కొంత మొత్తాన్ని ఆస్పత్రికి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా.. వేర్వేరు కారణాలతో 3 నెలల్లో వారి నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేశారు.

ఒక్కో కిడ్నీకి రూ.2 కోట్లు..

మరో కేసులో విజయవాడ ఆటోనగర్‌కు చెందిన దంపతులు.. ఓ మందుల దుకాణాన్ని నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. అనివార్య కారణాలతో దుకాణం మూతపడగా.. నష్టాలు తీర్చేందుకు స్థలాన్ని అమ్మారు. అయినా సరిపడక.. కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ' కిడ్నీ డొనేషన్ ఇండియా ' వెబ్ సైట్‌ను చూసి, అందులోని నెంబర్‌కు ఫోన్ చేశారు. డాక్టర్ చోప్రా పేరుతో సైబర్ నేరస్థుడు మాట్లాడాడు. కిడ్నీ దానం(Kidney Scam) చేసేందుకు దిల్లీకి రావాలని ఒక్కో కిడ్నీకి 2 కోట్లిస్తామన్నాడు. వైద్యపరీక్షలు, రవాణా ఖర్చుల పేరుతో 18లక్షల 60వేలు వారి నుంచి వసూలు చేశారు.

చెల్లి పెళ్లి కోసం..

ఇంకో కేసులో సూరత్​లో నివాసం ఉంటున్న రాణా.. చిరువ్యాపారాలు చేసి తనతో పాటు తల్లిదండ్రులు, చెల్లెల్ని పోషించేవాడు. కరోనా కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతకుముందే చెల్లి పెళ్లి నిశ్చయం చేసుకోగా.. లక్షల్లో అప్పులు, పెళ్లి ఖర్చులు అతని తలకుమించిన భారంగా మారాయి. స్నేహితుడి సూచన మేరకు రాణా తన కిడ్నీ(Kidney Scam) అమ్మాలనుకున్నాడు. వెబ్‌సైట్‌లో చూడగా.. మూత్రపిండం ఇస్తే రూ.4 కోట్లు ఇస్తామని ఓ వ్యక్తి చెప్పాడు. అతని మాటలు నమ్మి.. తన కిడ్నీని అమ్ముకునేందుకే మరో 14లక్షల 70వేల రూపాయలు అప్పుచేసి వారికి సమర్పించాడు.

అమాయకుల అవసరాలే ఆసరాగా..

ఇలా.... అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి అవసరాలను, మానసిక స్థితిని ఆసరాగా చేసుకుని.. సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. బెంగుళూరు పాత విమానాశ్రయం రోడ్‌లోని మణిపాల్ ఆస్పత్రి పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి.. తమకు కిడ్నీ అమ్మితే రూ.5 కోట్లు ఇస్తామంటూ ప్రకటన ఇచ్చారు. గమనించిన ఆస్పత్రి యాజమాన్యం....పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రితో పాటు పలువురు బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు.. 50 నుంచి 100 ఆస్పత్రుల నకిలీ వెబ్ సైట్లు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు గుర్తించారు.

ఆన్​లైన్ ప్రకటనలతో ఆకర్షణ..

దిల్లీ మూల్ చంద్, బీఎల్​కే, ముంబయి బ్రీచ్ కాండీ, బెంగుళూరు మణిపాల్‌తో పాటు హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రులు, చెన్నై ఎస్​ఆర్​ఎం ఆస్పత్రులు ఈ సైబర్‌ నేరగాళ్ల జాబితాలో ఉన్నాయి. ఈ ఆస్పత్రుల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి.. తమకు కిడ్నీ దానం చేస్తే.. కోట్ల రూపాయలిస్తామని ఆన్‌లైన్‌లో ప్రకటనలిస్తున్నారు.

అప్రమత్తత అవసరం..

ఆన్‌లైన్‌ మోసాలపై ఎంత అవగాహన పెంచుకున్నా.. సైబర్‌ నేరగాళ్లు తెలివిగా సరికొత్త పంథాను ఎంచుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అమాయకంగా నమ్మి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. మూత్రపిండాలు అవసరమైన వారు తెలుగు రాష్ట్రాల్లో జీవన్ దాన్ ట్రస్టు ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని.. ఎవరైనా దాతలు కిడ్నీలు దానం చేస్తే ప్రాధాన్యతా క్రమంలో అవకాశం వస్తుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

TRAGEDY: విశాఖ జిల్లాలో విషాదం.. బట్టలు ఉతికేందుకు పెద్దలతో వెళ్లి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.