ETV Bharat / city

Aided schools : పోరాడారు.. సాధించారు

author img

By

Published : Oct 28, 2021, 7:11 AM IST

ఎయిడెడ్‌ పాఠశాలలను కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులే ఆందోళన చేపట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బాలికల విద్యాలయాలను కొనసాగించాలని వారు ఎమ్మెల్యేలనూ ప్రశ్నించడం ఆ బడుల ప్రాధాన్యాన్ని చాటింది. విశాఖపట్నం, కాకినాడల్లో తల్లిదండ్రుల నిరసనలతో ఎయిడెడ్‌ బడుల అంశం ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది.

Aided schools
పోరాడారు.. సాధించారు

ఎయిడెడ్‌ పాఠశాలలను కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులే ఆందోళన చేపట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. బాలికల విద్యాలయాలను కొనసాగించాలని వారు ఎమ్మెల్యేలనూ ప్రశ్నించడం ఆ బడుల ప్రాధాన్యాన్ని చాటింది.

విశాఖపట్నం, కాకినాడల్లో తల్లిదండ్రుల నిరసనలతో ఎయిడెడ్‌ బడుల అంశం ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఆయా పాఠశాలల్లో చదివేవారిలో ఎక్కువ మంది పేదలు, వెనకబడిన తరగతుల వారే. విశాఖలో పాఠశాల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడగా.. కాకినాడలో ప్రైవేటుగా ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు చెప్పడంతో తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ రెండు విద్యాలయాలూ దశాబ్దాల చరిత్ర కలిగినవే. సమీపంలో అనేక పాఠశాలలు ఉన్నా వీటిలో ప్రవేశాలకు డిమాండ్‌ తగ్గలేదు.
సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతి తెలిపిన ఎయిడెడ్‌ పాఠశాలల్లోని పిల్లల్ని సమీపంలోని ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రుల నుంచి ఈ నెల 30 వరకు సమ్మతి లేఖలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 1,946 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉంటే వాటిలో సుమారు 90 యాజమాన్యాలు ఆస్తులతో సహా అప్పగించేందుకు ముందుకొచ్చాయి. మరో 1,284 సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతి తెలిపాయి. సమ్మతి తెలిపిన వాటిలోనూ కొన్ని యాజమాన్యాలు ఇప్పుడు సిబ్బందిని వెనక్కి తీసుకుంటామని విద్యాశాఖకు లేఖలు రాస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

తెలుగు మాధ్యమం.. తగ్గని ఆదరణ...

విశాఖపట్నంలోని సేక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాల 40ఏళ్లకు పైగా సేవా దృక్పథంతో తెలుగు మాధ్యమంలో కొనసాగుతోంది. 1-5 తరగతుల్లో 711, 6-10 తరగతుల్లో 796 మంది బాలికలు చదువుతున్నారు. 27 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ బడిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ధర్నా చేశారు. ఇక్కడ చదివేవారిలో చాలామంది పేదలే. ప్రైవేటు ఫీజులను వారు భరించలేరు. ఈ పాఠశాలలో రూ.100-150 నామమాత్ర ఫీజు తీసుకుంటున్నారు. క్రమశిక్షణ, ఉత్తమమైన బోధన ఈ పాఠశాలలో ఉండటంతో మంచి ఆదరణ పొందింది. అందుకే తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారు. బాలికల భద్రతకు ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. పురుషులకు ప్రవేశం ఉండదు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. ఈ పాఠశాలకు మూడు కిలోమీటర్ల లోపు ఐదు ప్రభుత్వ పాఠశాలలున్నా వాటిపై తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. మూడు కిలోమీటర్ల దూరంలోని ఊర్వశి జంక్షన్‌, కంచరపాలెం, పరమేశ్వరి థియేటర్‌, అల్లిపురం, జ్ఞానాపురం, పూర్ణామార్కెట్‌, జగదాంబ సెంటర్‌ ప్రాంతాల నుంచీ పిల్లలు వస్తారు. విద్యార్థినులు చదువుల్లో వెనుకబడితే తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు. క్రమశిక్షణ, భద్రత, మంచి బోధన కారణంగా ఎయిడెడ్‌ను కొనసాగించేలా తల్లిదండ్రులు అధికారులను ఒప్పించగలిగారు.

2 వేల మంది విద్యార్థులు..

కాకినాడ జగన్నాథపురంలోని సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాలను 1954లో ప్రారంభించారు. ఇక్కడ తెలుగు, ఆంగ్ల మాధ్యమాలున్నాయి. 1-5 వరకు 957, 6-10 వరకు 1,027 మంది ఇక్కడ చదువుతున్నారు. 9 మంది రెగ్యులర్‌, ఆరుగురు డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. సుమారు 13 నగరపాలక డివిజన్ల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. నామమాత్రంగా రూ.500లోపే ఫీజులు ఉండటంతో భారం లేకుండా చదివిస్తున్నారు. ఈ బడి ప్రైవేటుగా మారితే రూ.15వేల వరకు ఫీజు కట్టాలని యాజమాన్యం ప్రకటించింది. అది లేకుండా చదువు కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో తల్లిదండ్రులు వీటిపైనే మొగ్గుచూపుతున్నారు. ఈ పాఠశాలకు రెండు కిలోమీటర్లలోపే నాలుగు ఉన్నత పాఠశాలలు ఉన్నా సెయింట్‌ ఆన్స్‌లో చదివించేందుకే ఆసక్తి చూపుతున్నారు. జగన్నాథపురం ప్రాంతంలో సుమారు లక్షమంది వరకు ఉండగా.. వీరిలో అత్యధికులు మత్స్యకారులే. సెయింట్‌ ఆన్స్‌ను ఎయిడెడ్‌గా కొనసాగించేందుకు అధికారులు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి :

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మహిళా గర్జన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.