ETV Bharat / city

Venkaiah: 'కరోనాను జయించాలంటే పంచసూత్ర ప్రణాళిక పాటించాల్సిందే'

author img

By

Published : Jul 10, 2021, 4:48 PM IST

హైదరాబాద్​లోని తన నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఒకటి "టెర్రస్​ గార్డెన్​", మరోటి 'కొత్త(కరోనా) కథలు". మిద్దెతోట అనేది ఓ చక్కని ఆలోచన అని.. అందుకోసం ప్రతీ ఒక్క నగరవాసి సమయం కేటాయించాలని సూచించారు. 80 మంది రచయితలు రాసిన కథా సంకలనాన్ని ఎస్పీ బాలుకు అంకితం చేయటం పట్ల ప్రచురణకర్తలను అభినందించారు. కరోనాను జయించాలంటే ప్రతి ఒక్కరూ పంచసూత్ర ప్రణాళికను పాటించాల్సిందేనని పిలుపునిచ్చారు.

venkaiah naidu
venkaiah naidu

'కరోనాను జయించాలంటే పంచసూత్ర ప్రణాళిక పాటించాల్సిందే'

వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణహితం దృష్ట్యా మిద్దెతోట అనేది ఓ చక్కని ఆలోచన అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్​లోని తన నివాసంలో నగర సేద్యం నిపుణులు, రచయిత తుమ్మేటి రఘోత్తమ్​రెడ్డి రాసిన "టెర్రస్ గార్డెన్" ఉపశీర్షిక మిద్దెతోట ఆంగ్ల పుస్తకం ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై. వెంకటేశ్వరరావు, టెర్రస్ గార్డెన్ పుస్తక రచయిత రఘోత్తమ్​రెడ్డి పాల్గొన్నారు. గతంలో తెలుగు బాషలో రాసిన ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించి అన్ని వర్గాల కుటుంబాలకు చేరువ చేసే ప్రయత్నాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు.

మిద్దెతోట ఓ చక్కని ఆలోచన...

"ఇది చిన్న కార్యక్రమం అయినా.. ఈ ఆలోచన చాలా పెద్దది. ఎంతో ఉపయుక్తమైంది. నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు తమ డాబాలు, బహుళ అంతస్తుల భవనాలపైన, ఇళల్లోని ఖాళీ స్థలాల్లో పెరటి తోటలు సాగు చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా మంచి సహజ పోషకాహారం లభిస్తుంది. ఆర్థిక లబ్ధియే కాకుండా నచ్చిన మెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినవచ్చు. కరోనా నేపథ్యంలో దిల్లీలో ఉపరాష్ట్రపతి భవన్‌లో 450 మీటర్లతో మేం కూడా ఒక తోట పెంచాం. అందులో నా సతీమణితో కలిసి నడిచేటప్పుడు... కూరగాయలు చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. మా సొంతూరిలో ఉన్నామన్న భావన కలుగుతుంది" - వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.

పంచసూత్ర ప్రణాళిక..

కరోనా మహమ్మారిని జయించే దిశగా ప్రతి పౌరుడు పంచసూత్ర ప్రణాళికను అనుసరించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఈ ప్రణాళికతోనే భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనగలమని పేర్కొన్నారు. వ్యాయామం, ఆధ్యాత్మిక చింతన, పోషకాహారం, వ్యక్తిగత జాగ్రత్తలు, ప్రకృతితో కలిసి జీవించడం అనే ఐదు అంశాల మీద దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. శారీరక శ్రమ, క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో పాటు ప్రకృతితో మమేకమై జీవించడం అలవాటు చేసుకోవాలని కోరారు. కరోనాపై వస్తున్న అపోహలు, పుకార్లను విశ్వసించడం ద్వారా ఆందోళనే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదన్నారు.

కొత్త కరోనా కథలు పుస్తకావిష్కరణ..

కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, వివిధ నేపథ్యాలకు చెందిన 80 మంది రచయితల కథలతో వంశీ ఆర్ట్స్ థియేటర్ రూపొందించిన "కొత్త (కరోనా) కథలు" పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్​గా ఆవిష్కరించారు. కరోనా కొత్త కథల్లో భాగస్వాములైన రచయితలను అభినందించిన వెంకయ్యనాయుడు.. కొత్త అనుభవాల నుంచి పుట్టిన కథలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఈ పుస్తకం అంకింతమివ్వడం పట్ల పుస్తక ప్రచురణకర్తలను వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

ఇదీ చూడండి: kollu arrest: మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం.. కొల్లు రవీంద్ర అరెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.