ETV Bharat / city

'రోగ నిరోధక శక్తి అతి స్పందనను కట్టడి చేస్తే మరణాలు తగ్గుతాయ్'

author img

By

Published : Apr 29, 2020, 10:14 AM IST

గుండె జబ్బులున్న వారు కరోనా వ్యాప్తి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని అమెరికాలో స్థిరపడిన తెలుగు వైద్యులు మహేష్‌ పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో పరిస్థితి అదుపులోకి రావచ్చన్నారు.

us doctor mahesh interview with etv bharat
యూఎస్ డాక్టర్ మహేష్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

అవసరాలు, ఆపదలు కొత్త మార్గాలను చూపిస్తాయి. కరోనా కష్టకాలమూ ఎన్నో ప్రత్యామ్నాయాలను సృష్టిస్తోంది. పర్వతారోహణలో ఆక్సిజన్‌ కొరత ఎదురైతే.. ఎసిటోజోలమైడ్‌ వంటి మందులు వాడతారు. కరోనా బాధితులకు వెంటిలేటర్ల కొరత నేపథ్యంలో ఆక్సిజన్‌ను పొదుపుగా వాడుతూనే... ప్రత్యామ్నాయంగా ఈ ఔషధాలు వినియోగిస్తున్న వైద్యులు ఫలితాలను సాధిస్తున్నారు. అమెరికాలో ప్రముఖ హృద్రోగ నిపుణులు, తెలుగువారైన డాక్టర్‌ బిక్కిన మహేష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూజెర్సీలో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టుగా సేవలందిస్తున్న మహేష్‌ ‘ఈటీవీ భారత్‌’తో పలు విషయాలు పంచుకున్నారు.

భరోసా వచ్చింది

అమెరికాలో కరోనా హాట్‌స్పాట్‌లుగా మొదటి రెండు స్థానాల్లో ఉన్న న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో కేసుల సంఖ్య ప్రస్తుతం కాస్త తగ్గింది. దీంతో వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చన్న భరోసా ఏర్పడింది. చైనాని అమెరికా నమ్మకపోయినా.. ఇటలీ, స్పెయిన్‌లో వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతినైనా అంచనా వేసి అప్రమత్తమైతే బాగుండేది. ఈ విషయంలో అమెరికాదే తప్పు.

కొవిడ్‌-19 ఎందుకింత ప్రమాదకరమంటే..

ఈ వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపి శరీరానికి ప్రాణ వాయువు అందకుండా చేస్తుంది. కరోనా సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడంతో సైటోకైన్‌ అనే ప్రొటీన్‌ విపరీతంగా పెరిగిపోతుంది (సైటోకైన్‌ స్టార్మ్‌). దీంతో రోగికి ఆక్సిజన్‌ అందకపోవడం, రక్తం సరఫరా కాకపోవడం, కిడ్నీలు, కాలేయం చెడిపోవడం వంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. ఆ సైటోకైన్‌ స్టార్మ్‌ను నిలువరిస్తే మరణాల రేటును తగ్గించవచ్చు.

80% మందికి ఎలాంటి సమస్యా ఉండదు

కరోనా సోకిన వారిలో 80% మందికి ఎలాంటి లక్షణాలుండవు. ఒకవేళ ఉన్నా జలుబు, దగ్గు వంటి సాధారణ ఫ్లూ కనిపిస్తాయి. 15% మంది రోగులకు న్యూమోనియా వస్తుంది. వారికి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ఇస్తాం. మిగతా 5% మంది సంక్లిష్ట పరిస్థితిలో ఉంటారు. వీరి ఊపిరితిత్తులను మీగడ వంటి తెల్లటి చిక్కటి ద్రవం ఆవరిస్తుంది. ఎక్స్‌రే కూడా తెలుపు రంగులో కనిపిస్తోంది. రక్తం, ఆక్సిజన్‌ అందక క్రిటికల్‌ కండిషన్‌లోఉండే వీరికి కృత్రిమ ప్రాణాధార వ్యవస్థ(వెంటిలేటర్‌)పై చికిత్స అందిస్తాం.

బ్లాక్స్‌ లేకున్నా ప్రమాదకరంగా ఈసీజీ రీడింగ్‌

కొందరు కరోనా రోగుల్లో ఈసీజీ రీడింగ్‌ ప్రమాదకరంగా ఉంది. దాన్ని చూసి యాంజియోగ్రామ్‌ చేస్తుంటే అక్కడ బ్లాక్స్‌ కనిపించడం లేదు. సైటోకైన్‌ స్టార్మ్‌ పెరగడంతో గుండె రక్తనాళాలు ఉబ్బిపోయి కూడా ఇలా జరుగుతుండవచ్చు. కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

* గత రెండు వారాల నుంచి హై ఫ్లో ఆక్సిజన్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌ గ్యాస్‌ ఇవ్వడం, ఎసిటోజోలమైడ్‌ ఔషధాలు ఇస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నాం. ఇవి కొంతవరకు ఫలితాన్నిస్తున్నాయి.

హృద్రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి

బీపీ, గుండె సమస్యలు, గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఈ వైరస్‌ సోకితే పరిస్థితి విషమిస్తుంది. రక్తం పంపింగ్‌ పడిపోతుంది. ఈ జబ్బులు లేని వారికైనా కరోనా వచ్చి గుండె దెబ్బతింటే.. వారిలో 50% వరకూ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటికే గుండె జబ్బులున్న వారికి ఈ పరిస్థితి తలెత్తితే మరణాల శాతం ఇంకా పెరుగుతుంది. వుహాన్‌లో చాలా కేసుల్లో బాధితుల గుండె దెబ్బతిన్నట్లు గుర్తించాం. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ చికిత్స అందిస్తున్నాం. రక్తం పలుచబడే మందులు ఇస్తుంటాం. కానీ నేరుగా గుండె కండరాలకు వైరస్‌ సోకితే పరిస్థితి చాలా క్లిష్టమవుతుంది. ఇందుకు చికిత్స లేదు. పేస్‌మేకర్‌, స్టంట్స్‌పై కరోనా వైరస్‌ ప్రభావం చూపదు. దీనికి సంబంధించిన సమాచారం లేదు.

భారత్‌లో అప్రమత్తత అవసరం

అమెరికాతో పోలిస్తే భారత్‌లో కేసులు బాగా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కేసులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలి.

నెల నుంచి రెండు నెలల్లో

మరో 2నెలల్లో కరోనాపై చాలావరకూ సమాచారం అందుబాటులోకి వస్తుంది. చికిత్సా విధానంపైనా స్పష్టత వస్తుంది. దీంతో పరిస్థితి అదుపులోకి వస్తుందని భావిస్తున్నా. సంపూర్ణ పరిష్కారం టీకానే.

ఇవీ చదవండి...కొవిడ్‌ చికిత్సలో వైద్యులకు తోడ్పాటుగా... నెల్లూరు రోబో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.