తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ 4, 5 విడతలు రద్దు చేసి.. ఆ నిధులతో రైతు భరోసా చేపడుతున్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ రైతులకు కొత్తగా చేస్తుందేమీ లేదని పేర్కొన్నారు. రూ.15 వేలు ఇచ్చే అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేసి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. రైతు భరోసా పేరిట నెలకు రూ.620 మాత్రమే ఇస్తున్నారని... గ్రామ వాలంటీర్లకు నెలకు రూ.8 వేలు ఇస్తున్నారవి వివరించారు. కేంద్ర సాయంతో సంబంధం లేకుండా రూ.12వేల 500 ఇస్తామని చెప్పి... ఇప్పుడు కేంద్ర సాయంతో కలిపి అని మాట మార్చారని ధ్వజమెత్తారు. రైతులను కూడా కులమతాల వారీగా విభజించడం దారుణమని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో 79 లక్షల రైతు ఖాతాలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం... అందులో 30లక్షల ఖాతాలు ఎందుకు తిరస్కరించిందో చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకం పేరును 15 విడతల భరోసా అని మార్చుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. మాట తప్పం... మడమ తిప్పం అనే జగన్ పాదయాత్ర హామీ ఏమయిందని ప్రశ్నించారు. తెదేపా హయాంలో 5 విడతల్లో లక్ష 50వేలు చెల్లిస్తే అనేక విమర్శలు చేసిన జగన్... నేడు ఏం చేశారని నిలదీశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని... నేడు సీఎం జగన్ ఒప్పుకున్నారన్నారు.
ఇదీ చదవండీ... ఎన్హెచ్ఆర్సీలో తెదేపా ఎంపీల ఫిర్యాదు