ETV Bharat / city

నాటుసారా మరణాలపై విజయవాడలో ఉద్రిక్తత.. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్టు

author img

By

Published : Mar 23, 2022, 3:45 PM IST

Updated : Mar 24, 2022, 5:25 AM IST

విజయవాడలోని ప్రసాదంపాడు ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి బయలుదేరిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను ప్రసాదంపాడు వద్ద పోలీసులు ఆరెస్ట్ చేశారు. నాటుసారా మరణాలపై ఎక్సైజ్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు తెదేపా ఎమ్మెల్యేల ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రసాదంపాడు వద్ద పోలీసులు, తెదేపా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

tdp leaders arrest at prasadampadu excise office
tdp leaders arrest at prasadampadu excise office

నాటుసారా మరణాలు, కల్తీ మద్యంపై ఎక్సైజ్‌ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు తెదేపా ప్రజాప్రతినిధులు చేపట్టిన కార్యక్రమం పోలీసుల అత్యుత్సాహంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నాటు సారా మరణాలపై విచారణకు డిమాండు చేస్తూ బుధవారం విజయవాడ ప్రసాదంపాడులో ఉన్న ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెదేపా నేతలు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం తర్వాత తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరి వచ్చారు.

అచ్చెన్నాయుడి ఆధ్వర్యంలో 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావడంతో వారిని ప్రసాదంపాడు జాతీయ రహదారిపైనే నిలిపివేశారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు కొంతదూరం నడిచి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడా అడ్డుకున్నారు. మద్యం సీసాలకు తాళిబొట్లు కట్టి ఎమ్మెల్యే రామానాయుడు, ఫ్లకార్డులతో మిగిలినవారు వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. కార్యక్రమానికి అనుమతి లేదని డీసీపీ స్పష్టం చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని పయ్యావుల కేశవ్‌ చెప్పగా, వేరే కారణాలు ఉన్నాయంటూ డీసీపీ వాదనకు దిగారు. కనీసం ఒక్కరినైనా పంపాలని ఎమ్మెల్యేలు డిమాండు చేశారు.

కమిషనర్‌ కార్యాలయంలో లేరని డీసీపీ చెప్పారు. ఎవరో ఒక అధికారికి ఇస్తామన్నా అంగీకరించలేదు. దాంతో కార్యకర్తలు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలను ముందుగానే ఉంగుటూరు పోలీసుస్టేషన్‌కు తరలించి, తర్వాత ఎమ్మెల్యేలనూ అరెస్టు చేస్తున్నట్లు డీసీపీ ప్రకటించారు. కమిషనర్‌ కార్యాలయం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని అరెస్టుచేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక మహిళ కానూరులో తన కార్యాలయానికి వెళ్తుండగా ఆమెను అరెస్టు చేశారు.

..

పోలీసుస్టేషన్‌లో నిరసన..: ప్రసాదంపాడు నుంచి ఉంగుటూరు స్టేషన్‌కు 15 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తరలించారు. సొంత పూచీకత్తుపై సంతకాలు చేస్తే వదిలేస్తామని పోలీసులు చెప్పగా తాము నేరం చేయలేదంటూ సంతకాలు చేసేందుకు తిరస్కరించి నేలమీద బైఠాయించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఉంగుటూరుకు వచ్చి ఎమ్మెల్యేలను, నేతలను పరామర్శించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడారు. సంతకాలు పెట్టవద్దని, అవసరమైతే తాను వచ్చి స్టేషన్‌ ముందు బైఠాయిస్తానని చెప్పారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు పోలీసులకు తెలిపారు. తీవ్ర తర్జనభర్జన మధ్య రాత్రి ఏడు గంటలకు వారిని సంతకాలు తీసుకోకుండానే స్టేషన్‌ నుంచి పంపించారు.

స్టేషన్‌కు తరలించిన ముఖ్య నాయకుల్లో అచ్చెన్నాయుడు, నేతలు చినరాజప్ప, రామానాయుడు, పయ్యావుల కేశవ్‌, గద్దె రామ్మోహన్‌, రామకృష్ణబాబు, ఆదిరెడ్డి భవాని, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, వీరాంజనేయులు, బి.అశోక్‌బాబు, మంతెన రామరాజు పలువురు కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మరికొందరిని కంకిపాడు స్టేషన్‌కు తరలించారు. స్పీకరుకు తెలియకుండా ఎలా అరెస్టు చేస్తారని నేతలు ప్రశ్నించగా.. రేడియో సందేశం పంపామని పోలీసు అధికారి తెలిపారు.

రసాయనాల నిరూపణకు సిద్ధం: బ్రాండ్‌ మద్యంలో రసాయనాలు ఉన్నాయని నిరూపించేందుకు సిద్ధమని తెదేపా ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేశ్‌ సవాల్‌ చేశారు. ‘కల్తీసారా, జెబ్రాండ్‌ మద్యంపై ప్రజా చైతన్య ఉద్యమం కొనసాగిస్తాం. జగన్‌ తరహాలో మా ఎమ్మెల్యేలు ఎవరినీ మోసం చేయలేదు. ఎందుకు అరెస్టు చేశారు..? ప్రాణాలు తీసే సైనైడ్‌ ఏ మోతాదులో ఉన్నా నష్టమే’ అని పేర్కొన్నారు. మద్య నిషేధంపై జగన్‌రెడ్డి హామీ ఇవ్వలేదని రుజువు చేస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. ‘మేం కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే.. అన్యాయంగా అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా పది దుకాణాల్లో నమూనాలు సేకరించి పరీక్షలకు పంపితే.. నిజానిజాలు వెలుగు చూస్తాయి’ అని ధ్వజమెత్తారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటుసారా మృతులను సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా? సహజ మరణాలంటున్న నేతలు జంగారెడ్డిగూడెం వెళ్లి చూడాలి. నాటుసారా మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ప్రకటించాలి. - తెదేపా ఎమ్మెల్యేలు

ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యలయం వద్ద తెదేపా నేతల అరెస్టు

ఇదీ చదవండి: నాటుసారా మృతుల కుటుంబాలకు.. తెదేపా పరిహారం అందజేత

Last Updated :Mar 24, 2022, 5:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.