ETV Bharat / city

arrest: అర్ధరాత్రి హైడ్రామా.. దేవినేని ఉమా అరెస్ట్‌

author img

By

Published : Jul 28, 2021, 2:06 AM IST

Updated : Jul 28, 2021, 9:39 AM IST

కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు.. తెదేపా నేతలను అరెస్టు చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన దేవినేనిని అర్ధరాత్రి తర్వాత పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అతనితో పాటు పార్టీ నేత పట్టాభి, బోడె ప్రసాద్​లను అరెస్టు చేశారు.

tdp leaders arrest
tdp leaders arrest

arrest: అర్ధరాత్రి హైడ్రామా.. దేవినేని ఉమా అరెస్ట్‌

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమాపై వైకాపా వర్గీయులు రాళ్ల దాడి చేశారు. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీయటంతో.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. వాహనం ధ్వంసంతోపాటు... పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ.. వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. కారు అద్దం పగులగొట్టిమరీ పోలీసులు ఉమాను అరెస్టు చేసి..పెదపారుపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కొండపల్లి అటవీ ప్రాంతంలో.. అక్రమంగా గ్రావెల్‌ తవ్వుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆ ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌.. అటవీ సంపద కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పరిశీలన అనంతరం తిరిగి వస్తుండగా.. గడ్డమణుగ గ్రామం వద్ద.. దేవినేని ఉమా వాహనంపై అకస్మాత్తుగా వైకాపా శ్రేణులు దాడికి దిగారు. పెద్దఎత్తున అల్లరి మూకలు రాళ్లు విసురుతూ అక్కడికి చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉమ కారుతోపాటు పలు వాహనాలు ఈ ఘర్షణలో ధ్వంసమయ్యాయి. అక్కడికి చేరుకున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు... వైకాపా శ్రేణులను ప్రతిఘటించటం బాహాబాహీకి దారితీసింది.

పోలీసులు అక్కడికి చేరుకుని... లాఠీఛార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి ఉమా వాహనాన్ని పంపించేశారు. దాడికి దిగనవారిని పోలీసులు అరెస్టు చేయకపోవటంపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరును నిరసిస్తూ.. జి.కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద కారులోనే ఆందోళనకు దిగారు. ఉమాకు మద్దతుగా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున బయలుదేరిన తెలుగుదేశం కార్యకర్తలు, నేతలను... పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

తంగిరాల సౌమ్య, శ్రీరాంతాతయ్య, బుద్ధా వెంకన్న, కొణకళ్ల నారాయణను గృహనిర్బంధంలో ఉంచారు. జి.కొండురు పోలీసు స్టేషన్ కు బయలు దేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మార్గమధ్యలో అడ్డుకున్న పోలీసులు ఆయనను వెనక్కి పంపించారు. స్టేషన్‌ వద్ద ఇరువర్గాలు పెద్దఎత్తున చేరుకోవటంతో.. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి లాఠీఛార్జి చేశారు.

పోలీసులు తన నుంచి ఫిర్యాదు తీసుకునే వరకూ స్టేషన్‌ నుంచి కదిలేది లేదని ఉమా నిరసన కొనసాగించారు. దాదాపు ఆరుగంటలపాటు కారులోనే నిరసన తెలిపిన ఉమాను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కారు అద్దం ధ్వంసం చేసి.. లోపలి నుంచి తలుపు తీసి.. ఉమాను బయటకులాగారు. అనంతరం అక్కడి నుంచి పోలీసు వాహనంలో పెద్దపారుపూడి తరలించారు.

సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల కనుసన్నల్లోనే.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ దాడి చేయించారని దేవినేని ఉమా ఆరోపించారు. తన వ్యాఖ్యలను బలపరుస్తూ.. ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ మాట్లాడిన వీడియోను నేతలు విడుదల చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణతో దేవినేని ఉమాను అరెస్టు చేశామని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు.

అంతకుముందు తెలుగుదేశం నేతలు పట్టాభి, బోడె ప్రసాద్‌ను అరెస్టు చేశారు. దేవినేని ఉమాను విడుదల చేయాలని కోరుతూ...తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు స్టేషన్‌ ఎదుట నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

Flash: మాజీ మంత్రి దేవినేని ఉమపై రాళ్ల దాడి

Last Updated :Jul 28, 2021, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.