ETV Bharat / city

EXAMS: పరీక్షకు దూరం చేస్తున్న నిమిషం నిబంధన.. ఇంటర్‌ విద్యార్థులకు అవస్థలు

author img

By

Published : May 7, 2022, 8:57 AM IST

INTER EXAMS: ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం నిబంధన.. అరకొర సదుపాయాలు విద్యార్థులకు ఇబ్బందిగా మారుతున్నాయి. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో లోపాలు వెలుగుచూస్తున్నాయి. పరీక్ష సమయం ఉదయం 9గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించడం లేదు.

inter exams problems
ఇంటర్‌ విద్యార్థులకు అవస్థలు


INTER EXAMS: ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులు నానా అవస్థలకు గురవుతున్నారు. నిమిషం నిబంధన.. అరకొర సదుపాయాలు విద్యార్థులకు ఇబ్బందిగా మారుతున్నాయి. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో లోపాలు వెలుగుచూస్తున్నాయి. ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోత గురవుతున్నారు. కొన్నిచోట్ల చిన్న గదుల్లోనే 30మందికిపైగా కూర్చొబెడుతున్నారు. దీంతో విద్యార్థులు మధ్య దూరం తగ్గిపోయింది. పరీక్ష సమయం ఉదయం 9గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షలకు అనుమతించడం లేదు.

నంద్యాల జిల్లా డోన్‌లో పది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని వేణుగోపాల్‌పురంలో ఉన్న అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రానికి ముగ్గురు విద్యార్థులు 45 నిమిషాలు ఆలస్యంగా రావడంతో వారిని అనుమతించలేదు. పరీక్ష కేంద్రాలు తెలుసుకొనేందుకు కొందరు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

కోనసీమ జిల్లా కాట్రేనికోనలోని కళాశాలలో చదువుతున్న పి.చంద్రదుర్గా పళ్లంరాజు ఇంటర్‌ పరీక్ష రాసేందుకు శుక్రవారం ముమ్మిడివరంలోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం వద్దకు వచ్చాడు. అక్కడున్న పోలీసు కానిస్టేబుల్‌ హాల్‌టికెట్‌ చూసి.. తన పరీక్ష కేంద్రం గురుకుల పాఠశాల అని చెప్పడంతో అక్కడి నుంచి ఆ కేంద్రానికి చేరుకున్నాడు. అప్పటికే సమయం మించిపోవడంతో సిబ్బంది లోపలికి అనుమతించలేదు.

కోనసీమ జిల్లా కాట్రేనికోనకు చెందిన విద్యార్థిని పావని ముమ్మిడివరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష కేంద్రం చేరుకోవడానికి అవస్థలు పడింది. మొదట రెండు వేర్వేరు కేంద్రాలకు వెళ్లిన ఆమె.. చివరి క్షణాల్లో గురుకుల పాఠశాలకు చేరుకొని పరీక్ష రాయగలిగింది.పదో తరగతి పరీక్షల్లో సహేతుక కారణాలు ఉంటే అరగంట ఆలస్యంగా వచ్చిన అనుమతించగా.. ఇంటర్‌లో మాత్రం ఈ నిబంధన అమలు చేయడం లేదు.

శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది పరీక్షలకు 95.3శాతం మంది హాజరయ్యారు. 5,12,793మంది విద్యార్థులకుగాను 4,88,904మంది పరీక్షలు రాశారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో ముగ్గురు విద్యార్థులను డిబార్‌ చేశారు.

విజయనగరం జిల్లా గుర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రంలో పంకాలు మరమ్మతులకు గురవడంతో శుక్రవారం పరిశీలనకు వెళ్లిన కలెక్టర్‌ సూర్యకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ కొన్ని గదుల్లో 35 మంది చొప్పున కూర్చోబెట్టారు. విద్యార్థులు ఇరుకిరుగా కూర్చున్నారు. అక్కడి సమస్యలను వెంటనే పరిష్కరించి, సౌకర్యాలను మెరుగు పరచాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు.విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 20శాతం కేంద్రాల్లో సీసీకెమెరాలు పని చేయలేదు. సర్వర్‌ సమస్య తలెత్తింది.

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని కొట్టు, తొడుము, కెమిశిల విద్యార్థులకు కొమరాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కేంద్రం కేటాయించారు. వీరు ఇక్కడికి చేరుకునేందుకు నాగావళి నదిని దాటి రావాల్సిన పరిస్థితి. గురువారం రాత్రి వర్షాలు కురవడంతో నది పొంగుతుందేమోనన్న భయంతో ఉదయం ఏడుగంటలకే విద్యార్థులు నది దాటి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.

నంద్యాల జిల్లా డోన్‌లోని వెంకటేశ్వర కళాశాలలో పది నిమిషాలు ఆలస్యమైందని ముగ్గురు విద్యార్థులను వెనక్కి పంపించారు.

అన్నమయ్య జిల్లా ములకచెరువు కేంద్రంలో 30మంది విద్యార్థులు పరీక్షకు గైర్హజరయ్యారు. మొత్తం 342 మందికి 312మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏలూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శిథిలావస్థకు చేరిన రేకులషెడ్లలో శుక్రవారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. రంధ్రాలు పడిన పైకప్పు, విద్యుత్తు సౌకర్యం, ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు.

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని వెలుసోద గ్రామానికి చెందిన జగదీష్‌ 20 రోజులక్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండుకాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తండ్రి సింహాచలం సహకారంతో తామరాపల్లిలోని బీఆర్‌ అంబేడ్కర్‌ సెంటినరీ మహిళా రెసిడెన్షియల్‌ కాలేజీలోని కేంద్రానికి ఆటోలో చేరుకొని పరీక్ష రాశాడు.

కనీస హాజరు నుంచి మినహాయింపు.. ఇంటర్‌ విద్యార్థులకు కనీస హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా 2021-22 అకడమిక్‌కు ఈ మినహాయింపునిస్తున్నట్లు పేర్కొంది. ఫీజులు చెల్లించలేదని, హాజరు తక్కువగా ఉందని విద్యార్థులు పరీక్షకు హాజరుకాకుండా నిలుపుదల చేయొద్దని ప్రిన్సిపాళ్లకు సూచించింది.


ఇదీ చదవండి:

నేడు, రేపు.. నాగార్జున యూనివర్సిటీలో మెగా జాబ్​ మేళా..!

'ఆరాధన' మూవీ.. ఇప్పటికీ ఆ రికార్డు ఎన్టీఆర్​, ఏఎన్​ఆర్​, చిరంజీవి ఖాతాలోనే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.