ETV Bharat / city

అందుకే పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది: సజ్జల

author img

By

Published : Jun 7, 2022, 8:30 PM IST

Sajjala on SSC Results: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందనే విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ ఏడాది మాల్ ప్రాక్టీస్​కు బ్రేక్ పడటంతో పదిలో ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చన్నారు.

sajjala ramakrishna reddy on ssc results
sajjala ramakrishna reddy on ssc results

Sajjala Ramakrishna Reddy on SSC Results in AP: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీన్ని తాము పట్టించుకోమన్నారు. ఇంగ్లీష్ మీడియం అమలుతో తొలుత కొన్ని సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయని సీఎం కూడా చెప్పారని ఆయన అన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా పోటీ పరీక్షల్లో ముందుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇంగ్లీష్ మీడియం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయని సజ్జల అన్నారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందనే విమర్శలపై సజ్జల స్పందించారు. 'పరీక్షల్లో మాల్ ప్రాక్టీసులకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించడం తప్పా? పారదర్శకంగా పది పరీక్షలు జరిపామా లేదా అనేదే ప్రామాణికం. నారాయణ, చైతన్య, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కాన్సర్​లా తగులుకొని పరీక్షలకే ఆర్థం మార్చేశాయి. గతంలో ఎడాపెడా మాల్ ప్రాక్టీసులు చేసి 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మాల్ ప్రాక్టీస్​కు బ్రేక్ పడటంతో పదిలో ఉత్తీర్ణత శాతం తగ్గింది.

ఇంతకాలం 90 శాతంపైగా ఉత్తీర్ణత ఎలా వచ్చిందో.. విమర్శలు చేసేవారు సంజాయిషీ ఇవ్వాలి. రెండేళ్లపాటు కొవిడ్ వల్ల విద్యా సంస్థలు సరిగా నడవలేదు. రెండేళ్లుగా పరీక్షలు లేకపోవడంతో పోటీకి అవసరమైన స్ఫూర్తి విద్యార్థుల్లో తగ్గి ఉండొచ్చు. ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ చర్యలతో పదో తరగతి పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు' అని సజ్జల అన్నారు.

వైద్యం కోసం కేంద్రం ఇస్తున్నది కొంతే.. వాటితో రాష్ట్రాలకు ఏమాత్రం సరిపోవని సజ్జల అన్నారు. అయినా.. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఛారిటీతో ఇచ్చేవి కాదని.. కేంద్ర నిధులు వాడుకోవడం రాష్ట్రానికి ఉన్న హక్కు అన్నారు. ఆరోగ్య శ్రీ నిధులంతా మేమే ఇస్తున్నామని భాజపా నేతలు అంటే.. దాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు సజ్జల చెప్పారు.

మాల్ ప్రాక్టీసులకు తావు లేకుండా వ్యవహరించడం తప్పా?: సజ్జల

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.