ETV Bharat / city

JAGAN CASE: జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌.. ఉత్తర్వులు నేటికి వాయిదా

author img

By

Published : Sep 14, 2021, 2:55 PM IST

Updated : Sep 15, 2021, 5:32 AM IST

RRR PETETION HEARINGS
RRR PETETION HEARINGS

14:53 September 14

RRR PETETION HEARINGS

   ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వాలని, పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలన్న రఘురామ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నేడు నిర్ణయం ప్రకటించనుంది. రఘురామ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరిస్తే సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఒకవేళ హైకోర్టు రఘురామ వాదనతో ఏకీభవిస్తే... తీర్పు వెల్లడి నిలిచిపోయే అవకాశం ఉంది.

 ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ మలుపులు తిరుగుతోంది. బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘింస్తున్నారంటూ జూన్ 4న రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుతో సంబంధం లేని రఘురామ పిటిషన్ విచారణ అర్హతపై మొదట సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. రఘురామ వాదనతో ఏకీభవించిన సీబీఐ న్యాయస్థానం... పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. జగన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్నది రఘురామ ప్రధాన వాదన. సహనిందితులు, సాక్షులుగా ఉన్న కొందరు అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారని వాదించారు. ఎంపీగా అనర్హత వేటు వేయాలని వైకాపా కోరినందునే... వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం పిటిషన్ వేశారని జగన్మోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సీఎంగా ఉన్నందున బెయిల్ రద్దు చేయాలంటున్నారు తప్ప... సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక్కటి కూడా సరైన కారణం చూపలేదన్నారు. సీబీఐ మాత్రం తటస్థ వైఖరి ప్రదర్శించింది. పిటిషన్‌లోని అంశాలను పరిశీలించి విచక్షణ మేరకు, చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోరింది. జులై 30న వాదనలు ముగించిన సీబీఐ కోర్టు... గత నెల 24నే తీర్పు వెల్లడినున్నట్లు ప్రకటించింది. అయితే జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లలోనూ వాదనలు దాదాపు ఒకే తీరుగా జరిగాయి. 

   గత నెల 24న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై వాదనలు విన్న సీబీఐ కోర్టు... రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెల్లడిస్తామంటూ నేటికి వాయిదా వేసింది. అయితే జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలని రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు రాకముందే రఘురామ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందంటూ... జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియా ట్వీట్ చేసిందన్నది రఘురామ ఆరోపణ. అదేవిధంగా నవంబరు 15లోగా రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి అనుమతినిచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత తీర్పుపై ఆందోళనగా ఉందని... మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. పిటిషన్ల బదిలీకి చట్టబద్ధమైన కారణాలు చూపించడం లేదని సీబీఐ పేర్కొంది. మంగళవారం లంచ్ మోషన్ విచారణ జరిపిన హైకోర్టు... తీర్పును నేటికి వాయిదా వేసింది. 

  సాక్షిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న రఘురామరాజు పిటిషన్‌పై సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. కోర్టు తీర్పు వెల్లడించకముందే జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టివేసినట్లు గత నెల 24న సాక్షి మీడియా ట్వీట్ చేసిందని రఘురామ వాదించారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తను ట్వీట్ చేసిన సాక్షి సీఈఓ, ఎడిటర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్దేశ్యపూర్వకంగా ట్వీట్‌ చేయలేదని, ఓ ఉద్యోగి పొరపాటు వల్ల జరిగిందని... సాక్షి మీడియా వివరించింది. కొద్దిసేపటికే ట్వీట్‌ను సవరించినట్లు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు... నేడు తీర్పు వెల్లడించనుంది.

ఇదీ చదవండి.. 

Viveka Murder Case: వివేకా హత్య కేసు..సీబీఐ అధికారుల సీన్ రీకన్​స్ట్రక్షన్‌

Last Updated : Sep 15, 2021, 5:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.