ETV Bharat / city

CHANDRABABU: 'ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా గెలిపిద్దాం'

author img

By

Published : Jul 12, 2022, 7:23 PM IST

Updated : Jul 13, 2022, 4:25 AM IST

Draupadi Murmu meet Chandrababu: ద్రౌపదీ ముర్మును ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిందని తెలిశాక, సామాజిక న్యాయం కోసం ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించామని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ముర్మును ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నానని అన్నారు. తెదేపా ఎంతో బాధ్యతగా ఆలోచించి ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించిందని వెల్లడించారు.

Draupadi Murmu meet Chandrababu
Draupadi Murmu meet Chandrababu

'ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా గెలిపిద్దాం'

ఆదివాసీలను ఉన్నత స్థానాల్లోకి తేవడం అరుదుగా జరుగుతుందని, పేద గిరిజన కుటుంబంలో పుట్టిన ద్రౌపదీ ముర్మును ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసిందని తెలిశాక, సామాజిక న్యాయం కోసం ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించామని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరచడాన్ని గర్వకారణంగా భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం మంగళవారం రాష్ట్రానికి వచ్చిన ద్రౌపదీ ముర్ము విజయవాడలో తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. దీనికి ముందు తెదేపా నాయకులు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో సమావేశమై రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ముర్ము అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సిన అవసరం గురించి చర్చించారు. అనంతరం సమావేశం జరిగే హోటల్‌కు చేరుకున్నారు. ముర్ముకు చంద్రబాబు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆమె వెంట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వచ్చారు. 'ముర్మును ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తున్నాను. తెదేపా ఎంతో బాధ్యతగా ఆలోచించి ఆమెకు మద్దతివ్వాలని నిర్ణయించింది' అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా మీ ఎంపిక బలహీనవర్గాలకు గర్వకారణం. తెదేపా తరఫున మీకు సంపూర్ణ సహకారం అందిస్తాం’ అని ముర్ముతో చెప్పారు.

మీ సోదరి ఎన్నికయ్యేలా ఆశీర్వదించండి: ద్రౌపదీ ముర్ము

'ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజలకు నా నమస్కారాలు’ అంటూ ద్రౌపదీ ముర్ము తెలుగుతో ప్రసంగం ప్రారంభించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఇది ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, మహాకవులకు పురిటిగడ్డ. నన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. దేశం 75ఏళ్ల స్వాతంత్య్ర విజయోత్సవాలు చేసుకుంటున్న వేళ.. మీ సోదరిని దేశ అత్యున్నత పీఠంపై కూర్చునేలా ఆశీర్వదించండి' అని ఆమె కోరారు.

మాతో సమావేశం జరగకూడదని వైకాపా పన్నాగం: తెదేపా నేతలు

తెదేపా నాయకులతో ద్రౌపదీ ముర్ము సమావేశమవకుండా చూసేందుకు వైకాపా నాయకులు ప్రయత్నించారని తెదేపా నేతలు ఆరోపించారు. ‘సీఎం జగన్‌తోనూ, వైకాపా ప్రజాప్రతినిధులతోనూ సమావేశమై వెళ్లిపోవాలని వాళ్లు పట్టుబట్టారు. తెదేపా నాయకులతో సమావేశం రద్దు చేసుకోవాలని భాజపా నాయకులపై ఒత్తిడి తెచ్చారు. ఆ విషయాన్ని భాజపా నాయకులు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి ఎవరిని కలవాలో, ఎవరిని కలవొద్దో నిర్ణయించడానికి వాళ్లెవరని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెదేపా నాయకులతో సమావేశం జరిగి తీరాలని స్పష్టం చేశారు’ అని తెదేపా నేత ఒకరు పేర్కొన్నారు.

విమానాశ్రయంలోనే కలసి వెళ్లిపోవాలన్నారు: తెదేపా నాయకులతో ముర్ము సమావేశం వద్దని పట్టుబట్టిన వైకాపా నాయకులు, తప్పదనుకుంటే తెదేపా ప్రజాప్రతినిధుల్ని విమానాశ్రయానికి రమ్మని చెప్పి, అక్కడే కలసి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారని భాజపా నాయకుడు ఒకరు తెలిపారు. అమిత్‌ షా జోక్యం చేసుకుని సమావేశం జరగాలని స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు.

బాగా బరువు తగ్గినట్టున్నారు: ద్రౌపదీ ముర్ము రావడానికి 10 నిమిషాల ముందే సోము వీర్రాజు, సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు తదితరులు హోటల్‌కు వచ్చారు. అప్పటికే అక్కడి వేచి ఉన్న చంద్రబాబుతో వారు ముచ్చటించారు. బాగా బరువు తగ్గినట్టున్నారని జీవీఎల్‌ అనగా... 74 నుంచి 68 కిలోలకు వచ్చినట్టు చంద్రబాబు పేర్కొన్నారు.

స్వచ్ఛందంగా మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు: కిషన్‌రెడ్డి

'దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి ఒక గిరిజన నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించుకున్నాం. సదుద్దేశంతో, సామాజిక దృక్పథంతో ముందుకు వచ్చి ఆమెకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపినందుకు తెదేపా అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలాం ఎంపికలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు' అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 'తెదేపా సామాజిక న్యాయం కోసం ఆవిర్భవించిన పార్టీ. ముర్ము గిరిజన మహిళ, అనుభవజ్ఞురాలు, రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెకు మద్దతివ్వడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను' అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వాజపేయీ ప్రధాని అయ్యాకే కేంద్ర మంత్రివర్గంలో మొదటిసారి ఒక ఎస్టీకి ప్రాతినిధ్యం లభించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. రాజకీయ కోణంలో కాకుండా, ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి... ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్‌డీఏ ఎంపిక చేయడం, దీన్ని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఆమోదించడం దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నిదర్శనమని, దీనికి చంద్రబాబును అభినందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎంపీ కేశినేని నాని, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు, భాజపా ఎంపీలు సి.ఎం.రమేష్‌, జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్‌, వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 13, 2022, 4:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.