గుట్కా విక్రయా​లపై పోలీసుల దాడులు.. భారీగా సరకు పట్టివేత

author img

By

Published : Jun 12, 2021, 5:23 PM IST

గుట్కా విక్రయాలపై పోలీసుల దాడులు

ప్రజల ప్రాణాలకు హాని తలపెట్టే నిషేధిత గుట్కాను రూపుమాపేందుకు పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో గుట్కాలు విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అత్యాశకు పోయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. అడ్డదారుల్లో గుట్కా వ్యాపారం చేస్తున్న వారిని అరెస్టు చేశారు. లక్షలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

గుట్కా విక్రయాలపై పోలీసుల దాడులు

రాష్ట్రంలో పలుచోట్ల గుట్కా విక్రయిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఓవైపు పోలీసుల దాడులు జరుగుతున్నా.. అక్రమమార్గంలో గుట్కా విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ.. వారి భరతం పడుతున్నారు. అడ్డదారుల్లో గుట్కా తరలిస్తున్న వారిని అరెస్ట్ చేసి సరకు స్వాధీనం చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం మద్ది మల్లయ్య వీధిలోని గోదాములో రూ.11 లక్షల విలువ చేసే గుట్కాలను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా, సిగరెట్లను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మద్ది మల్లయ్య వీధిలోని ఓ గోదాములో నిషేధిత గుట్కా, సిగరెట్ ప్యాకెట్లు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించారు. అర్బన్ సీఐ బిలాలుద్దీన్ ఆధ్వర్యంలో శనివారం గోదాములపై దాడి చేసి గుట్కా, సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గుట్కా, సిగరెట్ ప్యాకెట్లను డీఎస్పీ విజయ భాస్కర్ రావు పరిశీలించారు. ఎవరైనా నిషేధిత గుట్కా, సిగరెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

నందిగామలో..

కృష్ణా జిల్లా నందిగామ వాసవి మార్కెట్​లో గుట్కా నిల్వలపై పోలీసులు దాడులు చేశారు. కేతేపల్లి విష్ణు అనే వ్యాపారి వద్ద రూ.20 వేలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన గుట్కాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ కనకారావు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

చంద్రబాబు ఐక్య కార్యాచరణకు సోనూసూద్​ ఓకే!

ఇప్పుడు డీజిల్ వంతు.. రూ.100 దాటేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.