'గడప గడపకు' నిలదీతలు.. సమస్యలతో జనం స్వాగతం!

author img

By

Published : May 11, 2022, 8:50 PM IST

'గడప గడపకు' నిలదీతలు

'గడప గడపకు మన ప్రభుత్వం' అంటూ వైకాపా నాయకులు చేపట్టిన కార్యక్రమానికి తొలిరోజే సమస్యలు స్వాగతం పలికాయి. ఎక్కడికక్కడ ప్రజలు సమస్యలను ఏకరవుపెట్టారు. పథకాలు తమకు అందడం లేదంటూ ప్రజాప్రతినిధులను నిలదీశారు. రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించలేరా? అంటూ ప్రశ్నించారు.

'గడప గడపకు' నిలదీతలు

నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం హెచ్ కొట్టాల గ్రామంలో మంత్రి బుగ్గన "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్‌ చదువుతున్న తన కుమారుడికి విద్యాదీవెన రావటం లేదని ఓ మహిళ ఆయన్ని నిలదీశారు. వితంతు పింఛన్లు రావటం లేదని కొందరు మంత్రికి విన్నవించారు. తమ పొలాలు ఆన్‌లైన్‌లో ఎక్కటం లేదని కొందరు రైతులు వాపోయారు. ఉగాది నుంచి ఉపాధి కూలీ డబ్బులు రావటం లేదని మహిళలు మొరపెట్టుకోగా వారంలో వస్తాయని మంత్రి చెప్పారు. కేవలం రెండు ఇళ్లకు మాత్రమే తిరిగిన మంత్రి బుగ్గన తనకు మీటింగ్ ఉందంటూ..వెళ్లిపోయారు.

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు.. నిరసన సెగ తగిలింది. వివిధ అంశాలపై ప్రజలు మంత్రిని నిలదీశారు. ఆలూరు-హత్తిబెళగల్ ప్రధాన రహదారి ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. తాగునీటి సమస్య వేధిస్తోందని నిలదీశారు. తనకు ముగ్గురు పిల్లలు ఉంటే.. ఒక్కరికీ అమ్మఒడి రావటం లేదని ఓ మహిళ ప్రశ్నించారు. తనకు పింఛను రావటం లేదని, తన భర్త చనిపోయారని ఓ వృద్ధురాలు మంత్రికి మొరపెట్టుకున్నారు. జగన్ చాలా చేస్తున్నారని.. ఇచ్చినవి తీసుకోవాలంటూ మంత్రి చెప్పుకొచ్చారు. పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీదేవికి.. సమస్యలు స్వాగతం పలికాయి. పింఛన్లు, సంక్షేమ పథకాలు అందడం లేదని స్థానికులు ఆరోపించారు . పారిశుద్ధ్యం పడకేసిందని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వాపోయారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురంలో..ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తాగునీటి సమస్య వేధిస్తోందని గ్రామస్థులు గోడు వెల్లబోసుకున్నారు. చాలామందికి పింఛన్లు రావడం లేదని మహిళలు తెలిపారు. పర్యటన సాగుతుండగా.. ఓ వృద్ధురాలు ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని చూసిన ఆమె.. ఇంట్లోకి పరుగు తీసింది. సమస్యల గురించి మీకు చెప్పినా... గోడకు చెప్పిన ఒకటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్యలు తీర్చకుండా.. ఓట్ల కోసం మాత్రం పరుగెత్తుకొస్తారని అసహనం వ్యక్తం చేసింది. ఇంకెప్పుడూ ఓట్ల కోసం రావొద్దంటూ దండాలు పెడుతూ ఇంట్లోకి వెళ్లిపోయింది. జగనన్న ఇల్లు కట్టించి ఇచ్చే వరకు బతుకుతానో లేదో అంటూ మరో మహిళ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

అనంతపురంలో పర్యటించిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి మురుగుకాలువల నిర్వహణ సరిగ్గా లేదని స్థానికులు చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఊసేలేదని నిరుద్యోగులు వాపోయారు. మురుగు కాలువల నిర్మాణానికి నిధుల మంజూరు చేశామన్న ఎమ్మెల్యే.. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారన్నారు. హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ కు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లిన నేతలు... సమస్యలు చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం లో పర్యటించిన పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు స్థానికులు సమస్యలు ఏకరవుపెట్టారు. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ ఏర్పాటు చేయలేదని వాపోయారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.