PAWAN KALYAN ON ALLIANCES: 'పొత్తులపై ఎవరి మైండ్ గేమ్‌లోను పావులు కావొద్దు'

author img

By

Published : Jan 12, 2022, 4:59 AM IST

PAWAN KALYAN ON ALLIANCES

PAWAN KALYAN ON ALLIANCES: సంస్థాగత నిర్మాణం.. సార్వత్రిక ఎన్నికల్లో బలమైన పోరాటం లక్ష్యంగా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. పొత్తుల విషయంలో ఎవరి మైండ్ గేమ్‌లకూ పావులు కావొద్దని జన సైనికులకు సూచించారు. ఇప్పటికే భాజపాతో పొత్తులో ఉన్నామన్న ఆయన.. ఈ విషయంలో అంతా ఒకే మాట మీద ఉందామన్నారు. ప్రజాసమస్యలపై త్వరలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని.. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.

PAWAN KALYAN ON ALLIANCES IN GENERAL ELECTIONS: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తోపాటు పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, పార్టీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ బలం పుంజుకుంటోందన్న పవన్‌.. సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. జనసేన పార్టీ స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వచ్చిన గుంపు కాదని పేర్కొన్నారు. మార్చిలో నిర్వహించే ఆవిర్భావ సభ 2024 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలనే ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు.

సమస్యలపై పండుగ తరువాత పోరు..!

రైతుల కోసం పార్టీ శ్రేణులు ఇప్పటికే వివిధ స్థాయిల్లో పోరాటాలు చేశారని.. మున్ముందు వారి సమస్యలపై మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి అండగా నిలుస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. జాబ్ క్యాలెండర్, ఇతర సమస్యలపై పోరాటానికి సంక్రాంతి తర్వాత ఒక సమావేశం నిర్వహించి అందరి సలహాలు, సూచనలతో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.. పొత్తులపై నిర్ణయ బాధ్యతను తనపై ఉంచినందుకు జనసైనికులకు ధన్యవాదాలు చెప్పిన పవన్‌.. అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనతోనే ముందుకు వెళ్తామన్నారు.

'పొత్తులపై ఎవరి మైండ్ గేమ్‌లోను పావులు కావొద్దు'

ప్రమాద బీమా కల్పన..

పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా కల్పిస్తున్నామన్న పవన్‌.. మార్చి 1 నుంచి 14 తేదీ వరకు నిర్వహించే సభ్యత్వ నమోదును మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గత ఏడాది పార్టీపరంగా దాదాపు 60 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్.. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. అమరావతి రైతులకు అండగా ఉన్నామన్నారు.

ఇదీ చదవండి: Jagananna Smart Township Launched: మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నెరవేరబోతుంది: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.