ETV Bharat / city

Municipal Elections: ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలు..పోలింగ్ శాతం ఎంతంటే..

author img

By

Published : Nov 15, 2021, 5:04 PM IST

Updated : Nov 15, 2021, 9:57 PM IST

ముగిసిన మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికలు
ముగిసిన మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికలు

17:01 November 15

ముగిసిన మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికలు

రాష్ట్రంలో మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల్లూరు నగరపాలికతో పాటు, 12 పురపాలికల్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఎస్​ఈసీ ఓటేసే అవకాశం కల్పించింది. ఇవాళ జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 17న చేపట్టనున్నారు.  

రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. నెల్లూరు నగరపాలికతో పాటు, కుప్పం, దాచేపల్లి, గురజాల, దర్శి, జగ్గయ్యపేట, కొండపల్లి, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెం, కమలాపురం, రాజంపేట, పెనుకొండ, బేతంచర్లలో పోలింగ్ జరిగింది. ఇవాళ నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

  • నెల్లూరు నగరపాలిక  - 50.01 శాతం
  • కుప్పం పురపాలిక - 76.49 శాతం
  • ఆకివీడు నగర పంచాయతీ - 79.74 శాతం
  • దర్శి నగర పంచాయతీ - 76.4 శాతం
  • దాచేపల్లి పురపాలిక   - 71.88 శాతం
  • జగ్గయ్యపేట పురపాలిక - 78.45 శాతం
  • కొండపల్లి పురపాలిక  - 66.79 శాతం
  • గురజాల పురపాలికలో - 71.18 శాతం
  • బుచ్చిరెడ్డిపాలెం పురపాలిక- 76.48 శాతం
  • కమలాపురం పురపాలికలో - 76.48 శాతం
  • రాజంపేట పురపాలిక  - 76.48 శాతం
  • పెనుకొండ పురపాలిక - 76.48 శాతం
  • బేతంచర్ల పురపాలిక- 76.48 శాతం

పలు చోట్ల ఉద్రిక్తతలు

అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఎంపీ గోరంట్ల మాధవ్ యత్నించగా.. అక్కడే ఉన్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే పార్థసారధి అడ్డుకున్నారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో  పోలీసులు సర్దిచెప్పి పంపించివేశారు. కుప్పం పురపాలక ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తున్న కొందరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. 18, 19 వార్డుల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తుండగా స్థానిక ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరు అనంతపురం జిల్లా రాయచోటి నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. కుప్పం ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ పోలీసుల కాళ్లుపట్టుకున్నారు. 16 వ వార్డులో విజయవాణి పాఠశాలలో దాక్కున్న దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు వెళ్లిన తెలుగుదేశం కార్యకర్తలపైనే పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. 43వ డివిజన్‌లో పోలింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేత అబ్దుల్‌ అజీజ్‌ను  వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకోగా.. పోలీసులు జోక్యం చేసుకుని చెదరగొట్టడంతో  సమస్య సద్దుమణిగింది.  

కడపలోని కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది.  9వ వార్డులో వైకాపా దొంగ ఓట్లు వేయిస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం నేతలు  ఆందోళనకు దిగారు. మాచిరెడ్డిపల్లి నుంచి ర్యాలీగా వెళ్లిన తెదేపా నేతలు పుత్తా లక్ష్మీరెడ్డి, చైతన్యరెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విశాఖలో నగరపాలక ఎన్నికల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ పరిశీలనకు ఎంపీ విజయసాయిరెడ్డి రాగా.. అక్కడే ఉన్న తెలుగుదేశం, జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పంపించి వేయాలని కోరగా... పోలీసులు వారిని పక్కకు తోసివేశారు. దీంతో వారంతా అక్కడే భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైకాపా: చంద్రబాబు

స్థానిక సంస్థల ఎన్నికల్లో  దొంగ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని వైకాపా అపహాస్యం చేసిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకొనేందుకు.. గెలిచామని చెప్పుకోనేందుకు అక్రమాలకు పాల్పడిందని ఆక్షేపించారు. వైకాపా ఎంపీలు, మేయర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. దొంగఓటర్లపై పోరాడేవారిపై పోలీసుల లాఠీఛార్జ్‌ చేయడం దుర్మార్గమన్నారు. అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆక్షేపించారు. వైకాపాకు రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదన్నారు. కుప్పంలో దొంగ ఓటర్ల వీడియోలను ఆయన ప్రదర్శించారు.

కుప్పంలో ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి దొంగఓట్లు వేయించి  అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు. తెలుగుదేశం నేతలను పోలీసులతో నిర్బంధించి.. ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దొంగఓటర్లను  తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ఇతర ప్రాంతాల వారిని పోలీసులు ఎలా రానిచ్చారని లోకేశ్ ప్రశ్నించారు. 

కుప్పంలో వైకాపా దొంగ ఓట్లకు పాల్పడిందనే తెలుగుదేశం చంద్రబాబు ఆరోపణను ఆ పార్టీ నేత సజ్జల ఖండించారు. తెదేపానే దొంగఓట్లు వేయించుకుందని విమర్శించారు.  వైకాపా అక్రమాలకు పాల్పడుతుంటే ...తెలుగుదేశం ఏజెంట్లు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు కుప్పంలో స్థానం లేకుండా చేస్తారని విమర్శించారు. 

ఎస్​ఈసీకి ఫిర్యాదు

పురపాలక ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందంటూ  తెలుగుదేశం నేతలు SEC నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని....తక్షణం అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. వైకాపా అక్రమాలపై తెలుగుదేశం ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కొందరు తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి

Municipal Polls: ఉద్రిక్తతల మధ్య ముగిసిన 'కుప్పం' ఎన్నికల పోలింగ్‌

Last Updated : Nov 15, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.