MP Raghurama: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాసిన లేఖలే.. ప్రస్తుతం ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ కేంద్రం అవసరం లేదని లేఖ రాసినట్లు తెలిసిందన్న ఆయన.. ప్రాజక్టుకు అయ్యే రూ.30 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే... ముందు ఖర్చు చేసి.. తరవాత నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే బావుంటుందని సూచించారు.
పోలవరం ప్రాజక్టు ద్వారా.. కృష్ణా డెల్టా, రాయలసీమకు నీళ్లు ఇస్తే బావుంటుందన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆదాయానికి మించి చేస్తున్న అప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కార్పొరేషన్ల పేరు మీద ఇష్టానుసారంగా అప్పులు చేస్తుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పులు అడిగితే అంత ఇవ్వొద్దని కేంద్ర ఆర్ధిక శాఖ ఎక్సెండీచర్ కార్యదర్శి సోమనాథ్ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో టీడీఆర్ పేరుతో.. అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, అవ భూముల పేరుతో చేసిన రీతిలోనే.. ఈ విషయంలో కూడా జరుగుతున్నాయని ఆరోపించారు.
గతంలో టీడీఆర్లో 3 నుంచి 7 వేల గజాలు మాత్రమే తీసుకునే వారని.. కానీ, ఇప్పడు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021- 22 ఏడాదిలోనే.. 70 వేల పైన స్థలాలు టీడీఆర్ కిందకు తీసుకువచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. తణుకులో ఒక నాయకుడు పనిగట్టుకుని స్థలాలు సేకరించి.. టీడీఆర్ పరిధిలోకి తీసుకొచ్చారన్నారు. టిీడీఆర్కు.. తణుకు ఎమ్మెల్యేను మోడల్ అంటున్నారని, అదే విధంగా.. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా... ఎన్ని మున్సిపాలిటీల్లో ఎన్ని టిడిఆర్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అమరావతిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రధాన మంత్రికి గతంలో లేఖ రాసినట్లు పేర్కొన్న రఘురామ.. ఇప్పటికే ప్రకటించిన విధంగా... కేంద్ర కార్యాలయాలు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ముఖ్యమంత్రికి భాష రాక, పలు మీడియా సంస్థలను ఉన్మాది అన్నారా.. లేక అర్థం తెలియక అలా అన్నారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: high court : లీగల్ ఫీజుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆక్షేపణ