ETV Bharat / city

అక్కడే నన్ను అదుపులోకి తీసుకోవాలనుకున్నారు: ఎంపీ రఘురామ

author img

By

Published : Jul 5, 2022, 4:10 PM IST

అక్కడే నన్ను అదుపులోకి తీసుకోవాలనుకున్నారు
అక్కడే నన్ను అదుపులోకి తీసుకోవాలనుకున్నారు

RRR Comments: భీమవరంలో జరిగిన అల్లూరి 125 వ జయంతి ఉత్సవాల్లో తాను పాల్గొనకుండా వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. తాను హైదరాబాద్​ నుంచి రైల్లో వస్తున్నానని తెలుసుకొని.., రైలు ఆంధ్రా సరిహద్దుకు చేరుకోగానే అదుపులోకి తీసుకునేందుకు ప్రణాళిక రచించారన్నారు.

RRR on Tour: భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో తాను పాల్గొనకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. డీజీ ఆఫీసు నుంచి వెళ్లిన సమాచారం తన వద్ద ఉందన్నారు. రఘురామ వస్తే ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకోవాలని కింది స్థాయి పోలీసులకు ఆదేశాలు అందాయన్నారు. చెక్‌పోస్టు వద్ద అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారని.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోనే 20 మంది పోలీసులు చెకింగ్‌ మొదలుపెట్టారన్నారు. రైలు ఆంధ్రా సరిహద్దుకు చేరుకోగానే అదుపులోకి తీసుకునేందుకు ప్రణాళిక రచించారన్నారు. పోలీసుల్లో కూడా మంచోళ్లు ఉంటారని.. వారే తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు.

రఘురామ హత్యకు కుట్ర: ఎంపీ రఘురామకృష్ణరాజుని సత్తెనపల్లిలో హత్య చేసేందుకు.. తాడేపల్లి నుంచి ప్రణాళిక వెళ్లిందని తెదేపా నేత బొండా ఉమ ఆరోపించారు. భీమవరంలో జరిగిన అల్లూరి 125వ జయంతికి.. నర్సాపురం రైలుకు రఘురామ వచ్చి ఉంటే.. ఆయనకదే చివరి రోజయ్యేదన్నారు. సొంత పార్టీ ఎంపీని రానీయకుండా ముఖ్యమంత్రి లేఖ ఇప్పించారని ఆరోపించారు.

రఘురామ ఇంటి వద్ద హైడ్రామా: హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌ హిల్స్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసం వద్ద సోమవారం హైడ్రామా నడిచింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ద్వారా ఇది గమనించిన ఎంపీ భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు అతడిని పట్టుకొన్నారు. వారు ప్రశ్నించినప్పుడు పొంతనలేని సమాధానాలిచ్చాడు. ఐడీ, ఆధార్‌కార్డులు చూపేందుకు నిరాకరించాడు. అనంతరం గచ్చిబౌలి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తాను ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సుభాని అలియాస్‌ ఫరూక్‌ అని, రెండు రోజుల క్రితం ఇన్నోవాలో ఆరుగురు పోలీసులం హైదరాబాద్‌కు వచ్చామని చెప్పాడు.

ఎంపీని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ..: శనివారం ఉదయమే 10-12 మంది వ్యక్తులు రెండు కార్లలో హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఇన్నోవాలో గచ్చిబౌలిలోని ఎంపీ రఘురామ ఇంటి వద్ద కాపు గాసినట్టు సమాచారం. ఆయన వాహనాన్ని అనుసరిస్తూ... కదలికలను గమనిస్తూ వచ్చారు. ఏపీ పోలీసులు తనను వెంబడిస్తున్నారనే అనుమానంతో ఆదివారం రాత్రి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం బయల్దేరిన ఎంపీ రఘురామ ప్రధాని సభకు వెళ్లకుండానే బేగంపేట రైల్వేస్టేషన్‌లో దిగిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఎంపీ రఘురామ నివాసంలోకి ఒకరు ప్రవేశించి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించే ప్రయత్నించారు. ఇది గుర్తించిన ఎంపీ అనుచరులు అప్రమత్తమయ్యారు. దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు.

పట్టుబడిన వ్యక్తి సుభాని అని, అతడి ఫోన్‌కు ఆంజనేయులు అనే వ్యక్తి నుంచి ఫోన్‌కాల్స్‌ వచ్చాయని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తిని గమనించామని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని ఎంపీ రఘురామ పీఏ శాస్త్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో వైపు విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్‌ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని ఇంట్లోకి తీసుకెళ్లారని, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కే ఫరూక్‌ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారని పేర్కొన్నారు. ఇరువైపులా వచ్చిన ఫిర్యాదులు తీసుకొని విచారణ చేపట్టామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ వెల్లడించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.