KANNA BABU: 'రాష్ట్రంలో 3 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్లు'

author img

By

Published : Sep 22, 2021, 4:21 PM IST

Updated : Sep 23, 2021, 5:24 AM IST

KANNA BABU

రాష్ట్రంలో ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం అన్ని అవకాశాలను అందిస్తోందని మంత్రి కన్నబాబు(Minister Kannababu on industrial growth and exports) అన్నారు. పండించిన పంటల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు.

ఆహారశుద్ధి రంగంలో ఎగుమతులను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో మూడు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న వాణిజ్య ఉత్సవ్‌ రెండోరోజు బుధవారం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలపై ప్రసంగించారు. ‘వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎగుమతులను ప్రోత్సహించటంలో భాగంగా అపెడా, ఎంపెడా, ఎగ్జిమ్‌బ్యాంక్‌ వంటి సంస్థలతో రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు(ఎఫ్‌పీవో), మత్స్యకారుల మధ్య ప్రభుత్వం సమన్వయం చేస్తోంది. సరకు రవాణా ఖర్చులను తగ్గించడానికి చిత్తూరు రైల్వేస్టేషన్‌ నుంచి పాలు, మత్స్య ఉత్పత్తులు, మామిడిపండ్ల రవాణాకు కిసాన్‌ రైలును ఏర్పాటుచేశాం’ అన్నారు. సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను విశాఖ ఎస్‌ఈజడ్‌ జోనల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ రామమోహన్‌రెడ్డి వివరించారు. ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ఎగుమతులకు ఉన్న అవకాశాలను ప్లెక్స్‌కాన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీభాష్‌ దశమహాపాత్ర, టెక్స్‌ప్రోసిల్‌ బోర్డు మెంబర్‌ సుధాకర్‌చౌదరి వివరించారు.

ఎంపెడా స్టాల్‌కు మొదటి బహుమతి

‘వాణిజ్య ఉత్సవం-2021’లో ఎంపెడా ఆధ్వర్యంలోని స్టాల్‌కు మొదటి బహుమతి లభించింది. ఎంపెడా స్టాలులో తిలాపియా చేపల అక్వేరియంతో పాటు వివిధ అలంకరణ చేపలు ఆకట్టుకున్నాయి. ఆర్కే హెయిర్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్టాల్‌ ద్వితీయ, మచిలీపట్నం ఇమిటేషన్‌ ఆభరణాల సంఘం స్టాల్‌ తృతీయ బహుమతిని దక్కించుకున్నాయి.

పులివెందులలో పరిశోధన, శిక్షణ కేంద్రం

ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం కల్పిస్తూ... పులివెందులలో పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని(ఆగ్రో ఎకోలాజికల్‌ రీసెర్చి అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. ‘వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన పరిశోధనలు, సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ఇది దోహదపడుతుంది. ఈ కేంద్రానికి రూ.170 కోట్ల గ్రాంటు మంజూరుకు జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు అంగీకరించింది. వచ్చే ఏప్రిల్‌ నుంచి శిక్షణ ప్రారంభిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు బ్యాంకు భారత ప్రతినిధులు సంగీతా అగర్వాల్‌, సందీప్‌ సిన్హాతోపాటు ప్రకృతి వ్యవసాయ విభాగం సీఈఓ విజయ్‌కుమార్‌, రామారావు తదితరులు బుధవారం మంత్రిని కలిశారు.

ఏషియన్‌ పెయింట్స్‌ రెండో దశ విస్తరణ

రాష్ట్రంలో ఏషియన్‌ పెయింట్స్‌ లిమిటెడ్‌ రెండో దశ విస్తరణతో ఉత్పత్తి సామర్థ్యం 3 నుంచి 5 లక్షల కిలోలీటర్లకు చేరుతుందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు సంస్థ కరెంట్‌ అఫైర్స్‌ గ్రూప్‌ హెడ్‌ అమిత్‌కుమార్‌సింగ్‌, ప్రతినిధులు మంత్రిని విజయవాడలో కలిశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘‘మొదటి దశలో రూ.1,350 కోట్ల పెట్టుబడితో 750 మందికి సంస్థ ఉపాధి కల్పించింది. ఏటా మొబైల్‌ కలర్‌ అకాడమీ ద్వారా ఏటా 15-17 వేల మందికి శిక్షణిస్తూ పెయింటర్లుగా తీర్చిదిద్దుతోంది. విశాఖలో ఏటా 75 మంది ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. సంస్థ అవసరాలకు కావాల్సిన 75% జలాన్ని వర్షపు నీటి సంరక్షణ ద్వారా సమకూర్చుకుంటోంది. 75% విద్యుత్‌ అవసరాలను 5.2 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్లాంటుతో తీర్చుకుంటోంది. విశాఖ అభివృద్ధికి రూ.3 కోట్లను వెచ్చించింది’’ అని వివరించారు.

ఇదీ చదవండి:

Dwakra Groups: డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి.. ఆన్​లైన్ ద్వారా విక్రయాలు

Last Updated :Sep 23, 2021, 5:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.