ETV Bharat / city

Ranker: ఆశయమే గెలిచింది..  53 ఏళ్ల మహిళకు లాసెట్‌ లో ఫస్ట్ ర్యాంక్!

author img

By

Published : Oct 24, 2021, 1:32 PM IST

వయసు 60కి దగ్గరవుతున్న వేళ ఎవరైనా ఏం చేస్తారు? విశ్రాంతి జీవితాన్ని కోరుకుంటారు.. మనవళ్లకు ఏబీసీడీలు నేర్పించుకుంటూ పడక కుర్చీలో సేద తీరేందుకు చూస్తుంటారు. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నవారు ప్రత్యేకం. ఈ వయసులో మనసుకు నచ్చిన ఉద్యోగం చేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు.. ఇందుకోసం ఇప్పుడు చేస్తున్న ఉద్యోగానికి ఒకరు రాజీనామా చేయడం గమనార్హం! అంతేనా..? ప్రవేశ పరీక్షలో మరొకరు ఫస్ట్ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు! మరి, వారెవరో చూద్దామా?!

lawcet state first ranker haripriya feels happy
53 ఏళ్ల వయసులో లాసెట్‌.. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు

విజయవాడ విద్యుత్‌ సౌధలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు మోపూరు హరిప్రియ(hari priya). ఆమె భర్త రవీంద్ర బాబు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇంజనీర్‌గా చేసేవారు. వీరిద్దరికి లాయరు కోటు వేసుకోవాలని కోరిక కలిగింది. బలమైన వారి కోరిక ముందు.. వయసుతోపాటు ఏదీ అడ్డుగా నిలవలేకపోయింది. ఇటీవల నిర్వహించిన లాసెట్ పరీక్షను వీరు రాశారు. అయితే.. లాసెట్ ప్రవేశ పరీక్ష(law entrance exam)లో హరిప్రియ సత్తాచాటారు. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.

విద్యుత్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా.. గుణదల డివిజన్‌లో సేవలందిస్తున్నారు. ఇక, హరిప్రియ భర్త రవీంద్ర బాబు.. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇంజనీర్‌గా చేసేవారు. చిన్నతనం నుంచి ఆయనకు న్యాయవిద్యపై ఆసక్తి ఉండడంతో.. గత ఏడాది ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, ప్రస్తుతం లా చదువుతున్నారు.

53 ఏళ్ల వయసులో లాసెట్‌.. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు

యువతకు ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో.. లాసెట్‌కి సన్నద్ధమైనట్లు తెలిపారు. మొదటి ర్యాంకు సాధించిన హరిప్రియ మాట్లాడుతూ.. ఉద్యోగం చేస్తూనే.. ప్రవేశ పరీక్ష కోసం మూడు నుంచి నాలుగు గంటల పాటు చదివినట్టు చెప్పారు. లా పట్టా పొందిన తర్వాత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్‌ చేయాలనుకుంటున్నట్లు హరిప్రియ తెలిపారు.

న్యాయశాస్త్రానికి మంచి ఆదరణ ఉందని.. హరిప్రియ భర్త రవీంద్రబాబు చెప్పారు. స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించి, పోరాటంలో క్రియాశీలపాత్ర పోషించిన ప్రముఖుల్లో.. అధికులు న్యాయ పట్టా పొందిన వారేనని తెలిపారు. చదువుకు వయసు అడ్డురాబోదని.. మనసు కేంద్రీకరిస్తే సునాసాయంగా లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన తెలిపారు. పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించటంతో పాటు.. వాళ్ల హక్కులను కాపాడటానికీ తమవంతు కృషి చేస్తామని హరిప్రియ దంపతులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.