AP WEATHER REPORT: బంగాళాఖాతంలో అల్పపీడనం... 4 రోజుల పాటు భారీ వర్షాలు

author img

By

Published : Sep 11, 2021, 2:15 AM IST

AP WEATHER REPORT

రాగాల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో రాగాల 4 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. ఈ కారణంగా మధ్య బంగాళా ఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు స్పష్టం చేశారు.

అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 12,13 తేదీల్లో ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

AP WEATHER REPORT: రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.