ETV Bharat / city

కొవిడ్‌ను ఎదుర్కొంటూ కోలుకుంటున్న దశలో మృత్యుఒడికి..

author img

By

Published : Aug 10, 2020, 7:33 AM IST

fire accident
fire accident

కరోనా భయపెట్టిస్తున్న వేళ.. ఎంతో ఆత్మవిశ్వాసంతో చికిత్స పొందుతూ వారు కుదుట పడుతున్నారు. ఇంటికి చేరుకునేందుకు గంటలు లెక్కిస్తూ భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఊహించని విధంగా వారిని అగ్నికీలలు చుట్టుముట్టాయి. తెల్లవారుజామునే దట్టమైన పొగ, మంటలు విస్తరించాయి. వాటి ధాటికి కొందరు కట్టెల్లా కాలిపోయారు. మరికొందరు తీవ్రగాయాలతో తల్లడిల్లారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల సమిధలయిన ఒక్కొక్కరిది ఒక్కో దయనీయ గాథ.

కొవిడ్‌ను ఎదుర్కొంటూ కోలుకుంటున్న దశలో మృత్యుఒడికి..
  • ఊపిరాడటం లేదు నాన్నా..

పొన్నూరు మండలం నిడుబ్రోలుకు చెందిన కొసరాజు శ్రీనివాసరావు ఇంట్లో తెల్లవారుజామునే ఫోన్‌ మోగింది. ఆయన పెద్ద కుమారుడు భార్గవరామ్‌ నిద్రమత్తులో ఫోన్‌ ఎత్తగానే ‘అమ్మను మాట్లాడుతున్నా. ఇక్కడ పొగ కమ్మేసింది. ఊపిరాడటం లే’దని చెప్పారు. ఆ వెంటనే ఫోన్‌కు అంతరాయం ఏర్పడింది. మళ్లీ ఫోన్‌ చేయడానికి ప్రయత్నించినా నిష్ఫలమే అయింది. అగ్ని ప్రమాదంలో ఊపిరాడక స్వర్ణలత(42) చనిపోయారని ఇంతలో వైద్య సిబ్బంది సమాచారమిచ్చారు. స్వర్ణలత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. రమేష్‌ వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించగా మలేరియా, టైఫాయిడ్‌ సోకినట్లు గుర్తించారు. కరోనా అనుమానిత లక్షణాలు కూడా ఉండడంతో ఈ నెల 6న వైద్యశాలలో చేర్చుకున్నారు. ఆమె మృతితో భర్త, ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • డిశ్ఛార్జి అన్నారు.. అంతలోనే విషాదం

మద్దాలి రమేష్‌.. యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌లో డెవలప్‌మెంట్‌ అధికారి. ఆయనకు భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొగల్రాజపురం అమ్మ కల్యాణమండపం సమీపంలో నివసిస్తున్నారు. అనారోగ్యంగా ఉండటంతో నాలుగు రోజుల కిందట రమేష్‌ ఆసుపత్రికి వెళ్లారు. కరోనా లక్షణాలున్నాయన్న వైద్యుల సూచనల మేరకు ఈ చికిత్స కేంద్రంలో చేరారు. శనివారం రాత్రి ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ఆదివారం డిశ్ఛార్జి చేస్తారని చెప్పారని బంధువులు తెలిపారు. నాన్న ఇంటికి వస్తారని నిరీక్షిస్తున్నామని, విషాదాన్ని తట్టుకోలేకపోతున్నామని కుమారుడు సూర్య రోదిస్తున్నారు.

  • కలిసి కనిపించని లోకాలకు..

వ్యాధి నయమై ఆసుపత్రి నుంచి వెళ్లాల్సిన భర్త.. తెల్లారితే భార్యను కూడా డిశ్ఛార్జి చేస్తారని చెప్పడంతో కలిసి ఇంటికి వెళ్దామనుకొని ఆగిపోయారు. ప్రమాదంలో భార్యతో సహా ఆయన కూడా అగ్నికి ఆహుతయ్యారు. జగ్గయ్యపేటకు చెందిన పాస్టర్‌ ఎస్‌.ఆర్‌.అబ్రహం, రాజకుమారి దంపతులు ప్రార్థనమందిరం నిర్వహిస్తున్నారు. అబ్రహం గత నెల 31న భార్యతో కలిసి రమేష్‌ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారానికే అబ్రహంకు నెగిటివ్‌ వచ్చింది. శనివారం డిశ్ఛార్జి కావాల్సి ఉంది. భార్యకు కూడా నెగెటివ్‌ రావడంతో ఆదివారం ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లవచ్చని భావించి అంతలోనే విగతజీవులయ్యారు.

  • మృత్యుంజయుడు పవన్‌సాయి

ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన చౌడవరపు పవన్‌సాయి కిషన్‌ మృత్యుంజయుడిగా నిలిచారు. మంటలు విస్తరిస్తున్నప్పుడు ఆయన కుటుంబీకులకు ఫోన్‌ చేశారు. పొగ వ్యాపిస్తోందని, ఊపిరాడటం లేదని, అంతస్తు నుంచి దూకేయడమే శరణ్యమని రోదించారు. తండ్రి, బాబాయి ఇచ్చిన ధైర్యంతో అద్దాలు పగులగొట్టి టెర్రస్‌పైకి చేరుకున్నారు. చేతిలోని టవల్‌ ఊపుతూ రక్షించాలంటూ వేడుకున్నారు. అరగంటలోపు అక్కడికి వచ్చిన పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఆయన్ని కిందికి దించారు. కాపాడిన సిబ్బందికి ఆయన పాదాభివందనం చేశారు.

  • తల్లీ కుమారుల మృతి

ప్రకాశం జిల్లా కందుకూరులోని గణేష్‌నగర్‌కు చెందిన దుడ్డు వెంకటప్రసాద్‌ కిరాణ దుకాణం నిర్వహిస్తుంటారు. జులై 30న ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో ఒంగోలులోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రయత్నించారు. ఎక్కడా బెడ్లు దొరక్క తెలిసిన వారి సాయంతో విజయవాడ రమేష్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయన భార్య వెంకటజయలక్ష్మి(49), పెద్ద కుమారుడు నరసింహ పవన్‌కుమార్‌(30)తో పాటు చిన్న కుమారుడు కూడా పరీక్షలు చేయించుకున్నారు. నాలుగో తేదీన వారు ముగ్గురికీ పాజిటివ్‌గా తేలింది. చిన్న కుమారుడికి తీవ్రత తక్కువగా ఉండడంతో హోంఐసొలేషన్‌లో ఉంచారు. మిగిలిన ఇద్దరూ వెంకటప్రసాద్‌ చికిత్స పొందుతున్న రమేష్‌ ఆసుపత్రిలోనే అయిదో తేదీన చేరారు. నెగెటివ్‌గా తేలడంతో ఏడో తేదీన వెంకటప్రసాద్‌ డిశ్ఛార్జి అయ్యారు. తల్లీ, కుమారుడు కోలుకుంటుండడంతో త్వరలోనే వారిని కూడా డిశ్ఛార్జి చేస్తారని భావించారు. అంతలోనే ఘోరం చోటు చేసుకుని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుడు పవన్‌కుమార్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఏడాదిన్నర కిందట పెళ్లయిన ఆయన భార్య ఏడు నెలల గర్భిణి.

  • ఆరోగ్యం మెరుగుపడిందనుకునేలోపే..

మచిలీపట్నం బెల్‌ సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్న డి.శివబ్రహ్మయ్య(58) తెనాలివాసి. కరోనా లక్షణాలు కనిపించడంతో 3 రోజుల కిందట ఈ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని భావిస్తున్న సమయంలో అగ్నిప్రమాదంలో అసువులు బాశారు.

  • ఏడాది క్రితం భార్య.. ఇప్పుడు భర్త మృతి

బందరు మూడు స్తంభాల కూడలిలో నివసించే మజ్జి గోపి (54) శ్రీకాకుళం ప్రాంతవాసి. వెండి వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తూ బందరులోనే 40ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. తనతోటే ఉండే కుమారుడితో పాటు గోపి ఇటీవల పరీక్షలు చేయించుకున్నారు. స్వల్ప లక్షణాలు కన్పించడంతో కుమారుడు హోంఐసొలేషన్‌లో ఉంటున్నారు. మెరుగైన చికిత్స కోసం గోపి విజయవాడ రమేష్‌ ఆసుపత్రిలో చేరారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఏడాది కిందట అనారోగ్యంతో తల్లి చనిపోవడం, తండ్రి కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుమారుడి వేదన వర్ణనాతీతంగా ఉంది.

  • రెండు సార్లూ నెగెటివ్‌ వచ్చింది..

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం కొడాలి సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పొట్లూరి పూర్ణచంద్రరావు(80) కొద్ది రోజులుగా వ్యాధి లక్షణాలతో బాధపడుతూ చల్లపల్లి ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. శ్రీకాకుళం పీహెచ్‌సీలో కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నారు. మెరుగైన వైద్యం కోసం 5రోజల కిందట రమేష్‌ ఆసుపత్రిలో చేరారు. ఇంతలో శ్రీకాకుళం పీహెచ్‌సీలో చేసిన కొవిడ్‌ పరీక్షలో ఆయనకు నెగెటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. శనివారం విజయవాడలో చేసిన పరీక్షల్లోనూ నెగెటివ్‌ వచ్చింది. మరో2 రోజుల్లో ఇంటికి వస్తారనుకుంటున్న తరుణంలో అసువులు బాశారు. గణాంక శాఖలో ఆయన వివిధ హోదాల్లో సేవలందించారు. 1998లో ఉద్యోగ విరమణ చేసి స్వగ్రామంలో ఉంటున్నారు.

  • ఎందుకైనా మంచిదని వెళితే...

కృష్ణా జిల్లా చినముత్తేవికి చెందిన సుంకర బాబూరావు(68), హైదరాబాద్‌, నల్గొండ, చల్లపల్లి, మచిలీపట్నం ప్రాంతాల్లో పోలీసు శాఖలో పనిచేశారు. విజయవాడ ఇందిరానాయక్‌ నగర్‌ అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకైనా మంచిదని కరోనా పరీక్షకు వెళ్లగా నెగెటివ్‌ వచ్చింది. సీటీస్కాన్‌లో ఊపిరితిత్తుల వద్ద నామమాత్రంగా కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో ముందు జాగ్రత్తగా ఈ కేంద్రంలో చేరారు. కోలుకుని ఇంటికి వస్తారనుకునేలోపే మృతిచెందారు.

ఇదీ చదవండి: నిర్లక్ష్యమే నిప్పైంది...10 మంది ఉసురు తీసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.