హుజూరాబాద్లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం జరగబోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే క్రమంలో... మొదటగా గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. 17 ఏళ్లుగా శాసనసభ్యుడిగా కొనసాగిన్న ఈటల.. నియంతృత్వ పాలనకు స్వస్తి పాలకాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తెరాస బీ-ఫారం ఇచ్చి ఉండొచ్చు... గెలిపించింది మాత్రం ప్రజలేనని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికలో గెలవాలని చూస్తున్నారని ఈటల ఆరోపించారు.
నియంత నుంచి విముక్తి కల్పించడమే నా ఎజెండా..
'' తెలంగాణ రాష్ట్రమే శ్రీరామ రక్ష అని కొట్లాడాం. అనేక మంది ఇతర పార్టీల్లో గెలిచి రాజీనామా చేయకుండా తెరాసలో చేరి నిన్సుగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారు. హుజూరాబాద్ ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతోంది. వడ్లు తడిచి మొలకలు వచ్చినా పట్టించుకోరు. యువతకు ఉపాధి లేకపోయినా స్పందించరు. కానీ నన్ను చక్రబంధంలో పెట్టాలి అని పోలీసు అధికారులను వాడుతున్నారు. నాకు నిర్బంధాలు కొత్తకాదు.. నియంత నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే నా ఎజెండా. అందరూ హుజురాబాద్ ప్రజలకు అండగా ఉండండి. మనిషిగా ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా.
- ఈటల రాజేందర్.