ETV Bharat / city

ప్రభుత్వ సర్వే: మీ ఇంట్లో ఎవరు ఎంత చదువుకున్నారు?

author img

By

Published : Dec 5, 2020, 10:45 PM IST

Updated : Dec 6, 2020, 7:19 AM IST

రాష్ట్రంలో ఉన్నత విద్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా పలు ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావటంతో రాష్ట్రమంతటా స్మార్ట్ ఫోన్ల సాయంతో ఈ నెలలోనే వివరాల సేకరణకు సమాయత్తమవుతోంది. ఇంటింటి సర్వేలో సేకరించిన డేటాను అన్ని శాఖలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.

ప్రభుత్వ సర్వే: మీ ఇంట్లో ఎవరు ఎంత చదువుకున్నారు?
ప్రభుత్వ సర్వే: మీ ఇంట్లో ఎవరు ఎంత చదువుకున్నారు?

రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో ఎవరు ఎంతవరకు చదువుకున్నారు? మధ్యలో ఎందుకు చదవు ఆపేశారు? తదితర వివరాలతో కూడిన సమగ్ర సమాచారం ప్రభుత్వ శాఖలకు అందుబాటులోకి రానుంది. ఉన్న విద్యామండలి ఈ నెలలో దీనిని స్మార్ట్ ఫోన్ల సాయంతో చేపట్టనుంది. క్షేత్రస్థాయిలో వివరాల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలను తెలుసుకునేందుకు ప్రయోగాత్మకంగా మంగళగిరి, తాడేపల్లిలో ఇప్పటికే ఈ సర్వే నిర్వహించారు.

ఈ-ప్రగతి విభాగంతో

అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాల విద్య శాఖలోని క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు, గ్రామ, వార్డు సచివాలయ విద్య, సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరు వాలంటర్లీకు శిక్షణ ఇస్తారు. ఈ-ప్రగతి విభాగంతో కలిసి ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ట్యాబ్‌ ద్వారా వివరాలను సేకరించనున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాత విశ్లేషణ చేసి, ఉన్నత విద్య పరిస్థితిపై నివేదిక రూపొందించనున్నారు.

జీఈఆర్​ చాలా తక్కువ

ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఈఆర్‌) చాలా తక్కువగా నమోదవుతోంది. కొన్నేళ్లుగా పెద్దగా మార్పు ఉండడం లేదు. అఖిల భారత ఉన్నత విద్య సర్వే ఏటా గణాంకాలను విడుదల చేస్తోంది. జాతీయస్థాయితో పోల్చితే మెరుగ్గా ఉన్నా.. అనుకున్న స్థాయిలో ఉన్నత విద్యలో ప్రవేశాలు ఉండడం లేదు. రాష్ట్రంలో 32.4శాతం మాత్రమే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. పురుషుల్లో 35.8శాతం ఉండగా.. మహిళల్లో 29శాతం ఉన్నారు. ఉన్నత విద్యకు వస్తున్న మహిళలు తక్కువగా ఉంటున్నారు.

ఇంటింటి సర్వే ద్వారా ఎంతమంది ఎక్కడి వరకు చదువుకున్నారనే అంశం వెల్లడవుతుంది. పైచదువులను ఎందుకు ఆపేస్తున్నారనే కారణాలను ఇందులో గుర్తించనున్నారు. ఈ కారణంగా సమగ్ర నివేదిక బహిర్గతం కానుంది.

19 అంశాలతో వివరాలు

ఇంటింటి సర్వేలో సేకరించిన డేటాను అన్ని శాఖలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఇంట్లో ఎంత మంది ఉన్నారు? ఏం చదువుకున్నారు? అనే వివరాలు సేకరిస్తారు. ఆధార్, ఫోన్‌ నంబరుతో సహా వీటిని తీసుకుంటారు. దీంతో సర్వేలో తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదు. బడి మధ్యలో మానేస్తున్నవారు? ఇంటర్‌ తర్వాత చదువు నిలిపివేస్తున్నవారు? ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న అందరి వివరాలు సేకరిస్తారు. మొత్తం 19అంశాలకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు.

ఇదీ చదవండి: రైతు దీక్ష: కొలిక్కిరాని చర్చలు- 9న మరో భేటీ

Last Updated : Dec 6, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.