CYBER FRAUD: కొత్త పంథాలో సైబర్​ నేరగాళ్లు... స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ పేరుతో..!

author img

By

Published : May 26, 2022, 4:51 AM IST

Cyber crime

సైబర్ నేరగాళ్లు సులువుగా దోచేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తపంథాలో బురిడీ కొట్టిస్తున్నారు. నిరక్షరాస్యుల నుంచి విద్యావంతుల వరకు తేలికగా మోసపోతున్నారు. స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ పేరుతో గాలం వేసి, అందినకాడికి డబ్బు లాగేస్తున్నారు. సాయం చేస్తామని నమ్మించి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయించి..... విలువైన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఆ తర్వాత తమ ఖాతాల్లోకి డబ్బును మళ్లించుకుంటున్నారు.

కొత్త పంథాలో సైబర్​ నేరగాళ్లు... స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ పేరుతో..!

విజయవాడ పటమటలంక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు..సంక్షిప్త సందేశం వచ్చింది. సిమ్‌కు సంబంధించి పత్రాల పరిశీలన ఇంకా పూర్తి కాలేదని, త్వరగా ముగించాలని, లేకుంటే 24 గంటల్లో సిమ్‌ పనిచేయడం ఆగిపోతుందని అందులో ఉంది. మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి..బీఎస్ఎన్ఎల్ కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. కేవైసీ డాక్యుమెంట్‌ పెండింగ్‌ ఉందని, పూర్తి చేయడానికి తాను సాయం చేస్తానని, ఇందుకు గాను ఎనీ డెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. అతడు చెప్పినట్లే ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి సూచించిన విధంగా ఎస్​బీఐ ఖాతా నుంచి రూ.10 ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీ నిర్వహించాడు. ఈ మొత్తం జమకాలేదని చెప్పడంతో మళ్లీ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.10 బదిలీ చేశాడు. రెండు రోజుల తర్వాత బాధితుడికి ఫోన్‌ చేసి, మరో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పడంతో.. అలాగే చేశాడు. 20 నిముషాల తర్వాత.. నగదు లావాదేవీలు జరిగినట్లు చాలా...ఎస్ఎంఎస్​లు వచ్చాయి. మొత్తం 3 లక్షలకుపైగా లూటీ చేశారు.

ఎదుటి వ్యక్తికి చెందిన మొబైల్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల్లో సాఫ్ట్‌వేర్, ఇతర సమస్యల పరిష్కారం కోసం స్క్రీన్‌ షేరింగ్‌ యాప్స్‌ ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాత మొబైల్‌, ల్యాప్‌టాప్‌ను...... తమ నియంత్రణలోకి తీసుకుంటారు. తెరపై మనం చేసే పనులన్నీ అవతలి వ్యక్తి చూసే అవకాశం ఉంది. బాధితులు తమ బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించే సమయంలో టైప్‌ చేసే ఐడీ, పాస్‌వర్డ్‌లను చూస్తున్నారు. వీటి ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దశలవారీగా బదిలీ చేస్తున్నారు. సెల్ ఫోన్‌లో యాప్‌లు డౌన్ లోడ్ చేసినపుడు వాటికి ఏ అనుమతులిస్తున్నామో పరిశీలించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలను విశ్వసించవద్దని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఫోన్‌ చేసి, యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని ఒత్తిడి తెస్తే పట్టించుకోవద్దని స్పష్టం చేశారు.]

ఇదీ చదవండి : Cyber Crime: ఎమ్మెల్యేలను మోసగించి వసూళ్లు.. ఆ డబ్బుతో ప్రేయసికి ఖరైదీన ఇల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.