ఈనెల 20 నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన.. అనుమతిచ్చిన సీబీఐ కోర్టు
Updated on: May 13, 2022, 9:08 PM IST

ఈనెల 20 నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన.. అనుమతిచ్చిన సీబీఐ కోర్టు
Updated on: May 13, 2022, 9:08 PM IST
అధికార, వ్యక్తిగత పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఈనెల 20 నుంచి 10 రోజుల పాటు విదేశాలకు వెళ్లనున్నారు. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్న సీఎం..సదస్సు అనంతరం వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు.
ఈ నెల 20 నుంచి 31 వరకూ ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అధికారిక, వ్యక్తిగత పర్యటనల నిమిత్తం 10 రోజుల పాటు ఆయన విదేశాల్లో గడపనున్నారు. ఈనెల 20న కుటుంబంతో సహా సీఎం జగన్ స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. మే 22, 23, 24 తేదీల్లో దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు. పలు విదేశీ కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సదస్సులో ఏపీ పెవిలియన్ నిర్వహించే కార్యక్రమాలకూ జగన్ హాజరు కానున్నట్లు సీఎంవో వెల్లడించింది. అనంతరం మే 25 నుంచి జగన్ వ్యక్తిగత పర్యటనలో ఉండనున్నారు.
సీబీఐ అనుమతి: దావోస్ వెళ్లేందుకు సీఎం జగన్కు హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతు సడలించాలని జగన్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. సీఎం హోదాలో అధికార పర్యటనకు వెళ్లనున్నట్లు పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కాగా..దావోస్ వెళ్లేందుకు జగన్కు అనుమతివ్వొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. విదేశాలకు వెళ్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం..సీఎం పర్యటనకు అనుమతినిచ్చింది.
ఇవీ చూడండి
