ETV Bharat / city

cm jagan on Fake Challan Scam: 'ఎన్నాళ్ల నుంచీ నకిలీ మకిలి?'

author img

By

Published : Aug 19, 2021, 3:37 PM IST

Updated : Aug 20, 2021, 4:50 AM IST

cm jagan on Fake Challan Scam
ఆదాయవనరుల సమీకరణపై సీఎం జగన్‌ సమీక్ష

15:29 August 19

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి?

    

    ఏసీబీ దాడులు చేస్తే తప్ప సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల విషయం వెలుగులోకి రాలేదని, అసలు ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి జరుగుతోందని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మన దృష్టికి ఎందుకు రావడం లేదు? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? క్షేత్ర స్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో? లేవో? ఎందుకు చూడటం లేదు? ప్రభుత్వ శాఖల్లోని అవినీతికి అడ్డుకట్ట వేయాలి. అవసరమైతే క్షేత్ర స్థాయి నుంచి నిఘా సమాచారం తెప్పించుకోండి’ అని సూచించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం ఆదాయ సముపార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, ఆర్థిక, జీఎస్టీ, ఎక్సైజ్‌శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవినీతి లేకుండా చేయాలని, ఈ విషయంలో ఎవరికి ఫిర్యాదు చేయాలో ప్రతి కార్యాలయంలో నంబరు కనిపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ఫోన్‌ కాల్స్‌పై అధికారులు దృష్టి సారించాలని, కాల్‌సెంటర్‌ పూర్తి బాధ్యతలను అధికారులు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే...

* కేవలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే కాదు. అన్ని చోట్లా చలానాల చెల్లింపు విధానం, మీ సేవలో పరిస్థితులను పరిశీలించాలి. కనీసం వారం, పది రోజులకోసారి అధికారులు సమావేశమై ఆదాయ పరిస్థితులపై సమీక్షించాలి. ప్రతి సమావేశంలో ఒక్కో రంగంపై సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి సమావేశంలో సమీక్షించాలి.

* ఆదాయ వనరులను పెంచుకునేందుకు కొత్త వ్యూహాలు అవసరం. ఇందుకోసం సంస్కరణలు తీసుకురావాలి. ఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులను వచ్చేలా చూడాలి.
అదే సమయంలో బకాయిలను రాబట్టుకునేందుకు కృషి చేయాలి. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు అందేలా చూడటం ఒక బాధ్యత. అయితే రెవెన్యూ వసూళ్లపైనా కలెక్టర్లు, జేసీలు దృష్టి సారించాలి.

* ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరులను మెరుగుపరచాలి. జీఎస్టీ వసూళ్ల ద్వారా ఆదాయం పెరిగేలా చూడాలి. సరైన కార్యాచరణతో ప్రజలకు చక్కని సేవలు అందించడంతో పాటు ఆదాయాలు పెంచుకోవాలి.

* మద్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి. రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించడంవల్లే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువస్తున్నారు.

బాధ్యులను సస్పెండు చేశాం

‘నకిలీ చలాన్ల అంశంలో బాధ్యులను సస్పెండు చేశాం. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్‌ మొత్తాన్ని పరిశీలించాం. అవినీతికి చోటు లేకుండా మార్పులు చేశాం’ అని అధికారులు తెలిపారు. సమావేశంలో ప్రణాళికాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, భూ పరిపాలనశాఖ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ప్రత్యేక కార్యదర్శి కె సత్యనారాయణ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులశాఖ కమిషనర్‌, ఐజీ ఎం.వి.శేషగిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి.. 

నాయుడుపేట, మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయల్లో నకిలీ చలానాల కుంభకోణం

Last Updated :Aug 20, 2021, 4:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.