ETV Bharat / city

విశాఖ విషవాయువు ఘటన బాధాకరం.. ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యం వీడలేదు: చంద్రబాబు

author img

By

Published : Jun 3, 2022, 8:48 PM IST

Updated : Jun 3, 2022, 9:46 PM IST

Babu on Gas Leak: ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ అచ్యుతాపురం సెజ్​లో గ్యాస్ లీకైన ఘటనలో దాదాపు 200 మంది అస్వస్థతకు గురికావటం బాధాకరమన్నారు. ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ లోపం, వ్యవస్థల నిర్వీర్యం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖ విషవాయువు ఘటన బాధాకరం
విశాఖ విషవాయువు ఘటన బాధాకరం

విశాఖలో విషవాయువు లీక్ ఘటన ఆందోళనకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన తరువాత కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడలేదని ధ్వజమెత్తారు. అచ్యుతాపురం సెజ్​లో గ్యాస్ లీకైన ఘటనలో దాదాపు 200 మంది అస్వస్థతకు గురికావటం బాధాకరమన్నారు. విశాఖలో అతిపెద్ద విషాదంగా నిలిచిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తరవాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోకపోవటం విచారకరమని తెలిపారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవటమే కాకుండా నిర్లక్ష్యానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ లోపం, వ్యవస్థల నిర్వీర్యం ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానిదే బాధ్యత: అచ్యుతాపురం గ్యాస్ లీకేజ్ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో పదేపదే గ్యాస్ లీకేజీ దుర్ఘటనలు జరగడం ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం, పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులు, అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఏం జరిగిందంటే: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్​ సెజ్​ పరిధిలోని పోరస్ కంపెనీలో అమోనియా వాయువు లీకైంది. దీంతో పక్కనున్న సీడ్స్ కంపెనీలో పనిచేసే రెండు వందల మందికి పైగా మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తల తిరగడం, కళ్ల మంటతో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన మహిళలను హుటాహుటిన బ్రాండిక్స్ సెజ్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న చాలా మంది మహిళలను అంబులెన్సుల్లో అనకాపల్లిలోని ఎన్టీఆర్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో మహిళా సెక్యూరిటీ సూపర్​వైజర్‌ పరిస్థితి తీవ్రంగా ఉందని... చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు. అమోనియా లీక్‌ ఘటన వివరాలు తెలుసుకున్న కలెక్టర్ రవి సుభాష.. మహిళా కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి హేమంత్ కుమార్‌ను ఆదేశించారు. అస్వస్థులైన మహిళలకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు బ్రాండిక్స్‌ భారత భాగస్వామి దొరైస్వామి చెప్పారు.

సెజ్‌కు వెలుపల ఉన్న పోరస్ కంపెనీ నుంచి అమోనియా వాయువు లీకైందని... కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. దీనివల్లే సమస్య తలెత్తిందన్నారు. ఆ తర్వాత అమోనియో లీకేజీని పోరస్‌ కంపెనీ నిర్వాహకులు అరికట్టినట్లు చెప్పారు. లీకేజీకి కారణాలేంటన్నది తెలుసుకుంటున్న వివరించారు. అమోనియా లీకేజీ ఘటనతో అప్రమత్తమైన బ్రాండిక్స్‌ నిర్వాహకులు.. రెండో షిఫ్ట్‌ రద్దు చేశారు. ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించివేశారు.

ఘటనపై విచారణకు సీఎం ఆదేశం: గ్యాస్‌ లీక్‌ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలిని సందర్శించాలని పరిశ్రమల శాఖ మంత్రికి సూచించారు. గ్యాస్‌ లీక్‌ ఘటనపై దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు.

ఇవీ చూడండి

Last Updated : Jun 3, 2022, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.