మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు... నిలబెట్టొచ్చు: ఉద్యోగనేత సంచలన వ్యాఖ్యలు

author img

By

Published : Dec 5, 2021, 5:19 PM IST

Updated : Dec 6, 2021, 4:41 AM IST

మా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే

APNGO State President Srinivas Rao:ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాయ మాటలు విని వైకాపాకు 151 సీట్లు కట్టబెట్టామన్నారు. తమ ముందు ఎవరైనా తలవంచాల్సిందేనని.. ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉద్యోగులకు ఉందన్నారు.

APNGO State President Srinivas Rao: జగన్ ప్రభుత్వంపై ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాయ మాటలు విని వైకాపాకు 151 సీట్లు కట్టబెట్టామని ఉద్యోగుల అంతర్గత సమావేశంలో వ్యాఖ్యనించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

మా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే

‘మా రెండు జేఏసీల్లో 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులం ఉన్నాం. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో వారి అమ్మా, నాన్న, భార్య/భర్త, బిడ్డలు ఇలా అయిదేసి ఓట్ల చొప్పున లెక్కేసుకున్నా మొత్తం సుమారు 60 లక్షల మంది అవుతాం. మేం ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. నిలబెట్టొచ్చు. మా శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే’ అని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న మీ మాయమాటలు నమ్మి మీకు 151 సీట్లు తెచ్చాం. అందుకే మీరు మా వంక చూడట్లేదు’ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి ధ్వజమెత్తారు. ‘ఒకటో తేదీన జీతాలు పొందటమనేది ఉద్యోగుల హక్కు. అలాంటిది చచ్చిపోతున్నామన్న సరే ఇప్పుడు జీతానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఒకటో తేదీన జీతం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఏపీ ఎన్జీవోల సంఘం అంతర్గత సమావేశంలో ఆయన ప్రసంగించారు. దానికి సంబంధించిన వీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అందులోని ప్రధానాంశాలివీ.

ఆ విజయాలు ఆరిపోయే ముందు వెలుగులాంటివి:

‘చచ్చిపోయే (ఆరిపోయే) ముందు దీపం బాగా వెలుగుతుంది. జిల్లా పరిషత్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో సాధించిన పిచ్చి పిచ్చి విజయాలు అలాంటివే’ అని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రతిపక్షంలో ఉంటాను తప్ప 5 డీఏలు ఇవ్వలేనని చెప్పిన చంద్రబాబుకు.. ఉద్యోగుల గురించి బాగా తెలుసని వివరించారు.

పాలు, కూరగాయలు అమ్మేవారికీ లోకువైపోయాం:

‘ప్రభుత్వోద్యోగులంటే ఓ గౌరవం ఉండేది. ఇప్పుడు పాలు, కూరగాయలు అమ్మేవారికి కూడా లోకువైపోయాం. ప్రభుత్వోద్యోగులు దీనావస్థలోకి వెళ్లిపోయారు. సుబ్బారావుకు జీతం వచ్చింది. ఎల్లయ్యకు రాలేదు అనే పరిస్థితిలోకి నెట్టేశారు’ అని విమర్శించారు. ఈ ఏడాది జులై 1న తాను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని.. ఆ నెల 29న తిరుపతిలో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పానని గుర్తుచేసుకున్నారు. ‘గతంలో ఎవరికైనా ఒకటో తేదీకి జీతం రాకపోతే ఆ విషయం గురించి కలెక్టర్‌కు టెలిగ్రామ్‌ ఇస్తే సంబంధిత డ్రాయింగ్‌ అధికారిని గందరగోళం చేసేసేవారు. ఇప్పుడు ఉద్యోగులు చచ్చిపోతున్నా జీతానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది’ ఆని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ మోచేతి నీళ్లు తాగం..

‘మీ మోచేతి నీళ్లు తాగే పరిస్థితి కాదు. ఉద్యమం ద్వారానే మా హక్కులు సాధించుకుంటాం తప్ప.. మీ దయాదాక్షిణ్యాలపై కాదు’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించే రోజు వచ్చిందని బండి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ‘రైతుల ఉద్యమానికి దిగి వచ్చి ప్రధానమంత్రి సైతం తప్పు అయిపోయింది.. క్షమించమన్నారు. ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి. ఈ రోజు నువ్వు చేసే ఉద్యమం నీ కోసం. నీ బిడ్డల కోసం. ఉద్యమం అంటే ఎలా ఉండాలో భావితరాలకు చెప్పటం కోసం’ అంటూ ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

"చచ్చిపోయే ముందు దీపం బాగా వెలుగుతుంది. అటువంటిదే మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌ల గెలుపు. ఉద్యోగులంటే ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగి కుటుంబంలో 5 ఓట్లు ఉన్నా.. సుమారు 60 లక్షల ఓట్లతో ప్రభుత్వాన్ని కూల్చవచ్చు. ప్రభుత్వాన్ని నిలబెట్టనూ వచ్చు. ఈ శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే. ఉద్యమం ద్వారానే హక్కులను సాధించుకుంటాం. వైకాపా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై కాదు. ఉద్యోగులు చచ్చిపోతున్నా.. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది." - బండి శ్రీనివాసరావు, ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి

Somu On Jagan Govt: ఏపీ భాజపా తరపున.. సీఎం జగన్​కు ఆ పేరు పెడుతున్నాం: సోము వీర్రాజు

Last Updated :Dec 6, 2021, 4:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.