ETV Bharat / city

SECI: సెకి ఒప్పందం.. ప్రజలకు భారం..! దీర్ఘకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై మారిన మాట

author img

By

Published : Apr 1, 2022, 7:37 AM IST

ap agreed to procure solar power with Solar Energy Corporation of India limited
సెకి ఒప్పందం.. ప్రజలకు భారం

SECI: విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచడం, ఏపీఈఆర్సీ లెక్క ప్రకారమే రూ.1400 కోట్ల భారం వేయడం, ట్రూఆఫ్ ఛార్జీల పేరిట మరో 3 వేల కోట్లు వసూలుకు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మరోవైపు సెకి(సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) తో అనాలోచితంగా ప్రభుత్వం చేసుకున్న 25ఏళ్ల ఒప్పందం.. ప్రజలకు భారంగా మారనుందని నిపుణులు అంటున్నారు

సెకి ఒప్పందం.. ప్రజలకు భారం

SECI: ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు ఎడాపెడా పెంచేస్తోందని పదే పదే విమర్శించిన జగన్‌ .. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఈ ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని, వాటిని సమీక్షిస్తామన్నారు. సీఎం ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లం సైతం గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే అదే వైకాపా ప్రభుత్వం.. భారత సౌర విద్యుత్ సంస్థ సెకి(సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)తో భారీ ఒప్పందం చేసుకుంది. యూనిట్‌కు 2 రూపాయల 49 పైసలు చొప్పున ఏడాదికి 1700 కోట్ల యూనిట్‌ విద్యుత్‌ను 25 ఏళ్లు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంది. ఒకపక్క డిస్కంలు నష్టాల్లో ఉన్నాయంటూ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపుతూనే... మరోపక్క సెకి నుంచి అంత ఎక్కువ ధరలకు విద్యుత్ కొనడం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలపై మరింత భారం పడుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

2019 జూలై 15న అజయ్‌ కల్లం మాట్లాడుతూ..: 2010లో యూనిట్ విద్యుత్ ధర రూ.18 ఉంటే.. 2018 నాటికి రూ.2.44 పైసలకు తగ్గిందన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో ధర దానికంటే ఎక్కువగా పేర్కొన్నారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ధీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నప్పుడు ప్రభుత్వం పీపీఏలుఎందుకు చేసుకుందని ప్రశ్నించారు. ఎలాంటి పీపీఏలు, ధీర్ఘకాలిక ఒప్పందలు లేకుండానే 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు, యూనిట్‌కు 2 రూపాయల 70 పైసలకే సరఫరా చేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే 8 ఏళ్లలో రూ.18 నుంచి రూ.2 .44 పైసలకు ధర తగ్గగా.. 2019లో సెకి ధర ఖరారు చేసినప్పటి నుంచి 2024లో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసే నాటికి ఈ ధరలు మరింత తగ్గవా అని నిపుణులు అంటున్నారు. యూనిట్ సౌర విద్యుత్ ధర 2 రూపాయలు తగ్గినట్లు ఆల్‌జోమాయ్‌ వంటి సంస్థలతో సెకి చేసుకున్న ఒప్పందాల ప్రకారం తెలుస్తోందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2019 నాటి ధరల ఒప్పందంతో 2024లో సెకి ద్వారా విద్యుత్ సరఫరా చేసుకోవాల్సిన ఆగత్యమేంటని ప్రశ్నిస్తున్నారు.

యూనిట్ విద్యుత్ రూ.2 కే: మార్కెట్‌లో యూనిట్ విద్యుత్ రూ.2 కే అందుబాటులో ఉండగా.. రూ.2.49 పైసలకు ఎందుకు కొంటున్నారనే సందేహం వస్తోంది. టెండర్లు పిలిచి ,ఆ తరువాత రివర్స్ టెండరింగ్‌కు వెళ్లితే...ఇంకా తక్కువ ధరకే సౌర విద్యుత్ లభిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ఒప్పందాలు లేకుండానే 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉండగా....ఎక్కడో రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్ల నుంచి కొనాల్సిన అవసరమేంటని నిపుణులు అంటున్నారు. ఆ ఫ్లాంట్లు ఇక్కడే ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, రైతుల భూములకు ధరలు, యువతకు ఉపాధి లభించేదనేది నిపుణులు మాట . అధిక ధరలతో విద్యుత్ కొనేందుకు సెకితో చేసుకున్న ఒప్పందం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, రాష్ట్రానికి ఆర్ధిక భారం కాదా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

2020 జూన్‌లో టెండర్లు: రాష్ట్రంలో 6400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రీన్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ 2020 జూన్‌లో టెండర్లకు పిలిచింది. యూనిట్‌కు 2.48 నుంచి 2.58 రూపాయలకు వివిధ సంస్థలు కోట్ వేశాయి. నిబంధనలు కొందరికి అనుకూలంగా ఉన్నాయని కొన్ని సంస్థలు కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. నిబంధనలు సక్రమంగా పెట్టి, ప్రక్రియ పారదర్శకంగా జరిపితే...రాష్ట్రంలోనే విద్యుత్‌ ప్రాజెక్టులు వచ్చేవని, అప్పుడు సెకితో ఎక్కువ ధరలకు ఒప్పందం చేసుకునే అవసరం ఉండేదే కాదని నిపుణులు అంటున్నారు.

ఏడాదికి 2,766 కోట్లు నష్టపోతున్నాం: యూనిట్‌ రూ.4.20 పైసలకు థర్మల్ విద్యుత్‌ అందుబాటులో ఉంటే యూనిట్‌కు రూ.5.90 పైసలు చొప్పున.. సౌరవిద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని జగన్ ఆరోపించారు. యూనిట్‌కు రూ.1.70 పైసలు చొప్పున ఏడాదికి 2,766 కోట్లు నష్టపోతున్నాం అని విమర్శించారు. సౌర విద్యుత్ ఇతర రాష్ట్రాల్లో తక్కువకు వస్తున్న విషయాన్ని గత ప్రభుత్వం ఆలోచించలేదన్నారు. గుజరాత్‌లో సెకి బిడ్‌లు వేస్తే యూనిట్ 2 రూపాయల 43పైసలకి ఇచ్చేందుకు సంస్థలు ముందుకు వచ్చాయని, ఆ ధరతో పోలిస్తే ఏడాదికి 3,831 కోట్లు నష్టపోతున్నాం అని జగన్ లెక్క చెప్పారు. అదే వైకాపా ప్రభుత్వం 2019లో యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49 పైసలకు అందించేందుకు సెకి లేఖ రాయగా.. వెంటనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అదే సెకి.. ఆల్‌జోమాయ్‌ ఎనర్జీ, వాటర్‌ కంపనీలకు యూనిట్‌ రూ.2 చొప్పున సరఫరా చేసేందుకు 2020 నవంబర్‌లో ఒప్పందం చేసుకుంది. గుజరాత్‌ ఊర్జా వికాస్ నిగమ్‌ లిమిటెడ్‌ యూనిట్‌ 1.99 చొప్పున కొనేందుకు ఆల్‌జోమాయ్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. సెకితో ఒప్పందం చేసుకునే ముందు ఇతర రాష్ట్రాల ఒప్పందాలపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఉంటే.. ఇప్పుడు అదనపు భారం పడేది కాదు. ఒక పక్క యూనిట్ 1.99 కే లభిస్తుంటే సెకికి యూనిట్ 50 పైసలు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు.

గత ప్రభుత్వం 25 ఏళ్లకు పీపీఏలు చేసుకోవడాన్ని జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం సెకితో పాతికేళ్ల ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 21 వేల 250 కోట్లు అదనపు భారం పడుతోంది.

ఇదీ చదవండి:

Power Cuts: ఎడాపెడా విద్యుత్​ కోతలు.. ప్రతి జిల్లాలోనూ రెండు మూడు గంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.