ETV Bharat / city

కుక్క గొడవ పెట్టింది.. 11 మంది కత్తులతో పొడుచుకున్నారు!

author img

By

Published : May 18, 2022, 3:49 PM IST

Conflict between two groups
కత్తులతో దాడి

Conflict between two groups: ఓ కుక్క రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది..! కారంపొడి, కత్తులతో దాడి చేసుకునేలా చేసింది.. 11 మంది తీవ్రంగా గాయాలడేలా చేసింది..! ఇంతకీ.. ఆ కుక్క ఏం చేసిందో తెలియాలంటే.. ఈ వార్త చదవాల్సిందే.

Conflict between two groups: కుక్క పెట్టిన ఈ గొడవ తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. కేవీబీపురం మండలం అంగేరి చెరువు గ్రామానికి చెందిన మహేష్.. ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఏదో పనిమీద అలా బజారులో నడుస్తూ వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్లగానే.. అక్కడున్న కుక్క అతన్ని కరవడానికి వచ్చింది. దీంతో.. ఆత్మరక్షణలో భాగంగా ఓ రాయి తీసుకొని కుక్క మీదకు విసిరాడు. ఆ రాయి గురితప్పి, ఓ ఇంట్లోకి వెళ్లి పడింది. వేరే ఎవరో ఇంట్లో పడితే పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ.. ఆ రాయి పడింది బద్ద శత్రువు ఇంట్లో!

మహేష్ ఇంటికి దగ్గర్లోనే ఉన్న వెంకటరామయ్య ఇంట్లో ఆ రాయి పడింది. ఈ రెండు కుటుంబాల మధ్య పదేళ్లుగా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు కుక్కపై విసిరిన రాయి.. మరోసారి ఆ వివాదాలను తెరపైకి తెచ్చింది. వెంటనే ఆవేశంతో రగిలిపోయిన వెంకట్రామయ్య కుటుంబసభ్యులు మహేష్‌తో గొడవకు దిగారు. ఈ విషయాన్ని మహేష్ తన కుటుంబ సభ్యులకు తెలపడంతో.. వాళ్లు రంగంలోకి దిగారు. ఇంకేముంది? చూస్తుండగానే చినికి చినికి గాలివానలా మారిన గొడవ.. తుపానులా మారిపోయింది. ఇరు కుటుంబాల వారు పరస్పరం.. కత్తులు, కర్రలు, కారం పొడితో.. ఓ రేంజ్ లో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్యం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.