ETV Bharat / city

CJI: శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ దంపతులు

author img

By

Published : Mar 5, 2022, 6:48 PM IST

Updated : Mar 6, 2022, 5:42 AM IST

CJI
CJI

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తిరుమలలో శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ దంపతులు కుటుంబసభ్యులతో కలిసి శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. ముందుగా తిరుమల చేరిన ఆయనకు శ్రీపద్మావతి అతిథిగృహం వద్ద తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్‌వో గోపినాథ్‌ జెట్టి పుష్పగుచ్ఛం అందజేసి, శేషవస్త్రంతో స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ కుటుంబసభ్యులు వరాహస్వామిని దర్శించుకున్నారు. శ్రీపద్మావతి అతిథిగృహంలో తితిదే ఏర్పాటు చేసిన 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు, డ్రైఫ్లవర్‌ సాంకేతికతతో రూపొందించిన శ్రీవారి చిత్రాల స్టాల్‌ను పరిశీలించారు.

గో తులాభారం చేయించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ...

అంతకు ముందు అలిపిరిలోని శ్రీ వేంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి మందిర విశిష్టతను వివరించారు. అనంతరం శ్రీ వేణుగోపాలస్వామిని దర్శించుకుని అక్కడే ఉన్న గో తులాభారం వద్దకు చేరుకుని గోమాతకు సరిపడా తులాభారంలో మొక్కులు చెల్లించుకున్నారు. మొదట తిరుపతిలోని శ్రీపద్మావతి అతిథిగృహం వద్ద తితిదే ఈవో జవహర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఆయన వెంట సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు రాజేష్‌ కుమార్‌ గోయల్‌, ప్రశాంత్‌ కుమార్‌ సూర్యదేవర, హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్‌, రిజిస్ట్రార్‌ వెంకటరమణ, రవీంద్రబాబు, జిల్లా జడ్జి పార్థసారథిÅ, మూడో అదనపు జిల్లా జడ్జి వీర్రాజు, ప్రోటోకాల్‌ మేజిస్ట్రేట్‌ కోటేశ్వరరావు, తితిదే తిరుపతి జేఈవో వీరబ్రహ్మం, కోర్టు ప్రోటోకాల్‌ సూపరింటెండెంట్‌ ధనుంజయ నాయుడు ఉన్నారు.

  • తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారిని శనివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తితిదే ఈవో జవహర్‌రెడ్డి, తితిదే తిరుపతి జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి

YV Subbareddy: శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్ల ధరలు పెంచే ఆలోచనే లేదు: వైవీ సుబ్బారెడ్డి

Last Updated :Mar 6, 2022, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.