ETV Bharat / city

NATU SARA: జిల్లాలో జోరుగా నాటుసారా వ్యాపారం.. రోగాల బారిన జనం

author img

By

Published : Oct 28, 2021, 10:20 AM IST

NATU SARA
జిల్లాలో జోరుగా నాటుసారా వ్యాపారం

తూర్పుగోదావరి జిల్లాలో నాటు సారా ఏరులై పారుతోంది. పల్లెలు.. పట్టణాలు, నగరాల్లోనూ గుప్పుమంటోంది. గతంతో పోలిస్తే తాగేవారి సంఖ్య బాగా పెరిగింది. రాజకీయ దన్నుతో గ్రామాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమార్కులు కేసులకు, పీడీ చట్టాలకు బెదరడం లేదు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా తయారీ, అమ్మకాల వైపే మొగ్గు చూపుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో నాటు సారా ఏరులై పారుతోంది. పల్లెలు.. పట్టణాలు, నగరాల్లోనూ గుప్పుమంటోంది. గతంతో పోలిస్తే తాగేవారి సంఖ్య బాగా పెరిగింది. రాజకీయ దన్నుతో గ్రామాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమార్కులు కేసులకు, పీడీ చట్టాలకు బెదరడం లేదు. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా తయారీ, అమ్మకాల వైపే మొగ్గుచూపున్నారు. గతంలో నవోదయం పేరుతో కట్టడి చేసినా.. ప్రస్తుతం మద్య నిషేధం పేరుతో చర్యలు పెంచినా.. క్షేత్రస్థాయి పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు బ్యూరో (ఎస్‌ఈబీ), పోలీసులు, అబ్కారీ అడపాదడపా చర్యలు చేపడుతున్నా.. కట్టడి అంతంతే.

ఘాటు ఇక్కడే..

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు.. జనసంచారం లేని మడ అడవులు.. గోదావరి ఇసుక తిన్నెల్లో సారా తయారీ సాగుతోంది. రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచి.. సముద్ర, రోడ్డు మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. జిల్లాలోని రంపచోడవరం డివిజన్‌లో విచ్చలవిడిగా సారా తయారవుతోంది. రాజానగరం, కోరుకొండ, సీతానగరం, గోకవరం, పెద్దాపురం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, పి.గన్నవరం, కిర్లంపూడి, రంగంపేట, గండేపల్లి, పెద్దాపురం, తుని, తొండంగి, పిఠాపురం, గొల్లప్రోలు, కోటనందూరు, తాళ్లరేవు తదితర మండలాల్లో తయారీ, నిల్వ కేంద్రాలు ఉన్నాయి.

వ్యసనమే.. శాపం..

మన్యంలో పది మండలాల్లోనూ నాటుసారా జాడలున్నాయి. సారా తయారీలో బ్యాటరీల్లో దొరికే కార్బన్, పంటలకు ఎరువుగా వేసే యూరియా, డీఏపీ వినియోగించడంతో ఆరోగ్యం గుల్లవుతోంది. సాధారణ మద్యంలో ఆల్కహాల్‌ 60-70 శాతం ఉంటే.. నాటుసారాలో 100 శాతమని వైద్యనిపుణుల మాట. బానిసైన వారు కాళ్లవాపు, ఇతర అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారు.
మైదానంలో పి.గన్నవరం మండలంలో పలువురు కిడ్నీ, కాలేయ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. బాధితుల్లో కాళ్లవాపు, పొట్ట, ముఖం ఉబ్బడం వస్తున్నాయి. ఆత్రేయపురం మండలంలో ఆరుగురు వరకు మత్తుకు బానిసై మృతి చెందినా బయటకు పొక్కలేదు.

మాది.. అడ్డదారి
* తాళ్లరేవు మండలంలో కోరంగి మడ అడవుల్లో నాటుసారా తయారీ కేంద్రంపై ఎస్‌ఈబీ అధికారులు దాడులు చేసి 1,400 లీటర్ల నాటుసారా, 46 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.
* కాకినాడ నగరానికి సముద్ర మార్గంలో ఫైబర్‌ బోట్ల ద్వారా నాటుసారా తరలిస్తున్నారు. యానాంలో గిరియంపేట, సావిత్రినగర్‌ ప్రాంతాల నుంచి బోటు ద్వారా తెచ్చిన నాటు సారాను గతంలో సెబ్‌ అధికారులు పట్టుకున్నారు.
* సారా తయారీకి అవసరమైన నల్ల బెల్లం చిత్తూరు, విశాఖ జిల్లాల నుంచి వస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఎలాంటి అడ్డూలేకుండా చెక్‌పోస్టులు దాటేసి వస్తుండటంతో తయారీకి దారులు తెరిచినట్లవుతోంది.

ఆరోగ్యం గుల్ల..
ఇంట్లో సెలైన్‌ ఎక్కించుకుంటున్న ఇతనికి 40 ఏళ్లు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పి.గన్నవరం మండలం గాజులగుంటవాసి. సారాకు బానిస కావడంతో కిడ్నీలు, కాలేయం దెబ్బతిన్నాయి. రెండు నెలలుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. రూ.50 వేల వరకు ఖర్చవగా భరించే పరిస్థితిలేక ఇంటికి వచ్చేశారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈయన దుస్థితికి కుటుంబ సభ్యులు కన్నీరుపెడుతున్నారు.

నాయకుల అండ..
కీలక నాయకుల సొంత గ్రామాల్లోనే సారా గుప్పుమంటోంది. తయారీ కేంద్రాలను గుర్తిస్తున్నా.. నిందితులు దొరకడం లేదు. తనిఖీల కంటే ముందే సమాచారం అక్రమార్కులకు చేరుతుండటంతో.. నిందితులు జారుకుంటుంటే.. సరకు మాత్రమే పట్టుబడుతోంది.

ఆత్రేయపురం
రాజవరం, బొబ్బర్లంక, పేరవరం, వెలిచేరుపాలెం, ఆత్రేయపురం, నార్కెడుమిల్లిలో 25 వరకు సారా తయారీ కేంద్రాలు ఉన్నాయి. నెలకు 15వేల లీటర్లకుపైనే సారా తయారవుతోంది. ఇక్కడ్నుంచి రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, ధవళేశ్వరం ప్రాంతాలకు ద్విచక్ర వాహనాల్లో, గోదావరిలో పడవల మీద తరలిస్తున్నారు.

పి.గన్నవరం
గాజులగుంట సారా తయారీ కేంద్రంగా మారింది. 50 వరకు బట్టీలు ఉన్నాయి. ఇటీవల తనిఖీల సమయంలో ఇళ్లలోనే సారా తయారీని గుర్తించారు. ఇక్కడి నుంచి లీటర్ల కొద్దీ నిల్వలు పి.గన్నవరం, అంబాజీపేట తదితర ప్రాంతాలకు వెళ్తున్నాయి.

పెద్దాపురం
పెద్దాపురం పరిధిలో ఆనూరు, దివిలి, కాండ్రకోట, మర్లావ, కట్టమూరు, తూర్పు పాకలు, జె.తిమ్మాపురం గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలు ఉన్నాయి. రాజకీయ దన్నుతో రూ.లక్షల్లో వ్యాపారం సాగుతోంది.

గండేపల్లి
మురారి, కె.గోపాలపురం, ఉప్పలపాడు, తాళ్లూరు, ఎన్టీరాజపురంలో తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఎనిమిది వేల లీటర్ల వరకు సారా తయారవుతోంది.

ప్రత్యేక నిఘాతో కట్టడి చేస్తున్నాం..
" నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించి కట్టడి చేస్తున్నాం. సెబ్, పోలీసుల ఆధ్వర్యంలో దాడులు చేస్తున్నాం. ఇటీవల పెద్దఎత్తున నాటుసారా పట్టుకుని, బెల్లం ఊట ధ్వంసం చేశాం. పలువుర్ని అరెస్టుచేశాం. తయారీ కేంద్రాలు, అనుమానిత మార్గాలపై నిఘా ఉంచాం. సారా తయారీ సామగ్రి రవాణాపైనా దృష్టిపెట్టాం. కేసులు పెడుతున్నా.. మారకుంటే రౌడీషీట్లు తెరిచి.. పీడీ యాక్ట్‌ నమోదుచేస్తాం. సారా తయారీ గ్రామాల్లో పరివర్తనకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాం." - ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ


ఇదీ చదవండి : Aided schools : పోరాడారు.. సాధించారు

rape: వివాహితపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.