ETV Bharat / city

Viveka Murder Case: సీబీఐ దర్యాప్తు వేళ సంచలనంగా మారిన వివేకా కుమార్తె లేఖ

author img

By

Published : Aug 14, 2021, 5:44 AM IST

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న వేళ.. పులివెందులలోని ఆయన ఇంటిని ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించడం సంచలనంగా మారింది. వైకాపా నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడు మణికంఠారెడ్డి రెక్కీ చేశాడని వివేకా కుమార్తె సునీత ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. తక్షణం తమ కుటుంబానికి పోలీసు భద్రత కల్పించాలని కోరారు. అటు వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు పలువురు అనుమానితులను సీబీఐ విచారించింది.

Viveka Murder Case
Viveka Murder Case

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు వేగంగా కొనసాగుతున్న తరుణంలో.. ఆయన కుమార్తె సునీత పోలీసులకు చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. తమ ఇంటి వద్ద ఓ అనుమానితుడు రెక్కీ నిర్వహించాడంటూ ఆమె కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఈ నెల 10న సాయంత్రం 5 గంటల సమయంలో పులివెందులలోని తమ ఇంటి వద్ద అనుమానితుడు రెక్కీ చేశాడని ఆమె లేఖలో పేర్కొన్నారు. రెండుసార్లు బైకుపై ఇంటి వైపు వచ్చివెళ్లాడని తెలిపారు. అనుమానితుడు వివేకా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా సునీత, ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. దీనిపై గురువారం పులివెందుల సీఐ భాస్కర్‌రెడ్డికి సునీత ఫిర్యాదు చేయగా..వివేకా ఇంటికి వచ్చి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ వ్యక్తిని మణికంఠారెడ్డిగా గుర్తించారు. ఇతడు వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి అనుచరుడిగా తేల్చారు. ఇటీవల శివశంకర్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మణికంఠారెడ్డి పులివెందులలో భారీ ఫ్లెక్సీలు వేసినట్లు సునీత లేఖలో పేర్కొన్నారు. మణికంఠారె‌డ్డిని విచారించిన తర్వాత రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు తొలగించారు. ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ..సునీత శుక్రవారం కడప ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో లేఖను కార్యాలయంలో ఇచ్చి వెళ్లారు.

సీబీఐ దర్యాప్తు వేళ సంచలనంగా మారిన వివేకా కుమార్తె లేఖ

పోలీసు భద్రత కల్పించాలి..

వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రధాన అనుమానితుడుగా ఉన్నాడని.. ఇప్పుడు ముప్పు తలపెట్టే పనులు చేపడుతున్నాడని సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు. లేఖతో పాటు సీసీటీవీ దృశ్యాలను పెన్‌ డ్రైవ్‌ ద్వారా ఎస్పీకి అందజేశారు. ఎస్పీకి రాసిన లేఖను డీఐజీ, డీజీపీతో పాటు సీబీఐ అధికారులకు కూడా పంపినట్లు లేఖలో తెలిపారు. పులివెందులలోని తమ కుటుంబానికి ఇంటి వద్ద పోలీసు భద్రత కల్పించాలని కోరారు. సునీత లేఖపై సాయంత్రం ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. వివేకా ఇంటివద్ద శాశ్వత ప్రాతిపదికన పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లేఖలో పేర్కొన్న ఇతర అంశాలపై విచారించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పులివెందుల డీఎస్పీని ఆదేశించినట్లు.. ఎస్పీ ప్రకటనలో వెల్లడించారు. పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో అర్బన్‌ సీఐని కలిసిన సునీత ఆయనకూ లేఖ అందజేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు వివేకా ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

కొనసాగుతున్న విచారణ..

అటు.. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా..అనుమానితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. పులివెందుల R అండ్‌ B అతిథి గృహంలో దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన రోజున ఇంటికి మొదటగా వచ్చినవారిలో శివశంకర్‌రెడ్డి ఉన్నారు. వైఎస్‌ కుటుంబసభ్యులతో పాటు ఆయన కూడా వచ్చారు. రక్తపు మరకలు తుడిచేస్తున్నా ఎందుకు ఆపలేదని సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. వివేకా గుండెపోటుతో చనిపోయారని మీడియాకు ఎందుకు ఫోన్‌ చేసి చెప్పారని అడిగినట్లు తెలిసింది. పులివెందుల సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్‌రెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించింది. మరో అనుమానితుడు.. సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మా పరమేశ్వర్‌రెడ్డినీ సీబీఐ అధికారులు విచారించారు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున.. కడప ఆసుపత్రిలో చేరి.. ఫోన్‌లో బిజీబిజీగా మాట్లాడినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా తేలింది. హత్య జరిగిన మరుసటి రోజు పరమేశ్వర్‌రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చేరగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలన్నటిపై సీబీఐ అధికారులు సుదీర్ఘంగా పరమేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలోనూ.. మరో రెండు సీబీఐ బృందాలు అనుమానితులను విచారించాయి. కస్టడీలో ఉన్న సునీల్‌ యాదవ్‌, డ్రైవర్‌ దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌ బంధువు భరత్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రవాణా అధికారులు మరోమారు కడపలో సీబీఐ అధికారులను కలిసి.. వారు అడిగిన వివారులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా మరికొందరు అనుమానితులను విచారించే అవకాశముంది.

శాశ్వత పోలీసు పికెట్‌: ఎస్పీ

పులివెందులలోని తమ ఇంటివద్ద భద్రత కల్పించాలని సునీత లేఖలో పేర్కొన్నారని, తక్షణమే ఆమె నివాసం వద్ద శాశ్వత పోలీసు పికెట్‌ ఏర్పాటుచేయాలని పులివెందుల డీఎస్పీని ఆదేశించినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. లేఖలో పేర్కొన్న వివిధ అంశాలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తామన్నారు.

ఇదీ చదవండి:

CS Meeting with IAS officers: మీరే రాకపోతే ఉద్యోగులెలా ఎలా వస్తారు: సీఎస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.