ETV Bharat / city

కొండపై గుహలో పిల్లలు.. శ్రమించి రక్షించిన పోలీసులు

author img

By

Published : Jun 16, 2020, 1:37 AM IST

ముగ్గురు పిల్లలు.. సరదా కోసం గ్రామ సమీపంలోని కొండ ఎక్కారు. తిరిగి వద్దామంటే దారి తెలియక అక్కడే చిక్కుకుపోయారు. పిల్లలు రాత్రైనా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చెంది.. చుట్టుపక్కల గాలించారు. వారు కొండపై ఉన్నట్లు గుర్తించి వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని పిల్లలు గుహలో ఉన్నారని గుర్తించారు. దాదాపు ఐదున్నర గంటలు శ్రమించి పిల్లలను రక్షించారు. కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఘటన వివరాలివి..!

కొండపై గుహలో పిల్లలు.. శ్రమించి రక్షించిన పోలీసులు
కొండపై గుహలో పిల్లలు.. శ్రమించి రక్షించిన పోలీసులు

కడప జిల్లా రాయచోటి మండలంలో కొండపై గుహలో ముగ్గురు పిల్లలు చిక్కుకుపోయారు. వడ్డేపల్లికి చెందిన గిరిబాబు, సురేశ్​బాబు, రెడ్డిబాబులు సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని వండాడి కొండపైకి సరదాగా ఎక్కారు. అక్కడ తప్పిపోయి దిగేందుకు దారి తెలియక రాలేకపోయారు. రాత్రి వరకు పిల్లలు ఇంటికి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. గ్రామం చుట్టుపక్కల గాలించినా వారి ఆచూకీ లభించలేదు.

కొండపై గుహలో గుర్తింపు

రాత్రి సమయంలో కొండ పైనుంచి కేకలు వినిపించడం వల్ల అడవిలో పిల్లలు చిక్కుకున్నారని గుర్తించిన గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద కొండ కావడం వల్ల వారిని గుర్తించలేకపోయారు. సమాచారం అందుకున్న రాయచోటి పోలీసులు అక్కడికి చేరుకుని పిల్లల కోసం గాలించాయి. సీఐ రాజు ఆధ్వర్యంలో మూడు బృందాలు కొండపై గాలింపు చేపట్టాయి. రెండు గంటలపాటు శ్రమించి పిల్లలు గుహలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారు సురక్షితంగా ఉన్నట్లు తెలుసుకొని గ్రామస్థులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

అర్ధరాత్రి దాటాక కిందకు

ఆకలి దప్పులతో అలమటించిన పిల్లలకు ఆహారం, తాగునీరు అందేలా పోలీసులు చర్యలు చేపట్టారు. తాళ్ల సహాయంతో రాత్రి ఐదున్నర గంటల పాటు శ్రమించి.. కొండ పైనుంచి పిల్లలను సురక్షితంగా కిందకు చేర్చారు. లాక్​డౌన్​ క్రమంలో ఇంటి వద్ద ఉన్న పిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ గమనించాలని పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి..

ఎల్జీ పాలిమర్స్ కేసు: హైకోర్టు తీర్పుపై 'స్టే'కు సుప్రీం నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.