AKBER BASHA: 'భూమి ఇస్తామన్నారు.. రాజీ కుదుర్చుకున్నాం'

author img

By

Published : Sep 12, 2021, 5:56 PM IST

Updated : Sep 13, 2021, 2:03 AM IST

సెల్ఫీ వీడియో బాధితుడు అక్బర్ బాషా

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన కడప జిల్లా సెల్ఫీ వీడియో ఘటన రాజీతో సుఖాంతమైంది. భూమిని తిరిగిచ్చేందుకు వైకాపా నేత తిరుపాల్​రెడ్డి కుటుంబం అంగీకరించినట్లు బాధితుడు అక్బర్ బాషా తెలిపారు.

'నాకు జరిగిన అన్యాయాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన 48 గంటల్లోపే ముఖ్యమంత్రి జగన్​ స్పందించి సమస్యను పరిష్కరించారు. భూమిని నా పేరిట రాసిస్తామని వైకాపా నేత తిరుపాల్​రెడ్డి చెప్పడంతో మేము రాజీ అయ్యాం' అని కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్​ భాషా తెలిపారు.


దువ్వూరు వైకాపా నేత తిరుపాల్‌రెడ్డితో రాజీ కుదుర్చుకున్నాం. మా భూమి తిరిగిచ్చేందుకు తిరుపాల్‌రెడ్డి కుటుంబం ఒప్పుకుంది. రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది. - అక్బర్ బాషా

ఏం జరిగిందంటే...

కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లెలో పోలీసులు వేధిస్తున్నారని ఓ మైనారిటీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. మైదుకూరు గ్రామీణ సీఐ వేధిస్తున్నారని అక్బర్ బాషా కుటుంబసభ్యులు కంటతడి పెట్టారు. న్యాయం జరగపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.

దువ్వూరు మండలానికి చెందిన ఓ వైకాపా నాయకుడు తమ కుటుంబానికి చెందిన 1.5 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచన మేరకు మైదుకూరు రూరల్ సీఐకి తమ సమస్యను వివరించారు. తన సమస్యను పరిష్కరించకుండా వైకాపా నేతకు అనుకూలంగా సీఐ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రూపొందించారు. సీఐ కొండారెడ్డి, వైకాపా నాయకుడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటిపర్యంతమయ్యారు. తన సమస్యపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

సీఐ కొండారెడ్డిపై వేటు

మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణాధికారిగా అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించామని, రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. అప్పటివరకు సీఐని విధుల నుంచి తప్పిస్తున్నామని, నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని అన్నారు. సెల్ఫీవీడియో పోస్టు చేయగానే చాగలమర్రి, మైదుకూరు పోలీసులను అప్రమత్తం చేసి బాధిత కుటుంబం అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడామని, పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 9న ‘స్పందన’లో అక్బర్‌బాషా పిటిషన్‌ ఇచ్చారని, దానిపై విచారిస్తుండగానే ఈ వీడియో వైరల్‌ అయ్యిందని తెలిపారు.

అక్బర్‌ బాషా సెల్ఫీ వీడియోపై రాత్రి 11.20 గం.కు స్పందించాం. ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో బాషా పిటిషన్‌ ఇచ్చారు. సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించాం. సీఐ కొండారెడ్డిని 2 రోజులపాటు విధుల నుంచి తప్పించాం.

- ఎస్పీ అన్బురాజన్, కడప జిల్లా

సీఐ వేధిస్తున్నాడంటూ... తాను పోస్ట్ చేసిన వీడియోపై జిల్లా ఎస్పీ స్పందించి, సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారని బాధితుడు అక్బర్ బాషా తెలిపారు. తన సమస్యపై సీఎం కార్యాలయం కూడా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుందని వెల్లడించారు. 2009లోనే భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్న అక్బర్‌ బాషా... వైకాపా నేత తిరుపాల్‌రెడ్డి కుటుంబం భూమి ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతలకు అనుకూలంగా సీఐ కొండారెడ్డి వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యపై స్పందించిన ఎస్పీ.. సీఎంవో ఆదేశాల మేరకు వారంలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఐ. కొండారెడ్డిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు వివరించారు.

ఇదీచదవండి.

Fake Stickers: వాహనాలపై ఫేక్​ స్టిక్కర్స్​..తనిఖీల్లో విస్తుపోయే నిజాలు!

Last Updated :Sep 13, 2021, 2:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.