ఆస్తి పన్ను పోటు.. గుంటూరులో ప్రత్యేక నోటీసులు జారీ

author img

By

Published : Nov 17, 2021, 7:07 AM IST

tax imposed on asset based

ప్రభుత్వం తీసుకొచ్చిన ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధించే పన్ను అమలులోకి వచ్చింది. ఇందుకోసం పట్టణ స్థానికసంస్థలు ఇప్పటికే నోటీసులు జారీచేయడం మొదలుపెట్టాయి. జీవో 198 ప్రకారం మూలధన విలువపై విధించే పన్నుతో సమానం అయ్యేవరకూ ఏటా 15% మేర పెరిగితే భారం తప్పదన్న విషయం ప్రజలకు అర్థమవుతోంది.

ఆస్తి మూలధన విలువ ఆధారంగా విధించే పన్ను అమలులోకి వచ్చింది. ఇందుకోసం పట్టణ స్థానికసంస్థలు ఇప్పటికే నోటీసులు జారీచేయడం మొదలుపెట్టాయి. జీవో 198 ప్రకారం మూలధన విలువపై విధించే పన్నుతో సమానం అయ్యేవరకూ ఏటా 15% మేర పెరిగితే భారం తప్పదన్న విషయం ప్రజలకు అర్థమవుతోంది. కొత్త విధానంలో మొత్తం పన్ను పెంపు 100-300 శాతం వరకూ ఉంది. పెంపు ఏడాదికి 15% మాత్రమే ఉండటంతో ఇప్పటికిప్పుడు భారం కనిపించదు గానీ, కొన్నాళ్ల తర్వాత తెలుస్తుంది. గుంటూరు నగరపాలక సంస్థలో పన్ను పెంచుతూ తాజాగా నోటీసులు ఇచ్చారు. మిగిలిన పట్టణ స్థానిక సంస్థల్లో కూడా నోటీసులు వస్తే గానీ, అక్కడి ప్రజలకు ఎంత భారం పడేదీ తెలియదు.

* ఉదాహరణకు పట్టాభిపురంలోని డోరు నంబరు 3-2-40/1లో ఇంటిపై 216%, రామానుజకూటంలో 30-20-103లో ఇంటిపై 297% పెరుగుదల ఉంది. పెంపులో మొదటి ఏడాది 15 శాతానికి పరిమితం చేయడంతో 2021-22లో పన్ను భారం తక్కువగా ఉన్నట్లు అనిపించినా ఏటా పెంచితే తడిసి మోపెడవుతుందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కొత్త ఇళ్లకు పూర్తి పన్ను

* కొత్తగా నిర్మించిన భవనాలకు రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారంగా నేరుగా కొత్త పన్ను విధిస్తారు. వీటికి ఏటా 15% పెంపుదల వర్తించదు. కొత్త పన్నులపై తాఖీదులు జారీచేస్తున్న కారణంగా పురపాలకశాఖ కొన్ని ఆన్‌లైన్‌ సేవలను తాత్కాలికంగా ఆపింది. వీటిలో కొత్త ఇళ్లు, భవనాలకు పన్ను విధింపు ఒకటి. పోర్టల్‌లో మార్పులు అందుబాటులోకి వచ్చాక పన్నులు విధించాలన్న ఆదేశాలతో ప్రస్తుతం నిలుపుదల చేశారు.

* ఉదాహరణకు ఆస్తి మూలధన విలువ ప్రకారం గుంటూరులో ఒక ఇంటి విలువ రూ.50 లక్షలు అనుకుంటే... దానిపై 0.065% పన్ను విధిస్తారు. అంటే 6 నెలలకు రూ.3,250 (ఏడాదికి రూ.6,500) పన్ను చెల్లించాలి.

* రూ.50 లక్షల విలువైన వాణిజ్య భవనమైతే మొత్తం విలువపై 0.15% పన్ను విధించనున్నారు. అంటే అర్ధ సంవత్సరానికి రూ.7,500 (ఏడాదికి రూ.15,000) పన్ను చెల్లించాలి.

76,605 అసెస్‌మెంట్ల అప్‌లోడ్‌

* పెరిగిన పన్ను నోటీసులు ప్రజలకు అందించడంలో పట్టణ స్థానికసంస్థలు గోప్యత పాటిస్తున్నాయి. రాష్ట్రంలో 71 పుర, నగరపాలక సంస్థల్లో 76,605 ఇళ్లు, భవన నిర్మాణాలకు ప్రత్యేక నోటీసులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. వీటిలో కొన్నింటిని ఇప్పటికే ప్రజలకు జారీచేశారు. మిగతాచోట్ల కంటే గుంటూరులో అసెస్‌మెంట్లు ఎక్కువగా అప్‌లోడ్‌ చేసి, కొన్నింటిని జారీ చేయడంతో పన్ను పెంపు విషయం వెలుగులోకి వచ్చింది.

* పెరిగిన పన్నుపై జారీచేసే ప్రత్యేక నోటీసులు అందిన 15 రోజుల్లోగా ప్రజల నుంచి అభ్యంతరాలు రాకపోతే అందుకు సమ్మతించినట్లుగా భావించి పన్ను వసూలు చేస్తారు. 2021 ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు ఇప్పటికే చాలామంది పన్నులు చెల్లించారు. కొత్త పన్నులో నుంచి ఆయా మొత్తాలను మినహాయించి మిగిలిన బ్యాలెన్స్‌ వసూలు చేయనున్నారు. మార్చి నెలాఖరులోగా ఏడాది పన్ను మొత్తం రెండు విడతలుగా చెల్లించాలి.

* గ్రంథాలయ పన్ను కూడా పెరిగింది. ఉదాహరణకు గుంటూరులోని 3-20-40/1 డోర్‌ నంబరు ఇంటికి గతంలో గ్రంథాలయ పన్ను అర్ధ సంవత్సరానికి రూ.29 ఉండేది. దాన్ని రూ.92కు పెంచారు. ఈ పెంపు కూడా తాజాగా పెరిగే 15%లో భాగంగానే ఉంటుంది.

.
.

ఇదీ చదవండి: Farmers Protest: 700వ రోజు అమరావతి మహోద్యమం.. ప్రభంజనంలా సాగిన పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.